లేఖ... ప్రేమ లేఖ !
--- మామిడిహరికృష్ణ, 8008005231
ఈ ప్రపంచంలో సంభవించిన సాహితీ, సాంస్కృతిక, శాస్త్రసాంకేతిక, సామాజిక, ఆర్థిక ఆవిష్కరణలన్నీ ఆయా సమాజాల అవసరాల నుంచి ఉద్భవించినవే. అందుకే Necessity is the mother of all inventions అని అంటారు. వేర్వేరు కారణాల వల్ల దూరంగా ఉంటున్న వ్యక్తుల మధ్య సమాచారం - క్షేమం - వర్తమానవిశేషాలు - వికాసం సంబంధించిన వివరాలను చేరవేసుకోవాలి, తద్వారా దూరాలకు అతీతంగా మానవ సంబంధాలను పటిష్టంగా కాపాడుకోవాలనే ఆలోచనలోంచి పుట్టిన సాహితీ సృజనాత్మక ఆవిష్కరణ - లేఖ!
ఒకానొక కాలంలో లేఖలు, లేఖాసాహిత్యం, మానవ జీవితంలో ఎంతో ప్రాముఖ్యతను సాధించాయి... కానీ కాలక్రమంలో డిజిటల్ టెక్నాలజీ ఇంటర్నెట్ల ఆగమనంతో, గతకాలపు ఇతర సంప్రదాయాలు, రీతులలాగే లేఖ/ఉత్తరం కూడా ఇపుడు ‘‘అంతరించిపోయే అలవాటు’’ (Endangered Habit) గా పరిణమించింది. ఈలాంటి సందర్భంలోనే ఇటీవల సాహిత్యరంగంలో సంభవించిన రెండుప్రయత్నాలు -- ఉత్తరాలు అందులోనూ ప్రేమలేఖల ప్రేమికుల గుండెల్లో మళ్ళీ వసంతపు చిగుళ్ళను వేయించాయి. వాటిలో ఒకటి - హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంలో సంవత్సరంపాటు ప్రసారమై ఇటీవల పుస్తకంగా విడుదలైన శ్రీమతి అయినంపూడి శ్రీలక్ష్మి గారి ‘‘కొత్త ప్రేమ లేఖలు’’ కాగా, రెండోది యువ రచయిత్రి కడలి సత్యనారాయణ ప్రచురించిన ‘‘లెటర్స్ టు లవ్’’ పుస్తకం !
అదే విధంగా కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రజలంతా స్వీయ నిర్బంధం లో ఇళ్లలోనే ఉన్న సందర్భంలో జరిపిన ఒక ఆన్ లైన్ సర్వేలో, అత్యధిక ప్రజలు తమ పాత వస్తువులలో ఎక్కువగా ఇష్ట పడే అంశంగా లేఖలకు పట్టం కట్టారు! ఈ నేపధ్యంలో ఉత్తరాల పరిణామాన్ని, లేఖా సాహిత్యపు తీరు తెన్నులను విశ్లేషించడమే ఈవారం ‘కవర్ స్టోరీ ’!
***************************************************************************************
“How wonderful it is to be able to write Someone a letter! To feel like conveying your thoughts to a person, to sit at your desk and pick up a pen, to put your thoughts onto words like this is truly marvelous.”
ప్రఖ్యాత జపనీస్ రచయిత Haruki Murakami 1987లో రాసిన Norwegian Wood నవలలో ఒకచోట లేఖల గురించి చెప్పిన వాక్యాలివి. ప్రతిష్టాత్మక World Fantasy Award ను, Franz Kafka Prize ను గెల్చుకున్న ఈ రచయిత లేఖారచనలో ఇమిడి ఉండే హృదయ గత అనుభూతులను సరళంగానే అయినా చక్కగా వ్యక్తీకరించాడనడంలో సందేహం లేదు...
అందుకే ఉత్తరం అంటే హృదయనివేదన...! ఆత్మావిష్కారం!! అభిప్రాయాల కలబోత!! విషాదానందాల వలపోత!
మన నిత్య జీవితంలో ఉండే ఉద్వేగక్షణాలను, ఉత్తేజ సందర్భాలను, ఉల్లాస సన్నివేశాలను, ఉత్కృష్ట సమయాలను అక్షరాలలో పొదిగి, తెల్లకాగితంపై అందంగా లిఖించే మనఃపూర్వక కళ- లేఖారచన!
అందుకే ఉత్తరం, అది పుట్టినప్పటి నుంచీ మనుషుల మధ్య అక్షరవారధిని కట్టింది! ఆలోచనాస్ఫోరకమై నిలిచింది! ఆత్మీయ భాషణమై భాసించింది! ఆచరణాత్మక దృక్పథమై మార్గదర్శనం చేయించింది.
ఇంతగా మనుషుల జీవితాలతో పెనవేసుకు పోయిన ఉత్తరం గత రెండు దశాబ్దాలకాలం నుంచీ క్రమంగా అదృశ్యమవుతూ వస్తూంది. మానవజాతి నిర్మించుకున్న ఎన్నో విశిష్టమైన సంప్రదాయాలలో లేఖా రచన కూడా ఒకటిగా కొనసాగి, ఇప్పుడు అంతరించి పోతున్న ఇతర సంప్రదాయాల కోవలోకి చేరింది...
ఒకప్పుడు అక్షింతలను, కన్నీళ్ళను, నమ్మకాన్నీ, ధైర్యాన్నీ, ఆశలనూ, మొత్తంగా జీవితాన్నీ, జీవనేచ్ఛనూ మోసుకొచ్చిన ఉత్తరం ఇప్పుడు మానవ మస్తిష్కపు స్టోర్రూమ్లో ‘పాత వస్తువు’గా మారిపోయింది...
అందుకే ఉత్తరం 1990 తరపు మనుషుల వరకూ ఓ నోస్టాల్జీయా... ఒకజ్ఞాపకం... ఒక దిగులు... ఒక బెంగ... ఒక పోగొట్టుకున్న జీవనపార్శ్వం... ఒకకోల్పోయిన ప్రపంచ శకలం... అన్నింటినీ మించి ఒక శిథిల స్వప్నం!
ఇలా మనసులోనే లుంగలు చుట్టుకుని కునారిల్లుతూ, నవజీవన శైలుల మెరుపులను కళ్ళకు ఎంతగా అతికించుకున్నా, గుండెలోతుల్లో ఏ మూలో నిరుడు కురిసిన లేఖా హిమసమూహాలను తల్చుకుంటూ, మనోభారంతో ‘పెన్ను’నీడుస్తున్న క్షణాన...
నిత్య జీవన పోరాటంలో పరుగెత్తుతూ వర్తమానం వెంట భవిష్యత్తు వెలుగుల కోసం వెంపర్లాటలు పెరిగిన క్షణాన...
ప్రపంచమంతా ఒక్క కుదుపు...
వాయువేగ, మనోవేగాలతో భ్రమిస్తూ, పరిభ్రమిస్తూ ప్రపంచం అంతా ఒక్కసారిగా ఆగిపోయి స్థాణువై స్తంభించి పోయేలా చేసిన మహా కుదుపు...
