Tuesday, 21 July 2020

పండగల్లో కార్పొరేట్ పాఠాలు ! Harikrishna Mamidi

పండగల్లో కార్పొరేట్ పాఠాలు!
-------- harikrishna mamidi 

కార్పొరేట్ కంపెనీలు నేడు తమ వ్యాపార వ్యూహాల కోసం కొత్త దారులను అన్వేషిస్తున్నాయి. ఇప్పటివరకూ మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీల సలహాలను, ట్రేడ్ అనలిస్టుల సూచనలను పాటించిన ఈ కంపెనీలు ఇప్పుడు భారతదేశం మూలాల్లోకి వెళ్లి, ఇక్కడి ‘నేటివ్ స్టైల్స్’తో కార్పొరేట్ ప్రపంచాన్ని పునర్నిర్మించే పని చేస్తున్నాయి.

దానికోసం దేశీయ ఉత్సవాలైన ‘పండగల లోంచి పాఠాల’ను ఒంటబట్టించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మానవ వనరుల నిర్వహణ మొదలుకొని, వినియోగదారు ప్రవర్తన వరకూ అన్ని రకాల కార్పొరేట్ వ్యూహాలకూ పరిష్కారాలను పండగల్లోంచి ‘కనుక్కునే’ దిశగా అడుగులేస్తున్నాయి.
*******************************

కోల్‌కతా...
టోలీగంజ్ ఏరియాలోని రిచ్ కాలనీ...
దాదాపు 50 మందికి పైగా యంగ్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ నెలరోజుల నుంచీ రోజూ షిఫ్టులవారీగా ఆ కాలనీని సందర్శించి, అక్కడ నివాసం ఉంటున్న సెలబ్రిటీల నుండి కామన్‌మ్యాన్ వరకూ అందరినీ కలుస్తున్నారు. వివరాలను సేకరించి ల్యాప్‌టాపుల్లో ఫీడ్ చేస్తున్నారు. రాత్రి సమయాల్లో ఆ కాలనీ ‘లుక్’ని ఫొటోలు తీస్తున్నారు. వేర్వేరు కోణాల్లో రోడ్లని, అపార్ట్‌మెంట్లని షూట్ చేస్తున్నారు. ఈ హంగామా అంతా ఏదో సినిమా కోసమో టీవీ సీరియల్ కోసమో కానే కాదు. దీపావళి పండుగని సెలబ్రేట్ చేయడం కోసం ఓ కార్పొరేట్ కంపెనీ సన్నాహక ప్రాజెక్ట్ అది!

పండుగలు చెప్పే పాఠాలు
కంపెనీల స్థాపనకు ముందు జరిగే మార్కెట్ సర్వే మొదలుకొని, కంపెనీ ఎదుర్కొనే సవాళ్ల పరిష్కారం వరకూ విదేశాల్లోని ‘మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ’లను సంప్రదించడం, దానికోసం కోట్లాది రూపాయలను వెచ్చించడం కార్పొరేట్ బిజినెస్‌లో మామూలే. ఆ మాటకొస్తే, అసలు ‘కార్పొరేట్ నిర్వహణ’ అనే కాన్సెప్టే అమెరికా వంటి దేశాల ఆర్థిక అవసరాల్లోంచి పుట్టింది. అందుకే కార్పొరేట్ కంపెనీల నిర్వహణ అనగానే ఫ్రెడ్ లూథాన్స్, ఫిలిప్ కొట్లర్ రూపొందించిన విధానాలే ప్రామాణికంగా ఉంటూ వచ్చాయి. ఎల్టన్ మేయో ‘మానవ సంబంధాల దృక్పథం’, ఫ్రెడ్‌రిగ్స్ ‘తులనాత్మక దృక్పథం’ వంటివే కార్పొరేట్ కంపెనీల నిర్వహణాశైలులుగా మారాయి. ఛెస్టర్ బెర్నార్డ్ అధ్యయనాలు, డేల్ కార్నెజీ ఇన్‌స్టిట్యూట్ సూచనలు వాటికి బైబిల్‌లా మారాయి.