మానవాళిపై కరోనా మహమ్మారి దాడి! దేశాలు, ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ప్రజలంతా స్వీయ నిర్భధంలో, ఇళ్ళలో ఉండాల్సి వచ్చింది... ఈ ‘లాక్ డౌన్’ ప్రపంచ గమ్యాన్నిచెరిపింది. విశ్వ గమనాన్ని కుదిపింది. ఆర్ధిక వ్యవస్థలను, అభివృద్దిని నిశ్చేష్టపరిచింది. అలాగే ఎక్కడా క్షణ కాలమైనా ఆగకుండా, అలుపు లేకుండా దూసుకుపోతున్న మనిషి ఒక్కసారి ఆగిపోయి, తన గతంలోకి, నడిచొచ్చిన బాటవైపు, తనలోకి తొంగి చూసుకునే అవకాశాన్ని కూడా కలిగించింది.
ఈ సంధర్భంలో ప్రజలంతా, ఇంతకాలం తమస్టోర్ రూమ్ లలో ఉంచిన, దుమ్ము కొట్టుకుపోయిన ఎన్నెన్నో వస్తువులను వెలికి తీసారు... జ్ఞాపకాలను తవ్వుకున్నారు... ఆ తవ్వకాలలో భయల్పడ్డ ఎన్నెన్నో విస్మృత అనర్ఘ రత్నాలలో ఒక అద్భుతం - ఉత్తరం !
లాక్ డౌన్ సంబంధిత అంశాలపై ఇటీవల జరిపిన ఓ ఆన్ లైన్ సర్వేలో, "మీ పాత వస్తువులలో ఇప్పటికీ మీకు ఏది గొప్పగా అనిపించింది?" అన్న ప్రశ్నకు దాదాపు 80% మంది పాతకాలంలో తాము రాసిన, అందుకున్న ఉత్తరాలే అని చెప్పారు...
ఇలా, కాలం చెల్లింది అనుకుంటున్న లేఖలు మళ్ళీ మన హృదయ సౌధంలో కేంద్ర స్థానాన్ని అలంకరించాయి. అలాగే ఉత్తరం ఇంతకాలం కేవలం ఓ ‘Nostalgia’ అనుకున్నారు. కానీ ఇది ఓ panacea (మరిచిపోయిన ఎన్నెన్నో జ్ఞాపకాలను తిరిగి బతికించిన అమృతం) అని ఈ సర్వేలో వెల్లడయింది.
ఇలా లేఖలు తక్షణ ప్రయోజనాన్ని ఆశించే ‘ఉభయకుశలోపరి’తో మొదలై “ఇట్లు మీ శ్రేయోభిలాషి” గా ముగించినప్పటికీ, కొన్ని లేఖలు మాత్రం సాహిత్య రంగంలో కావ్య ప్రతిపత్తిని, శాశ్వతత్వాన్ని కూడా సాదించాయి. అలాంటి లేఖలు ‘లేఖ సాహిత్యం’గా ఉదాత్తత్వాన్ని, ఉన్నతత్వాన్ని సాధించడం విశేషం.
లేఖాసాహిత్యం : (Epistolary)
సాహిత్యంలోఎన్నెన్నోప్రక్రియ (Genre) లువాడుకలోఉన్నాయి. దీనికి ఆయా సాహిత్య ప్రక్రియలలోని వస్తువు (Theme), శైలి (style), శిల్పమే(technique), ప్రధానకారణాలు. ఆలెక్కన విశ్లేషిస్తే ఉత్తరాలు, లేఖల ద్వారా విషయాన్ని చెప్పే విధానాన్ని ‘లేఖా సాహితీ ప్రక్రియ’గా చెప్పవచ్చు.
ఈ లేఖాసాహిత్యానికి సమానార్థకంగా ఇంగ్లీష్లో ‘Epistolary’ అని పిలుస్తారు. ఇది గ్రీక్ పదం ‘Epistle అంటే ‘అక్షరం’ లేదా ‘ఉత్తరం’ నుండి ఏర్పడింది. అంటే Epistolary is a literary genre pertaining to letters అన్నమాట!
ఉత్తరం రాయడం ఓ కళ !
మన నిత్య వ్యవహారంలో ‘ఉత్తరం రాయడమూ ఒక కళే’ అని అందరూ అంటుండగా వింటుంటాం. కానీ ఉత్తరం రాయడాన్ని ఓకళాత్మక విషయంగా అధ్యయనం చేసే శాస్త్రం ఒకటుందనే విషయం మాత్రం అంతగా తెలీదు. ఈ ఉత్తరం రాసే కళనే గ్రీకులు ప్రాచీన కాలంలోనే ‘Epistolography ‘ అని పిలిచారు. Epistole అంటే అక్షరం, ఉత్తరం అనీ, graphia అంటే రాయడం, లిఖించడం అనీ అర్థం. ఈ రెండు పదాల కలయిక నుంచే ఈ లేఖా రచనా శాస్త్రం (Epistolography) ఉద్భవించింది.
కాగా ఈ శాస్త్రం యూరప్లో బైజాంటైన్ సామ్రాజ్యయుగంలో స్వర్ణయుగాన్ని చవి చూసిందని చెప్పాలి. ప్రాచీన కాలంలో తూర్పు రోమన్ సామ్రాజ్యానికే బైజాంటియమ్ అని పేరు. ఇది యూరప్లో క్రీ.శ. 395 నుండి 1453 వరకు రాజ్యమేలింది. ఈ సామ్రాజ్య రాజధాని అయిన బైజాంటియమ్ నగరం 1453లో ఆటోమాన్ టర్కుల ఆక్రమణ అనంతరం ‘కాన్స్టాంటి నోపిల్’ గా, ఆ తర్వాత ఆధునిక కాలంలో ‘ఇస్తాంబుల్’గా పేరుపొందింది.
ప్రాచీన బైజాంటియన్ చక్రవర్తులు తమ శాసనాలకు, చట్టాలకు సంబంధించిన ప్రతీ అంశాన్నీ ప్రజలకు, ఇతర రాజులకు ఉత్తరాల ద్వారా తెలియజేసేవారు. దీని కోసం వారు ఉత్తరాన్ని, లేఖలను రసరమ్యంగా, మనోరంజకంగా రాయడం కోసం ప్రత్యేక నిపుణులను నియమించుకోవడమే కాక, రాజశిక్షణలో యుద్ధ విద్యలతో పాటు ఒక అంశంగా ఈ లేఖా రచనా కళను అభ్యసించారని చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తోంది. అంటే రాజ్యాల మధ్య యుద్ధంలేదా శాంతి ఏర్పడాలన్నా, ప్రజలలో రాజు పట్ల భక్తి భావం, విధేయత పెరగాలన్నా లేఖ రాసే విధానం వల్లనే సాద్యమవుతుందనే మౌలిక విషయాన్నిఈ రోమన్ చక్రవర్తులు తెలుసుకున్నారని దీన్ని బట్టి చెప్పవచ్చు. అలా లేఖకు ఉండే శక్తిని ఈ ఉదంతాలు తేటతెల్లం చేస్తాయి.
తోకలేని పిట్ట నుండి ట్విట్టర్ దాకా... :
నిజానికి ‘లేఖ’ ప్రధానలక్ష్యం - ‘‘సమాచారాన్ని, సందేశాన్ని ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి చేరవేయడం!’’ నిర్దేశిత వ్యక్తులు ప్రత్యక్షంగా కలుసుకోలేకున్నా, దూరంగా ఉన్నా వారిమధ్య సమాచార మార్పిడికి, తద్వారా తదనంతర కార్యాచరణకు దోహదం చేసే మానవ అవసరంలోంచి ఉత్పన్నమైన లిఖిత విశేషమే- లేఖ!
అయితే ‘లేఖలు’ వేలాది సంవత్సరాల నుంచీ ఎన్నో దశలను దాటి, ఎన్నెన్నో పరిణామాలను చవి చూసాయి. మొదట్లో లేఖ సారాంశం మౌఖికంగా వార్తాహరులు, రాయబారులు, అనుచరులు ద్వారా చేరవేయడం జరిగేది. ఆ తర్వాత శిలలపై చెక్కిన అక్షరాల ద్వారా, ఆ తర్వాత తాళ పత్రాల ద్వారా, వస్త్ర పత్రాల ద్వారా లేఖలు సమాచారాన్ని చేరవేసేవి. ఈ కాలంలో లేఖలను ఒకచోటు నుంచి మరోచోటుకి చేర్చే మాధ్యమాలలో మనుషులు, పక్షులు, జంతువులు వాహకాలుగా ఉపయోగించబడేవారు.
మన దేశంలో 1853లో రైల్వే రవాణా ప్రారంభం కావడం, 1854లో తపాలా విధానం అమలులోకి రావడంతో లేఖా సంప్రదాయం రాజులు, కులీనులకు మాత్రమే కాక, చదువుకున్నఇతర సమాజాలకి కూడా అందుబాటులోకి వచ్చాయి. మరో వైపున ‘లేఖల చేరవేత’ విధానం వ్యవస్థీకృతం అయి ఉత్తరాలు, లేఖల బట్వాడా సులభతరం అయింది.
ఆతర్వాత సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ, లేఖలు మరెన్నో పరిణామాలకు లోనయ్యాయి. అలా టెలిగ్రామ్, ఫాక్స్ (ఫాసిమిలీ) విధానాలు అందుబాటులోకి వచ్చాయి. కాగా 2000 సంవత్సరం తర్వాతదేశంలోమొదలైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంటర్నెట్ వంటి వాటివల్ల పేజర్, ఈ మెయిల్, షార్ట్ మెసేజస్ సర్వీస్ (SMS) వంటివి ఇప్పుడు జనబాహుళ్యం లోకి వచ్చి ‘‘సంప్రదాయలేఖ’’ అనే అర్ధాన్ని, వ్యవస్థను మార్చివేసాయి. ఇక సోషల్ మీడియా (ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సప్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్) విజృంభణతో లేఖలు, లేఖా సాహిత్యంఅనేవి గతకాలపు చిహ్నాలుగా, అంతరించిపోయే సంప్రదాయంగా మారిపోయాయి.
అయితే, కొంచెం సానుకూలంగా ఆలోచిస్తే ‘లేఖ’ లోని ‘ఆత్మ’ (సమాచారాల చేరవేత) కనుమరుగు కాలేదనీ, లేఖ రూపం మాత్రమే (పేపర్ నుండి పేపర్లెస్ ఈ-మెసేజ్లకు) మారిందనీ అర్థమవుతుంది. ఆలెక్కన ప్రస్తుతం న్యూజనరేషన్ సాంకేతిక రూపాలైన మెయిల్, మెసేజ్ వంటివన్నీ ‘లేఖ’కు కొనసాగింపులుగానే భావించాల్సి ఉంటుంది.
ప్రపంచలేఖాసాహిత్యం - ప్రముఖరచనలు :
లేఖాసాహిత్యం (Epistolary) ప్రక్రియలో ప్రపంచభాషలలో వచ్చిన తొలి నవలగా 1485లో Diego de San Pedro స్పానిష్ భాషలో రాసిన ‘Prison of Love’ ని చెప్పుకోవచ్చు. కాగా ఇంగ్లీష్ సాహిత్యంలో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన సాహితీవేత్తగా Howell (1594-1666)ను సాహితీ చరిత్రకారులు చెపుతారు. ఈయన రాసిన ‘Familiar Letters’ అనే గ్రంథం ఈ ఘనతను సాధించింది. ఇందులో ఆయన విదేశాలు, యాత్రలు, సాహసాలు, స్త్రీలు, జైలు, జీవితం, ప్రజలు, అలవాట్లు వంటి ఎన్నో అంశాలను ఉత్తరాల రూపంలో వ్యక్తీకరించారు.
ఇక, ఈప్రక్రియలో పూర్తి స్థాయి నవల, Aphra Behn రాసిన Love-Letters Between a Nobleman and His Sister అని చెప్పాలి. ఈ నవల మూడు భాగాలుగా 1684, 1685, 1687 సంవత్సరాలలో వెలువడి సంచలనం సృష్టించింది. కాగా 18వ శతాబ్దం నాటికి ఈ సాహితీ ప్రక్రియ అమిత ప్రజాదరణ పొందింది. దీనికి Samuel Richardson రాసిన Pamela (1740), Clarissa (1749) నవలలు ఎంతగానో దోహదపడ్డాయి. ఇందులో Pamela నవల ఇతివృత్తం అంతా - Mr. B అనే యజమాని దగ్గర పనికి కుదిరిన పమేలా తన పేద తల్లిదండ్రులకు రాసే ఉత్తరాల పరంపరగానే ఉంటుంది .
అయితే ప్రఖ్యాత రాజనీతిజ్ఞులు, ‘అధికార పృథక్కరణ సిద్ధాంతం’ (Theory of separation of Powers) ను ప్రతిపాదించిన Montesquieu 1721 లో Letters Persian పేరుతో ఫ్రెంచ్లోఉత్తరాల రూపంలో గ్రంధాన్ని రాయడం విశేషం. అలాగే, ప్రముఖ ప్రకృతి వాద తత్త్వవేత్త (Naturalism) సామాజిక ఒడంబడిక సిద్ధాంతకర్త (Social Contract Theory) Jean-Jacques Rousseau కూడా Julie, or the New Heloise పేరుతో 1761లోరాసాడు. ప్రముఖ జర్మన్ తత్వవేత్త - సాహితీకారుడు Johann Wolfgang Von Goethe కూడా 1769లో The Sorrows of Young Wert her అనే నవలను రాసాడు. ఇవన్నీలేఖాసాహిత్య కోవకు చెందినవే!