అయితే, జాతి వారసత్వ సంపదగా వేల యేళ్ల నుంచీ ఉన్న పండుగలు ఇన్నేళ్లు ఎలా కొనసాగగలుగుతున్నాయి? మన కంపెనీలు కనీసం పదేళ్ల పాటు కూడా ఆ స్ఫూర్తిని ఎందుకు కొనసాగించలేకపోతున్నాయి? ఎన్ని ఆర్థిక సంక్షోభాలు, ఒడిదుడుకులు వచ్చినా నిరాటంకంగా కొనసాగుతున్న ఈ పండుగల్లాగా, ఆర్థిక మాంద్యాలకు అతీతంగా స్థిరమైన వృద్ధితో కంపెనీలను ఎందుకు నడపలేకపోతున్నాం? ఈ ప్రశ్నల్లోంచే ఇప్పుడు భారతీయ పండగలపై కార్పొరేట్ అధ్యయనాల ఆలోచన మొలకెత్తింది. పండుగలు చెప్పకనే చెప్తున్న పాఠాలను పెద్ద కంపెనీల సీఈఓలు సైతం బుద్ధిమంతులైన విద్యార్థుల్లాగా చేతులు కట్టుకుని వింటున్నారు.

టీమ్ స్పిరిట్ బోధించే జన్మాష్టమి
మూడు నాలుగేళ్ల క్రితం ముంబైలోని కొన్ని అటానమస్ మేనేజ్‌మెంట్ కాలేజీలు తమ ఎంబీఏ విద్యార్థులకు ‘శ్రీకృష్ణ జన్మాష్టమి’ వేడుకల్లో పాల్గొనడం తప్పనిసరి చేశాయి. జన్మాష్టమి వేడుకల్లో ‘ఉట్టి కొట్టే కార్యక్రమం’ గొప్ప ఉత్సవం. విద్యార్థులు అందులో పాల్గొనాలి. విజయం సాధించాలి. దానికోసం చేసే ప్రయత్నాలను తమ వాస్తవ అనుభవాలతో సహా గ్రంథస్థం చేసి, ‘ప్రాజెక్ట్ థీసిస్’లా సమర్పించాలి. ఈ అంశాలనే వివిధ ఐటీ కంపెనీలకు మార్గదర్శక ప్రతిపాదనలుగా అందిస్తున్నారు.

లక్ష్యం - అల్లంత ఎత్తున్న రెండు ఎదురెదురు అపార్ట్‌మెంట్ల మధ్య 10వ అంతస్థులో వేలాడుతున్న ఉట్టి.
లక్ష్యాన్ని ఛేదించడానికి ఉన్న ఒకే ఒక మార్గం - మానవ పిరమిడ్ నిర్మాణం. దీని నిర్మాణానికి శారీరక దారుఢ్యం అవసరం.
10వ అంతస్థు అంత ఎత్తు చేరడానికి ఎంతమంది మనుషులు అవసరమవుతారో మానవ వనరుల ప్రణాళిక చేసుకోవడం. విద్యార్థులను దీనికోసం ఎంపిక చేసుకోవడం. దీనికోసం విద్యార్థుల్లో ‘టీమ్ స్పిరిట్’ని పెంపొందించడం.

ఎంపిక చేసిన మ్యాన్ పవర్‌కి ప్రత్యేక నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వడం (పిరమిడ్ నిర్మాణం ప్రత్యేక నైపుణ్యమే కదా!)
పిరమిడ్‌ను మూడంచెలుగా నిర్మించడం. దిగువ భాగాన ఆరోగ్యంగా, బలంగా ఉన్నవారిని నిలపడం. వారిపైన చురుకుగా ఉండేవారిని ఎక్కించడం. బరువు తక్కువగా, సన్నగా ఉండే ఒక వ్యక్తి వీరందరిపై నుంచి మెట్లు మెట్లుగా ఎక్కుతూ శిఖరానికి చేరుకుని ఉట్టిని (లక్ష్యాన్ని) ఛేదించడం.