18వ శతాబ్దం నాటికి ఈలేఖా సాహిత్య ప్రక్రియ ఎంత ఉధృతిని సాధించిందో అంతే విమర్శను కూడా ఎదుర్కొంది. ఆతర్వాత ఈప్రక్రియను చిన్న బుచ్చుతూ కొన్ని వ్యంగ్య రచనలు, ప్రహసనాలు కూడా వెలువడ్డాయి. అయితే ఈవ్యంగ్య రచనలను చేసిన వారు ప్రముఖ రచయితలు కావడం గమనార్హం! Samuel Richardson రాసిన Pamela నవలకు కౌంటర్గా Shamela (1741) నవలను Henry Fielding, రాయగా, మరో ప్రముఖ సాహితీ వేత్త Oliver Goldsmith లండన్లో నివసించే చైనీయతత్వవేత్తగాథగా The Citizen of the World పేరుతో 1761లో ఒక నవలను రాసాడు. అలాగే ప్రఖ్యాత Pride and Prejudice నవలను రాసిన Jane Austen కూడా తన తొలినాళ్ళలో Lady Susan పేరుతో 1794లో ఓ నవలను ఈ లేఖా సాహిత్య సంప్రదాయంలోనే రాసింది.
మరో ప్రఖ్యాత రచయిత, నాటకకర్త Honore de Balzac రాసిన Letters of Two Brides నవల విమర్శకులను సైతం ఆకట్టుకుంది. విద్యార్ధిదశలో స్నేహితులైన ఇద్దరు అమ్మాయిలు పాఠశాలను వదిలిన తర్వాత కాలంలో వారి జీవితంలో సంభవించిన మార్పులను ఉత్తరాల రూపంలో వెల్లడించిన ఈ నవల, సాహితీ ప్రస్థానంలో ఓ మైలురాయిలా నిలిచిపోయింది.
ఈ లేఖా రచనా సంప్రదాయంలో వచ్చిన సాహిత్యంలో చెప్పుకోదగింది Frankenstein! ప్రఖ్యాత కవి P.B. షెల్లీభార్య Mary Shelly 1818లో ఈ నవలను ఉత్తరాల రూపంలోనే రాసింది. ఈ నవలలోని మూడు ప్రధాన పాత్రల మధ్య జరిగే ఉత్తరాల ద్వారా మొత్తం కథ నడుస్తుంది.
అలాగే, 1897లో Dracula నవలను Bram Stoker రాసాడు. ప్రపంచ హారర్ సాహిత్య చరిత్రలో మైలురాయిగా నిలిచిన ఈ నవల అంతా ఉత్తరాల రూపంలోనే నడుస్తుంది. వీటికి తోడుగా పత్రికా కథనాలను, టెలి గ్రాములను, డాక్టర్, ఓడలప్రయాణపురికార్డులనుకూడాఉపయోగించారు.
The Diary of a Young Girl పేరిట రెండో ప్రపంచ యుద్ధ కాలంలోని భయానక భీభత్స అనుభవాలను, వాటిపై స్పందనలను Anne Frank రాసింది.అయితే ఈ గ్రంధాన్నిఆమె లేఖలు, డైరీ రూపంలో రాయడం విశేషం!
ప్రసిద్ధ రచయిత్రి Alice Walker 1982లో The Color Purple - నవలను ప్రచురించింది. ఇది Celie అనే ఓ నల్ల జాతి అమ్మాయి కథ. ఇందులో ఆమె తన కథను తన సోదరికి, దేవుడికి ఉత్తరాల రూపంలో చెప్తుంది.
మరో ప్రఖ్యాత రచయిత్రి Virginia Woolf 1938 లో Three Guineas అనే వ్యాసాన్ని ఈ లేఖా సాహిత్య ప్రక్రియ లో రాసింది. ఇది ప్రపంచ స్త్రీవాద సాహితీ చరిత్ర లోనే గొప్ప రచనగా పేరు పొందింది. అలాగే 1748లోనే John Cleland రాసిన Funny Hill నవల సరస శృంగార నవలగా ప్రఖ్యాతి సాధించి, లేఖాసాహిత్యానికి ఉన్న పరిధిని విస్తృతపరిచింది. ఇందులో ఓ అనామక వ్యక్తికి తన మనసులోని భావాలను ఉత్తరాల పరంపరగా కథానాయకి రాస్తుంది.
అలాగే Wilkie Collins తను రాసిన The Woman in White (1859), The Moonstone (1868) లో లేఖా సాహిత్య సంప్రదాయంలో డిటెక్టివ్ నవలలను సమర్ధవంతంగా రాసి, ఉత్తరాల ద్వారానే నేరపరిశోధనా క్రమాన్నిఆసక్తిదాయకంగా చెప్పగలిగాడు.
ప్రఖ్యాత రష్యన్ రచయత Fyodor Dostoyevsky తన రచనా ప్రస్థానాన్ని ఈలేఖా సాహిత్య ప్రక్రియతోనే ప్రారంభించాడనేది అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు. 1846లో ఆయన రాసిన తొలి రచన Poor Folk రష్యా విప్లవ పూర్వ కాలం నాటి ఇద్దరు మిత్రుల కథగా, వారిద్దరి మధ్య జరిగే ఉత్తరాల రూపంలోనే నడుస్తుంది.
ఇంకా Saul Bellow రాసిన Herzog (1964), Endo Shusaku రాసిన Silence (1966), Stephen King రాసిన Carrie (1974), John Updike రాసిన ‘S’ (1988), Helen Fielding రాసిన Bridget Jones’s Diary (1996), Carolyn Hart రాసిన Last Day of Summer (1998), వంటివి ఈ లేఖా సాహిత్య పరంపరలో పేరెన్నికగన్న సమకాలీన రచనలుగా చెప్ప వచ్చు.
అలాగే ప్రఖ్యాత భారతీయ రచయిత 2008లోప్రతిష్టాత్మక బుకర్ పురస్కార విజేత అయిన అరవింద్ అడిగా రాసిన The White Tiger కూడా ఈ కోవ లోనిదే కావడం ఇక్కడ ప్రస్తావనార్హంగా చెప్పాలి. ఈ నవల అంతా, ఒక భారతీయ రైతు చైనా ప్రధానికి రాసే ఉత్తరాల రూపంలో ఉంటుంది.
మరి తెలుగు సంగతేంటి? :
తెలుగు సాహిత్యంలో లేఖాసంప్రదాయపు ఛాయలు తరచి చూస్తే ప్రాచీన కావ్యాలలో కూడా కనిపిస్తాయి. వాటిలో ప్రముఖంగా ప్రస్తావించుకోదగినది- గజపతిరాజుకు అల్లసాని పెద్దన రాసినట్లుగా చెప్పుకునే పద్యలేఖ! దండయాత్రకు వచ్చిన రాజు ఈ పద్యలేఖతోవెనుదిరిగిపోయినట్లుగా ‘విజయనగరచరిత్ర’ అనేగ్రంథంలో ఉటంకించబడింది.
అలాగే, రాయప్రోలు సుబ్బారావు రాసిన ‘స్నేహలతాదేవి లేఖ’ తెలుగు లేఖా సాహిత్యంలో పేరెన్నికగన్నది. ఇంటిని తాకట్టుపెట్టి కూతురు పెళ్ళి చేయాలనుకున్న తండ్రి స్థితికి చలించి, ఆకూతురు ఉత్తరంరాసి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ విషాదాంత రచనఅప్పట్లో వరకట్నంపై నిరసనగా నిలిచింది.
ఇక గుర్రంజాషువా తన ‘గబ్బిలం’ ద్వారా లేఖా సంప్రదాయపు ప్రాధమిక రూపమైన సందేశ విధానాన్ని పాటించగా, ‘ఫిరదౌసి’ కావ్యంలో పూర్తిస్థాయి లేఖాసాహిత్య సృష్టిని చేశారు. మాట తప్పిన చక్రవర్తి ఘజనీ ప్రభువును ఉద్దేశించి కవి ఫిరదౌసి రాసిన కవితాలేఖ కరుణరసాత్మకంగా సాగి గుండెలను ఆర్ద్రంచేస్తుంది.
అలాగే, తిరుపతి వేంకటకవులు 1910-14 మధ్యకాలంలోరాసిన ఉత్తరాలతో వేసిన ‘గీరతం’, అనుభూతి కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ రాసిన ‘సైనికుడిఉత్తరం’ కవిత (‘అమృతంకురిసినరాత్రి’ లోనిది), త్రిపురనేని గోపీచంద్ రాసిన నవల ‘పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా’ ‘పోస్టు చెయ్యని ఉత్తరాలు’, పానుగంటి లక్ష్మీనరసింహారావు రాసిన ‘సాక్షి’ వ్యాసాలు (అందులోనూ ఆరోసంపుటిలోని లేఖలు), బోయి భీమన్నరాసిన ‘జానపదుని జాబులు’ తెలుగు సాహిత్యంలో లేఖా సంప్రదాయానికి పెట్టని కోటలుగా నిలిచాయి.
ఇవే కాకుండా నవలల్లో కూడా లేఖా ప్రయోగాలు విస్తృత పాఠకాదరణను పొందాయి. వాటిలో యద్దనపూడి సులోచనారాణి రాసిన ‘ప్రేమలేఖలు’ నవల, మరో రచయిత రాసిన ‘ఉత్తరాయణం’ అనే హాస్య నవల ప్రముఖమైనవి. పాపులర్ నవలా రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన ‘దూరం’ నవల ఆసాంతం ఉత్తరాలతోనే నడిచి పాఠకులకు శిల్పపరంగా కొత్త అనుభూతి నిచ్చింది.
ఇక, చలం రాసిన ‘ప్రేమలేఖలు’ అయితేతెలుగు లేఖా సాహిత్య ప్రస్థానంలో ఒక మేలుమలుపుగా నిలిచాయి. లేఖాప్రక్రియ ద్వారా ఎంత హృద్యమైన సాహిత్యాన్ని సృష్టించవచ్చో నిరూపించాయి. అలాగే మామిడి హరికృష్ణ 2012 అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవ వేడుక విశేషాలను ఓపాఠశాల విద్యార్ధి తన మేనమామకు ఉత్తరంరాసినట్లుగా అందించాడు. ఇది ఆంధ్రభూమి, ఆదివారం అనుబంధంలో కవర్స్టోరీగా ప్రచురితమైంది.
ఈ పరంపరలోనే, నేటి ఇంటర్నెట్ యుగంలో అంతరించి పోయిందనుకుంటున్న లేఖా సాహిత్యపు అద్భుత సంప్రదాయాన్నిఈ తరానికి గుర్తుచేసి ఆత్మీయంగా అల్లుకున్న రచనలుగా ‘కొత్తప్రేమలేఖలు’, ' లెటర్స్ టు లవ్ " పుస్తకాలు మళ్ళీ ఒక్కసారి ఉత్తరాల తోటలోకి తొంగిచూసేలా చేసాయి.
ఇంత గొప్ప సంప్రదాయం, చరిత్ర, సాహితీ ప్రస్థానాన్నిసాగించిన లేఖా సాహిత్యం, నేటితరంలో మళ్ళీ ఊపిరి పూసుకోవడానికి, పునరుజ్జీవితాన్ని సాధించి, మరికొంతకాలం కొనసాగడానికి, మరిన్ని రచనలు ఈతరహాలో రావడానికి ప్రేరణగా ఈ పుస్తకాలు నిలిచాయి. ఆర్ద్రంగా, ఆత్మీయంగా గాలి తెరల లోంచి తేలివచ్చి శ్రోతల / పాఠకుల హృదయాలను స్పృశించాయి!
లేఖ సాహిత్యంలో ఏమేం ఉంటాయి ?
"కాదేదీ సాహిత్యానికనర్హం " అన్నట్టు మానవ జీవితాన్ని పరివేష్టించి ఉన్న ఏ అంశం పైన అయినా సాహిత్యాన్ని సృజించవచ్చు. అయితే ఆ జీవన పార్శ్వాన్ని అందంగా, మనోరంజకంగా అందించడానికి రచయితకు నైపుణ్యం అవసరం. అలాగే, లేఖా సాహిత్యం లో వస్తువు విషయం లో కూడా ఏ నిర్దిష్టత లేదు. ఏ వస్తువు, అంశంను అయినా లేఖ శైలిలోకి అందించవచ్చు. అయితే ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో సృజించిన లేఖా సాహిత్యంపై ఆయా విశ్వ విద్యాలయాలు, సాహితీ పీఠాలు ఎన్నెన్నో పరిశోధనలను విస్తృత స్థాయిలో నిర్వహించాయి. ఈ పరిశోధనలను అనుసరించి, ఇప్పటి వరకు అంతర్జాతీయంగా వచ్చిన లేఖా సాహిత్యంలోని వస్తువు (Subject) ఆధారంగా లేఖలను ఎన్నెన్నో రకాలుగా అభివర్ణించారు. వాటిలో ముఖ్యమైనవి.
1. ప్రకృతి లేఖలు : వ్యవసాయం, విత్తనం, చెట్టు, కాలం, పక్షులు, వరదలు, గ్లోబల్ వార్మింగ్, పర్యావరణ వంటి ప్రాకృతిక అంశాలపై రాసిన లేఖలు.
2. ఆరోగ్య లేఖలు : వైద్యం, పాలియేటివ్ కేర్ (మృత్యు అవసాన కాలపు సంరక్షణ), ఆయుర్వేదం, యునానీ, హోమియో, యోగ, క్యాన్సర్, తలసీమియా వంటి ఆరోగ్య సంబంధ అంశాలపై రాసిన లేఖలు.
3. కుటుంబ సంబంధాల లేఖలు : అమ్మచీర, అత్తాకోడలు, అమ్మ , వృద్ధాప్యం, నాన్న, పెళ్లి వంటి అంశాల ఆధారంగా కుటుంబ బంధాలపై రాసిన లేఖలు
4. శాస్త్ర, సాంకేతికలేఖలు : ఆకాశవాణి, సినిమా, చంద్రయాన్, ఎలక్ర్టానిక్స్, జెనెటిక్స్, అణు పరిశోధన, అంతరిక్షం వంటి శాస్త్ర సాంకేతిక, వైజ్ఞానిక పరిణామాలపై రాసిన లేఖలు
5. ప్రత్యేక దినాలపై లేఖలు : కొత్త సంవత్సరం, వినియోగదారులు (మార్చి 15), ప్రేమికులు (వాలెంటెన్ డే ఫిబ్రవరి 14), కుటుంబం ( మే 15), పర్యావరణ ( జూన్ 5), స్నేహితులు (ఆగష్టు రెండో ఆదివారం) , రాజ్యాంగం (నవంబర్ 26) మొదలగు ప్రత్యేక దినోత్సవాలు పురస్క రించుకుని రాసిన లేఖలు.