ఈ మొత్తం టాస్క్‌ని పూర్తిచేయడానికి కాలావధి ఉంటుంది. కనుక సరైన టైమ్ మేనేజ్‌మెంట్ టెక్నిక్స్‌ని పాటించడం.
పిరమిడ్ నిర్మిస్తున్న సమయంలో ఎదురయ్యే ఆటంకాలకు (కుండపోతగా నీళ్లు చల్లుతుంటారు) చలించకుండా దీక్షతో నిలిచే మనోభీష్టాన్ని ఏర్పర్చడం.

ఈ కోణంలో జన్మాష్టమి వేడుకలని విశ్లేషిస్తే, కార్పొరేట్ కంపెనీలు పాటించే విజయసూత్రాలే ఇందులో ఇమిడి ఉన్నట్లుగా కనిపించక మానవు.

పని విభజనను తెలిపే వినాయక చవితి

తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ సామూహిక సాంస్కృతిక ఉత్సవాలను కార్పొరేట్ కంపెనీలు కొత్తగా అర్థం చేసుకుంటున్నాయి.
కొత్త కంపెనీని స్థాపించాలంటే ముందుగా లొకేషన్ని ఎంపిక చేసుకోవాలి. ఈ ఉత్సవాల నిర్వహణకు ఓ కాలనీనో, గ్రామాన్నో ఎంపిక చేసుకోవాలి.

మొత్తం ఉత్సవాల నిర్వహణకు కావలసిన ఆర్థిక వనరులను సమీకరించడం - కాలనీవాసుల నుండి చందాలు, ఏదైనా కంపెనీ స్పాన్సర్‌షిప్ ద్వారా సమకూర్చుకోవడం (కార్పొరేట్ కంపెనీలు బ్యాంకులను అప్రోచ్ అయ్యే ధోరణి).

వేదిక నిర్మాణానికి కావలసిన కలప, అలంకరణ సామగ్రి, విగ్రహాన్ని సమకూర్చుకోవాలి. (ఆఫీసు భవనం, విద్యుత్, రవాణా, కంప్యూటర్లు వంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు సమానం).

ఉత్సవాలు 9 రోజుల పాటు జరుగుతాయి. రెండు రోజుల ముందు జరిగే సన్నాహక చర్యలని, నిమజ్జన అనంతర కార్యక్రమాలని ప్రణాళిక వేసుకోవాలి.

విగ్రహ ప్రతిష్ఠాపనలో కావలసిన వనరులను సమకూర్చుకోవాలి. నిమజ్జనం రోజు జరిగే వేడుకలకి కావలసిన వస్తువులు, ఆహారం, పండ్లు, వాహనం వంటివి ప్రిపేర్ చేసుకోవాలి. ఇదంతా టైమ్ ఫ్రేమ్‌లో నిర్వహించాలి.

9 రోజులకి గాను రోజూ ఒక విశిష్టమైన ప్రోగ్రామ్‌ని డిజైన్ చేయాలి. దీనికోసం ప్రత్యేక నైపుణ్యాలు గల కళాకారులను రప్పించాలి. (కలవడం, కన్విన్స్ చేయడం వంటి కార్పొరేట్ సంప్రదింపు నైపుణ్యాలు ఒంటబడతాయి).

ఒకే నాయకత్వం కింద పనిచేయడం (లీడర్‌షిప్), తమ మధ్య పనులను విభజించుకుని (డివిజన్ ఆఫ్ వర్క్), తమకప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం. ఎప్పుడూ టీమ్‌లో ఉత్తేజాన్ని కలిగించడం, ప్రోత్సహించడం. టీమ్ మెంబర్స్‌కుండే ప్రత్యేక సామర్థ్యాలను బట్టి వారికి బాధ్యతలను అప్పగించడం (సామాజిక సామర్థ్యాలు ఉన్న వారిని వేదిక దగ్గర నియమించడం వంటివి), వారందరినీ సమన్వయం చేయడం (ఇవన్నీ కో-ఆర్డినేషన్ సూత్రానికి ప్రాక్టికల్సే!)

లక్ష్యాన్ని ఛేదించడం నేర్పే రావణ వధ
బెంగళూరులోని కొన్ని ఐటీ కంపెనీలు ఇటీవలి దసరా వేడుకల్లో తమ సిబ్బందిని పాల్గొనమని చెప్పడమే కాక, వారి పరిశీలనలు, అనుభవాలను రిపోర్ట్ రూపంలో అందించాల్సిందిగా ఆదేశించాయి. రావణ వధ వేడుకలను తమ సవాళ్లను ఎదుర్కోవడానికి కావలసిన వ్యూహాల కోసం ఉపయోగపడే ప్రయోగాలుగా భావించడమే దీనికి కారణం.

రావణ వధ వేడుకకు మొదట కావలసింది ఖాళీ మైదానం. గ్రామానికి చేరువలో ఉండే ఖాళీ ప్రదేశాన్ని గుర్తించడం. (కార్పొరేట్ కంపెనీలు కూడా తమ కంపెనీలు ‘సెజ్’లో, ఐటీ హబ్‌లలో, పారిశ్రామిక ఎస్టేట్లలో ఏర్పాటు చేయాలని భావించడం లాంటిదే).

ఈ వేడుకని నిర్వహించడానికి గ్రామపంచాయితీ ఆఫీసు నుండి, పోలీసు యంత్రాంగం నుండి అనుమతులు తీసుకోవడం (కంపెనీ స్థాపనలో లెసైన్సులు పొందడం, ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకోవడం, కావలసిన ‘స్పేస్’ని సాధించడం).

మానవ, ఆర్థిక వనరులను మొబిలైజ్ చేయడం (కంపెనీ స్థాపనకు కావలసిన పెట్టుబడులు, హ్యూమన్ క్యాపిటల్ సముపార్జన).

బాణంతో రావణ బొమ్మను కాల్చడం (ప్రాబ్లమ్ షూటింగ్ సామర్థ్యం ఉన్న వ్యక్తిని టీమ్ లీడర్‌గా పెట్టి టార్గెట్‌ని సాధించే కార్పొరేట్ ప్రక్రియ).

టార్గెట్ కస్టమర్‌‌స అంచనా వేయించే దీపావళి

కోల్‌కతాలోని కొన్ని స్వదేశీ కార్పొరేట్ కంపెనీలు దీపావళి నిర్వహణ ద్వారా కొత్త మేనేజ్‌మెంట్ సూత్రాలను ఉద్యోగులు నేర్చుకునేలా చేస్తున్నాయి. టోలీగంజ్ ఏరియాలో చేస్తున్న ప్రయోగం అందులో భాగమే.

టోలీగంజ్‌లోని ఓ కాలనీలో ఉన్న ఇళ్లు ఎన్ని, జనాభా ఎంత, పిల్లలు, మహిళలు ఎంతమంది అనే సర్వే చేశారు. (కార్పొరేట్ ప్రాథమిక సూత్రం ‘టార్గెట్ క్లయింట్స్’ అనే భావన ఇక్కడ ఆచరణలో తెలుస్తుంది).

కాలనీ విస్తీర్ణం ఎంత, రోడ్లు ఎంతమేరకు ఉన్నాయి అనే సర్వే చేయడం (తమ ప్రొడక్ట్‌కి మార్కెట్ ఏ మేరకు ఉంది, ఎంత ఉత్పత్తి అవసరం అనే అంచనాలకి రావడం లాంటిది).