6. దేశభక్తి లేఖలు : సైనికులు, భారతమాత, త్రివిధ దళాలు వంటి అంశాలు దేశం, జాతీయతలో వాటి పాత్రపై రాసిన ఉత్తేజ పూర్వక లేఖలు.
7. జీవన శైలి లేఖలు : చీరకట్టు (ప్యాషన్స్), సౌందర్యం, ప్రమాదాల నివారణ, డిప్రెషన్, సర్దుబాటు, అలవాట్లు, విజయ సాధన వంటి జీవనోత్సాహ శైలులపై రాసినలేఖలు.
8. పండుగలపై లేఖలు : సంక్రాంతి, బోనాలు, బతుకమ్మ, వినాయక చవితి, క్రిస్మస్, రమ్ జాన్, బుద్ధ పౌర్ణిమ వంటి పండుగలు, వాటిలోని విశిష్టతలు, వాటిలో ఇమిడి వున్న సామాజిక, పర్యావరణ, మానవీయ ప్రయోజనాలపై రాసిన లేఖలు.
9. మార్గదర్శులపై లేఖలు : గాంధీజీ 150వజయంతి, సమతామూర్తులు (అంబేద్కర్, జ్యోతిబాపూలే, జగ్జీవన్రామ్), కార్ల్ మార్క్స్, మార్టిన్ లూథర్ కింగ్, రవీంద్రనాథ్ టాగోర్, షేక్స్పియర్, కాళోజి, దాశరధి జయంతుల సందర్భంగా వారి జీవన విశేషాలపై స్ఫూర్తిదాయకంగా రాసిన లేఖలు.
10. భాషా సాహిత్యాల పై లేఖలు : మాతృ (అమ్మ) భాష, కవిత్వం - కవి వంటిసాహిత్యసంబంధఅంశాలపైరాసినలేఖలు
11. సామాజిక -రాజకీయ లేఖలు : సమాజం, రాజ్యాంగం, బ్యాలెట్బాక్స్, పోలీస్వంటిఅంశాలపై, మానవ పరిణామ ప్రగతిలో వాటిసేవలపై రాసిన ఆలోచనాత్మక లేఖలు.
12. మత , ఆధ్యాత్మిక, తాత్విక లేఖలు: ఆయా మత విశ్వాసాలు, పురాణ కథనాలు, ఐతిహాసిక గాధలు, బౌద్ధ జాతక కథలు, లౌకిక దృక్పథం వంటి అంశాలపై లేఖలు
13. ప్రపంచ శాంతి- మానవీయ లేఖలు: యుద్ధాలు, వినాశనాలు, వసుధైక కుటుంబం, వర్ణ వివక్ష రహిత ప్రపంచం, విశ్వ మానవ తత్త్వం, మొదలైనవి.
ప్రేమ లేఖల రూటే సెపరేటు :
సాధారణంగా లేఖ సాహిత్యం ఆయా దేశ కాలాల సామాజిక, ఆర్ధిక రాజకీయ పరిస్థితులకు అనధికారిక డాక్యుమెంటేషన్ గా చరిత్ర రచనకు మరొక ఆధారంగా ఇప్పుడు సర్వత్రా ఆమోదాన్ని పొందింది. అయితే లేఖ సాహిత్యంలో, ప్రేమ లేఖా సాహిత్యం మరొక అడుగు ముందుకేసి, అంతర్జాతీయంగా ఆయా ప్రముఖ వ్యక్తుల వ్యక్తిగత జీవిత అంశాలను, ప్రపంచానికి తెలియని మరెన్నో కోణాలను వెల్లడి చేస్తున్నాయి. బ్రిటిష్ రాణులు, నోబెల్ విజేతలు, చక్రవర్తులు, గతకాలపు దేశాధినేతలు వంటి ఎంతోమంది వ్యక్తిగత జీవితాలు ఆ కాలంలో వారు రాసిన వ్యక్తిగత ప్రేమలేఖలలో, వారిలోని విస్మృత కోణాలు లోకానికి ఆవిష్కృతం అవుతున్నాయి.
అలా ప్రముఖులు వేర్వేరు సంధర్భాలలో రాసిన ప్రేమ లేఖలను చదివితే ప్రఖ్యాత Zen బోధకుడు Thich Nhat Hanh చెప్పినట్లు -
“A real love letter is made of insight, understanding, and compassion. Otherwise it’s not a love letter. A true love letter can produce a transformation in the other person, and therefore in the world. But before it produces a transformation in the other person, it has to produce a transformation within us. Some letters may take the whole of our lifetime to write.” అనే మాటలకు రుజువులుగా అనిపిస్తాయి.
అలాగే సాధారణంగా ప్రేమలేఖలు’ రాసే విధానం అనుకోకుండానే Franz Kafka ఓ సందర్భంలో చెప్పినట్లు -
‘‘I answer one of your letters, then lie in bed in apparent calm, but my heart beats through my entire body and is conscious only of you. I belong to you; there is really no other way of expressing it, and that is not strong enough’’ అన్నమాటలను గుర్తుచేస్తాయి.
అలా ఈ ‘ప్రేమలేఖలు’ వస్తువు పరంగానే కాక, శైలి (Presentation Style) లో కూడా కొత్త పుంతలు తొక్కాయనే చెప్పవచ్చు. సాధారణంగా ఉత్తరం రాసే శైలి సహృదయతని కలిగి ఉంటుంది. కానీ ‘ప్రేమలేఖలు’ సహృదయతతో పాటు విజ్ఞానాన్ని, వికాసాన్ని, విశ్లేషణను, వివరణలను కూడా అందించి తొలి అక్షరపు పలకరింపు నుండి చివరి ముగింపు వాక్యం దాకా ఒక సున్నిత ఆత్మీయతను అక్షరాలనిండా నింపుకుని పరిమళిస్తాయి.
వాక్యాల వెంట ప్రయాణం :
లేఖా సాహిత్యంలో పదాలను పొదిగిన తీరు, వాక్యాలను అల్లుకున్నవిధానం, విషయానికి విషయానికీ మధ్య సంభాషణా శైలి అంతా ఆయా రచయితలు వేరువేరు రూపాలలో మన ఎదురుగా నిలబడి, మన చేయిపట్టుకుని వారి వెంట తీస్కెళ్ళినట్టుగా అనిపిస్తుంది.