దాన్ని బట్టి ఎన్ని దీపాలు, ఏ రకం దీపాలు, దేనితో తయారుచేసిన దీపాలు అవసరమవుతాయో ఒక అంచనాకు రావడం (క్లయింట్ల అవసరాన్ని బట్టి తగిన సాఫ్ట్‌వేర్ డిజైన్ చేయడం)

ఫైర్‌వర్క్స్ కౌంటర్ దగ్గర ఎంతమంది ఉండాలో నిర్ణయించడం, ప్రమాదాలేవీ రాకుండా ఫైర్ ఇంజన్‌ని, సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవడం (సాఫ్ట్‌వేర్‌కు వైరస్ రాకుండా, ఫైల్స్ కరప్ట్ కాకుండా జాగ్రత్తలు చేపట్టడం. ఒకవేళ ఏమైనా జరిగితే హెల్ప్‌లైన్, 24/7 ‘ఆన్‌బోర్డ్’గా ఉండే నిపుణులను ఏర్పాటు చేయడం లాంటివి)

కొచ్చిన్‌లోని కొన్ని కంపెనీలు ఓనమ్ పండుగ సందర్భంగా జరిగే బోట్ రేసులను ఈ కోణంలోంచి అర్థం చేసుకోవడం కోసం ప్రత్యేక ప్రాజెక్టులను చేపడుతున్నాయి. అలాగే చండీగర్‌లోని సిఖ్‌వాడీలో సిక్కుల పవిత్ర పండుగైన ‘వైశాఖి’ జరిగే తీరును కూడా అధ్యయనం చేస్తున్నారు.

మానవ సంబంధాలకే పట్టం
వేలాది సంవత్సరాలుగా పండుగలు సెలెబ్రేట్ చేసుకోవడంలో ఉన్న మూలసూత్రం, ఈ అధ్యయనాల వల్ల కార్పొరేట్ కంపెనీలకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. భారతీయ పండుగల్లో ఉన్న ప్రధాన లక్షణం సామూహిక ఉత్సవం. ఒకరికోసం అందరు, అందరి కోసం ఒక్కరు అనే సాముదాయిక జీవన సౌందర్యమని గుర్తిస్తున్నారు. ఈ వేడుకల్లో మనుషులందరినీ ఒక్కటిగా చేస్తున్న మూలకారకం-మానవ సంబంధాలు అని కూడా గుర్తిస్తున్నారు.

మనుషులను నిపుణులుగా, హ్యూమన్ క్యాపిటల్‌గా, వనరులుగా, కొండొకచో ఓ యంత్రంగా మాత్రమే పరిగణిస్తున్న కార్పొరేట్ ప్రపంచం- మనిషిలోని సున్నితమైన భావోద్వేగాలకి పట్టం కడుతున్న పండుగల నుంచి కొత్త పాఠాలను నేర్చుకుంటోంది. తమ కంపెనీలను కొత్తగా నిర్మించుకునే దిశగా అడుగులు వేస్తోంది.
.....................**********************

ప్రాచీన సాహిత్య మూలాల్లోకి...
సాధారణంగా కార్పొరేట్ కంపెనీల ఆలోచనలన్నీ ‘విజన్ 2020’, ‘విజన్ 2050’ వంటి భవిష్యత్ కాల ‘స్పెక్యులేషన్’ల మీదనే ఆధారపడి ఉంటాయి. ఆ మాటకొస్తే, కార్పొరేట్ విధానంలోనే భవిష్యత్ కాల వీక్షణం ఉంది. కానీ ఇప్పుడా ధోరణి మారింది. ‘రివర్స్ గేర్’ మొదలైంది. ప్రాచీన కావ్యాలు- సాహిత్యంలోని నిగూఢ అంశాలను ఇప్పటి అవసరాలకి అనుగుణంగా అనుప్రయుక్తం చేసుకోవడం ప్రారంభమైంది.

ఈ ధోరణిలో బడా కార్పొరేట్ కంపెనీలు తమ సమస్యల పరిష్కారానికి, గ్రీక్ ఇతిహాసాలైన ‘ఇలియడ్’, ‘ఒడిస్సీ’ల మీద ఆధారపడుతున్నాయి. చైనీయుల ప్రాచీన ‘ఆర్ట్ ఆఫ్ వార్’ పుస్తకాల మీద, ‘షాయోలిన్’, ‘నింజా’ సంస్థల నిర్వహణాశైలి మీద అధ్యయనాలు చేస్తున్నాయి. అలాగే భారతీయ ప్రాచీన సాహిత్య రూపాలైన రామాయణ, మహాభారతాలతో సహా మరెన్నో గ్రంథాలను సరికొత్త కోణంలో చదువుతున్నాయి.

యుద్ధక్షేత్రంలో అస్త్రసన్యాసం చేస్తానన్నప్పుడు, అర్జునుణ్ని కర్తవ్యోన్ముఖుణ్ని చేయడానికి శ్రీకృష్ణుడు ఉపదేశించిన ‘కౌన్సెలింగ్ సెషన్’గా భగవద్గీతను కొత్తగా చూస్తున్నారు. భక్తి, జ్ఞాన, కర్మ యోగాలుగా ఉన్న భగవద్గీతలోని కర్మ సూత్రాన్ని ‘ప్రిన్సిపుల్ ఆఫ్ యాక్షన్’గా, స్థిత ప్రజ్ఞతను ‘ఎమోషనల్ కోషియెంట్’గా సూత్రీకరిస్తున్నారు.

ఒక దేశం, ప్రాంతం, రాజ్యం బలంగా ఉండటానికి కావలసిన ప్రధానాంశాలను ‘సప్తాంగ సిద్ధాంతం’గా అర్థశాస్త్రంలో కౌటిల్యుడు చర్చించాడు. కౌటిల్యుడు వివరించిన రాజు లక్షణాలను ఆధునిక ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకు ఏవిధంగా వర్తింపజేయవచ్చో విశ్లేషిస్తున్నారు.

మహాభారతంలోని ‘శాంతిపర్వం’లో అంపశయ్యపై భీష్ముడు రాజ్యపాలనకు సంబంధించి ధర్మరాజుకి చెప్పిన సూచనలు కార్పొరేట్ కంపెనీలకు నయాసూత్రాలుగా మారాయి. అలాగే షడ్దర్శనాల్లోని స్రాంఖ్యం (కపిలుడు), యోగం (పతంజలి), న్యాయం (గౌతముడు), వైశేషికం (కణాదుడు), ఉత్తర మీమాంస, పూర్వ మీమాంస ప్రాచీన నియమాల్లోంచి ఆధునిక విలువలను పునర్నిర్మిస్తున్నారు.

స్వదేశీ-విదేశీ కార్పొరేట్ పండిట్లను ఆకర్షిస్తున్న మరో ముఖ్యమైన గ్రంథం విష్ణుశర్మ ‘పంచతంత్రం’! ఎన్నెన్నో జీవన నియమాలను, నీతి సూత్రాలను వివిధ జంతు-పక్షుల పాత్రల ద్వారా వెల్లడించిన ఈ పుసకంలోని కథలను... ఒక కంపెనీకి మరో కంపెనీకి మధ్య జరిగే పోటీని, ఎదుటి కంపెనీని దెబ్బతీయడానికి చేసే ఎత్తుగడలని, ఉన్న కంపెనీలను మరో కంపెనీలో కలిపేయడం (మెర్జర్), ఒక కంపెనీని మరో కంపెనీకి అమ్మేయడం వంటి వ్యూహాలను విశ్లేషించడానికి ఉదాహరిస్తున్నారు.
.....................****************

‘కార్పొరేట్’కు ఆధ్యాత్మిక జోడింపు
మానవీయ కోణాన్ని, ఆధ్యాత్మిక స్ఫూర్తిని జోడించి కార్పొరేట్ ప్రపంచంలో నవ్య విప్లవానికి తెరతీస్తున్నారు కార్పొరేట్ గురువులు. వ్యక్తిగత పోటీ, ఆధ్యాత్మిక ఆనందం, వృత్తి సంతృప్తి వంటి అంశాలను చర్చిస్తూ కార్పొరేట్ ఉద్యోగుల్లోని స్ట్రెస్, డిప్రెషన్‌లకు నివృత్తి మార్గాలను సూచిస్తున్నారు ‘ద మాంక్ హూ సోల్డ్ హిజ్ ఫెరారీ’ ఫేమ్ రాబిన్‌శర్మ.