సాధారణంగా లేఖలన్నింటినీ ఒకేసారి ఏకబిగిన చదివినా, విడివిడిగా దఫదఫాలుగా చదివినా ఈ లేఖల అంతిమలక్ష్యం మనలోని మానవున్ని, మానవత్వాన్ని, మానవ తత్వ్తాన్ని స్పృశించినట్లుగానే అనిపిస్తాయి. ‘‘అక్షరం - సాహిత్యం ఏదైనా ఒక విస్తృత సామాజిక ప్రయోజనాన్ని కలిగి ఉండాలి. మనకు తెలీని మనలోని అంతరంగ మానవున్ని తట్టి లేపాలి. రేపటి సుందర సమాజ నిర్మాణానికి మనల్ని పురికొల్పాలి. ఒక్కమాటలో చెప్పాలంటే సాహిత్య సృష్టి ఏదైనా దాని అంతిమ లక్ష్యం మానవత్వ పునరుద్ఘాటనే “(Reaffirmation of humanity) కావాలి.." అనే మాటలకు నిలువెత్తు ఉదాహరణగా ఈ లేఖలు ఉంటాయి!
అందుకే ఈ ‘లేఖలు’ - సమ్యక్ ఆలోచనకు, సంపూర్ణ ఆత్మీయతకు, సానుకూల ఆచరణకు వెలుగు దివిటీలు గాను, ఈ లేఖా సాహిత్యం తెలుగు సాహితీ లోకంలో ఓ దీపశిలగా నిలిచి గెలిచిందని తడుముకోకుండా చెప్పవచ్చు.
చివరగా... లేఖా సాహిత్యం...
మనసులోని భావాలన్నిటినీ వాక్యాలుగా గుదిగుచ్చిన హృదయ హారం
అంతరంగం, ఆత్మీయతలను అక్షరాలుగా పేర్చిన ఆలోచనా ద్వారం
ఒకప్పుడు ప్రేమలేఖ... జీవితాంతం గుండెల్లో దాచుకునే నెమలీక
ఇప్పుడు ప్రేమలేఖ... అంతరించి, అవశేషంగా మిగిలిన జ్ఞాపిక...
అవి కేవలం రాశి పోసిన అక్షరాలు మాత్రమే కావు - అవి ఆనాటి తరపు హృదయరేఖలు !
అందుకే లేఖలు ...
మనసు నుండి మనసు వల్ల, మనసు కోసం...
మనసుతో మనసు చేసే సంభాషణలు.
వాటిని మనసు విప్పి విందాం...!
గుండె తడిని, మనసు అలజడిని, ఆలోచనల ఉరవడిని, సంఘర్షణల తాకిడిని...
అనుబంధాల జడిని నిక్షిప్తం చేసుకొన్న జీవన నిధులు.
వాటిని .. హృదయంతెరచిచూద్దాం.. !
ఈ లాక్ డౌన్ కాలంలో స్టోర్ రూమ్ ల నుంచి బయటపడ్డ పాత ఉత్తరాల ప్రేరణతో
మళ్ళీ ఒకసారి మన ఆత్మీయులను లేఖలతో పలకరిద్దాం...!
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బాక్స్ -1
లేఖాసాహిత్యం ప్రత్యేకతలేంటి? :
అన్ని లేఖలు లేఖలుగానే ఉంటాయి. కానీ కొన్ని మాత్రమే సాహిత్య ప్రతిపత్తిని, కావ్యగౌరవాన్నిపొందుతాయి. దానికి ఆ లేఖలో పొందుపరిచిన విషయాలు, ఉపయోగించిన భాష, పద సౌందర్యం, రాసిన విధానం, శైలి, అందులోని సామాజిక ప్రయోజనాత్మకత, విషయ వివరణలో కళాత్మకత, సౌందర్యదృష్టి (Aesthetics) వంటివన్నీ కలిసి కారణమవుతాయి. ఆ విధంగా లేఖాసాహిత్య విశిష్టతలను ఈ విధంగా చెప్పవచ్చు.
* కథనంలో కాల్పనికతకు, వాస్తవికత (Realism)కు, కవితాత్మక అభివ్యక్తికి సమాన ప్రాధాన్యత ఉంటుంది
* ఇందులో ఏకోన్ముఖ వివరణ కన్నా బహుముఖ వ్యక్తీకరణకు అవకాశం.
* ఈ ప్రకియ వల్ల పాత్రల లోతైన మనోభావాలు, ఆలోచనలు పాఠకులకు అవగతం అవుతాయి.
* రచయిత ఊహా శక్తి, సృజన స్థాయి, కాల్పనికత ఒక వైపు, వాటికోసం అల్లుకున్న పదాలు అన్నీ పాఠకులకు కొత్త అనుభూతిని ఇస్తాయి.
* వీటిలోని శైలి అంతా మనకు అత్యంత ఆప్తులైన వ్యక్తులు మనకు ఆత్మీయంగా చెప్తున్నట్లుగా ఉంటుంది. కనుక వీటి ద్వారా అన్ని రకాలభావోద్వేగాలను, నవ రసాల భావనలను హృదయాలకు హత్తుకునేలాగా అక్షరాలలోనే పండించవచ్చు.
* రచయిత స్వంత కల్పితాల కన్నా యధార్ధ సంఘటనలు, సందర్భాలతోనే పాఠకులకు సంధానం ఏర్పడుతుంది.
* ఇందులోని శైలి-సంబోధనాత్మకంగా, సంభాషణాత్మకంగా ఉండటం వల్ల పాఠకుడు, శ్రోత మమేకమయ్యే అవకాశం ఎక్కువ.
* దీనిలోని ఉటంకింపులు ఎంత సంభ్రమాశ్చర్యాలకు రసానందానికి గురిచేస్తాయో, అందించే సమాచారం, ఉదాహరించే ఉదంతాలు, గణాంకాలు కూడా అంతే జ్ఞానాన్నిఅందిస్తాయి.
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బాక్స్-2
భారతీయ సాహిత్యం - లేఖాసంప్రదాయం :
ప్రాచీన అలంకారికులు భారతీయ సాహిత్యాన్ని మూడు రకాలుగా వర్ణిస్తారు.
1. ప్రభుసమ్మితాలు
2. కాంతాసమ్మితాలు
3. మిత్రసమ్మితాలు
అంటే సాహితీ సృజనకు ప్రేరకాలుగా, కారకాలుగా ఈ మూడు ఉంటాయని అంటారు. వీటిలో ‘మిత్ర సమ్మితాల’ కోవలోకి వచ్చేది ‘లేఖాసాహిత్యం’ అనిచెప్పవచ్చు.
సాధారణంగా లేఖలు ఎవరు ఎవరికి రాసినా వాటిలో అంతర్లీనంగా ఉండే అంశం, రాసే విధానం అంతా మిత్రులతో సంభాషించినట్లుగా, ఇతరుల క్షేమాన్ని, మేలును ఆశించినట్లుగా ఉండటం సహజం. ఈసున్నితమైన మానవీయ కోణం మిగతా సాహిత్య ప్రక్రియలలో కన్నాలేఖల ద్వారా వెల్లడించే అవకాశం ఎక్కువగా ఉండటం వల్లనేనేమో, ఇది ఒక ప్రత్యేక ‘రచనా సంప్రదాయం’గా ఎదిగింది.