’Simple Living- High thinking'భావన ప్రాతిపదికగా ఉద్యోగుల మధ్య అద్భుతమైన మానవీయ స్పర్శ ద్వారానే కంపెనీలు లక్ష్యాలను సాధిస్తాయంటారు అరిందమ్ చౌదరి. భగవద్గీతను మేనేజ్‌మెంట్‌కు అన్వయించి ‘కౌంట్ ద చికెన్ బిఫోర్ దే హ్యాచ్’ రాశారాయన.

ఇక రవిశంకర్ తన ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ విధానంలోని ధ్యాన ప్రక్రియ (సుదర్శన క్రియ) ద్వారా ఉద్యోగుల్లో నిశ్చల మనస్తత్వాన్ని, సవాళ్లను ఎదుర్కోగలిగే సామర్థ్యాన్ని తీసుకురావచ్చంటారు. ‘కార్పొరేట్ కంపెనీలన్నీ మానవ వనరులతోనే నడుస్తాయి. మానవులేమో నిరంతర చైతన్యశీలులు. ప్రయోగశాలల్లోని రసాయనల్లాగా స్థిరంగా ఉండరు. అలాంటివారి మధ్య సుస్థిరతకి ప్రాచీన భారతీయులు చెప్పిన ధ్యానమే మార్గ’మని ఆయన చెపుతారు. దీపక్ చోప్రా, శివ్‌ఖేరా కూడా ప్రస్తుత సంక్లిష్ట జీవనంలో ఆధ్యాత్మికత సాయంతో సంపూర్ణ మూర్తిమత్వ వికాసం ఎలా సాధించాలో వివరిస్తారు.

అలాగే యండమూరి వీరేంద్రనాథ్ ‘విజయానికి ఆరోమెట్టు’... భగవద్గీతని ఆధునిక కార్పొరేట్ ప్రపంచానికి అన్వయిస్తూ చేసిన రచనే! ప్రయాగ రామకృష్ణ మహాభారతంలోనూ, భీష్ముని సందేశంలోనూ ఇమిడి ఉన్న కార్పొరేట్ సూత్రాలతో భీష్మ ఎట్ మేనేజ్‌మెంట్ అండ్ గవర్నెన్‌‌స రాశారు.

-*************************
‘సినిమా స్టడీస్’ కూడా...
కార్పొరేట్ కంపెనీలు తమకు కావలసిన వ్యూహాల కోసం ఏ అవకాశాన్నీ వదిలి పెట్టడం లేదు. దాన్లో భాగంగానే సినిమా లను కూడా కేస్ స్టడీ చేస్తున్నాయి. స్టాన్‌ఫోర్డ్ వంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు సైతం సినిమా అధ్యయనాలను స్పెషల్ ప్రాజెక్టు లుగా తమ సిలబస్‌లో చేర్చాయి.

అలాంటి అరుదైన గౌరవం దక్కించుకున్న మొదటి భారతీయ సినిమా ‘లగాన్’ (2001). భువన్ అనే సాధారణ యువకుడు అసా దారణ లక్ష్యాన్ని సవాలుగా స్వీకరించి, విజయం కోసం కావలసిన మానవ వనరు లను తన పరిధిలోనే గుర్తించి, శిక్షణ ఇస్తాడు. ఒక్క తాటిపై నడిచే మహత్తరమైన టీమ్‌ని బిల్డ్ చేయడం ఓ మోడ్రన్ కార్పొ రేట్ కంపెనీ నిర్మాణానికి ‘ప్రొటోటైప్’లా ఉంటుంది. ‘చక్ దే ఇండియా’, ‘గోల్’, ‘ఇక్బాల్’ సినిమాలు కూడా కొన్ని మేనేజ్ మెంట్ విద్యాసంస్థల సిలబస్సులయ్యాయి.
---_---- harikrishna mamidi
(Published as Sunday cover story in SAKSHI FUNDAY supplement in 2011)

Posted 1st December 2011

No comments:

Post a Comment