భారతీయ ఇతిహాసాలైన రామాయణం, మహాభారతాలలోని రాయబార ఘట్టాలన్నీమౌఖిక లేఖా సంప్రదాయంలోని తొలి రూపాలే అని చెప్పవచ్చు. అంగదుడు, హనుమంతుడు, సంజయుడు, శ్రీకృష్ణుడు చేసిన ప్రయత్నాలు దీనికి ఉదాహరణలు. కాగా, పూర్తిస్థాయిలో లేఖా సాహిత్యం మొదటగా మనకు సంస్కృతంలో రాసిన ‘సుహృల్లేఖ’ లో కనిపిస్తుంది. ఈపదానికి అర్థం ‘మిత్రునికో ఉత్తరం’ (An Epistle to a Friend,) ! దీనిని బౌద్ధ మహాముని ఆచార్య నాగార్జునుడు (క్రీ.శ. 50-120) రాసాడు. ఆనాటి శాతవాహన చక్రవర్తి శాతకర్ణిని ఉద్దేశించి బౌద్ధమతంలోని విశిష్టతలను, సామాజికావసరాన్ని వివరిస్తూ ఈ బృహత్ లేఖను ఆయన రాశాడు.
అలాగే ‘సందేశకావ్యాలు’ కూడా లేఖా సాహిత్యం కోవ లోనివే అని చెప్పవచ్చు. కాళిదాసు రాసిన ‘మేఘదూతం’ దీనికి ఉదాహరణ. విరహంతో ఉన్న యక్షుడు తన ప్రేయసికి మేఘం ద్వారా సందేశాన్నిఅందించే లక్ష్యంతో రాసిన ఈ కావ్యం సాహితీ శిల్ప సంప్రదాయాలలో ఓ విశిష్ట ప్రయోగం అనే చెప్పాలి.
ఇక ఆధునిక కాలంలో ప్రముఖవ్యక్తులు ఆయా సందర్భాలలో రాసిన ఉత్తరాలు సాహిత్య ప్రతిపత్తిని పొందే స్థాయిలో ఉండటం విశేషం. ఆలెక్కన లేఖా సంప్రదాయపు సాహిత్యం మనకు రెండు రూపాలలో కనిపిస్తుంది.
1. కవులు, రచయితలు, మేధావులు, తాత్త్వికులు ఆయా సందర్భాలలో వారి ఆత్మీయులకు రాసిన లేఖలే ఆతర్వాత సాహిత్య స్థాయిని సంతరించుకోవడం.
2. రచయితలు, సృజనకారులు ఐచ్ఛికంగానే తాము రాయాలనుకున్న కథను లేదా సృజనాత్మక రచనను లేఖా సంప్రదాయపు శిల్పం ద్వారా ఆవిష్కరించడం.
ఈ విషయంలో స్వామి వివేకానందుడు (1863-1902), శరత్చంద్ర ఛటోపాధ్యాయ (1876 -1938), జవహర్లాల్ నెహ్రూ (1889-1965) వంటి వారు రాసిన లేఖలు మొదటి కోవలోకి వస్తాయి. నెహ్రూ తన కూతురు ఇందిరా గాంధీకి రాసిన లేఖలు కేవలం వ్యక్తిగత క్షేమ సమాచారంగానే కాక, సాధికారిక విజ్ఞాన అంశాలుగా ప్రసిద్ధికెక్కి, వైయక్తికతను (Individuality) దాటిన సామాజికప్రయోజనాన్ని (Social Utility) సాధించాయి.
అలాగే విశ్వకవి, నోబెల్ సాహిత్య పురస్కార గ్రహీత రవీంద్రనాధ్ టాగూర్కు, తన అభిమాని, అర్జెంటీనా దేశస్థురాలు విక్టోరియా ఒకెంపోకు మధ్య జరిగిన ఉత్తరాలు, ప్రపంచ సాహిత్య చరిత్రలో సహృదయ స్పందనలుగా గుర్తింపు పొందాయి. ఆలేఖా బంధమే చివరికి ఠాగూర్ ‘పూరబి’ పేరుతో ప్రేమ కవితల సంకలనాన్ని రాయడానికి ప్రేరణగా నిలిచింది. ఈ కావ్యాన్నిఆయన ఆమెకు అంకితం ఇవ్వడం కూడా ఈవాదనను బలపరుస్తోంది.
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------------------------------------
బాక్స్- 3
కొత్త ప్రేమ లేఖలు :లెటర్స్ టు లవ్ "
ప్రముఖ కవయిత్రి, రేడియో అనౌన్సర్ శ్రీమతి అయినంపూడి శ్రీలక్ష్మి రాసిన ‘కొత్తప్రేమలేఖలు’ పుస్తకం ఇటీవలి కాలం లో ఎన్నో రకాలుగా తెలుగు సాహితీలోకంలో కొత్తముద్రను వేసిందని చెప్పాలి. లిఖిత రూపంలోఉండాల్సిన లేఖలను మొదటగా ఆకాశ వాణిలో సంవత్సర కాలం పాటు ‘శ్రవణ’రూపంలోప్రసారం చేయడం , తర్వాత వాటికి పుస్తకంగా సంకలనంచేయడం ద్వారా ‘ముద్రణ’ రూపాన్నివ్వడం అపూర్వమైన విషయమే!ఈ పుస్తకంలో పొందుపరిచిన 51 ప్రేమ లేఖలు స్థూలంగా ఎన్నెన్నో సామాజిక, సాంస్కృతిక, సాహిత్య, ఆర్ధిక, జీవన శైలి సంబంధిత అంశాలపై విషయపరంగా, విశ్లేషణపరంగా, అంతకు ముందు తెల్సిన అంశాల కన్నా ఎన్నెన్నో తెలియని కోణాలను ఆవిష్కరించి ‘కొత్త’ అన్నపేరును సార్థకం చేసాయి. ఎంపిక చేసుకున్నఅంశాలు కూడా ఎంతో సమకాలీనతను, సామాజికతను కలిగి ఉండటమే కాక సాధారణంగా కనిపించే అంశాలలోని అసాధారణత్వాన్ని, అసామాన్యతత్వాన్ని సునిశితంగా, సాధికారికంగా, గణాంకాలు, చరిత్రతో మేళవించి మానవీయ కోణంలో అందించాయి. అందుకే గౌరవ గవర్నర్ శ్రీమతి తమిళ్ ఇసై సౌందర్య రాజన్ గారు రాజ్ భవన్ లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడమే కాక ఎంతగానో ప్రశంసించారు!
అలాగే యువ రచయిత్రి కడలి సత్యనారాయణ రాసిన ప్రేమలేఖల సంకలనం - "లెటర్స్ టు లవ్ " ! 40 లేఖలు ఉన్న ఈ పుస్తకంలో ప్రేయసీ ప్రియుల మధ్య ఉండే జీవన పార్శ్వాలను సున్నితంగా వ్యక్తీకరించడమే కాక, న్యూ జెనరేషన్ యువత సమకాలీన ప్రపంచాన్ని, స్త్రీ పురుష సంబంధాలను అర్ధం చేసుకుంటున్న తీరును అద్దంలా చూపించింది. అయితే ఈ ప్రేమలేఖలన్నింటా , ఆమె పుస్తకం ప్రారంభం లోనే చెప్పినట్టు 'చలం ' శైలి, ప్రభావం సమకాలీన తరపు ఆలోచనలతో దర్శనమిస్తాయి.
------------------------------------------------------------------------------------------------