Wednesday, 21 October 2020

కొత్త మజిలీ !

 




#mhk_poetry

కొత్త మజిలీ !

    ----- మామిడి హరికృష్ణ 8008005231


కాలం ఓ నిరంత రహదారి 

ఎన్నెన్నో మలుపులు, తలపులు, మెరుపులు, మరుపులు 

ప్రతిదీ గొప్పదే

మలుపు మలుపునా ఓ మజిలీ 

మజిలీ మజిలీనా 

ఆశ్చర్యమో, ఆనందమో, ఆవేదనో, ఆక్రందనో 

భీభత్సమో , భయానకమో, కరుణమో, శాంతమో 

విస్మయమో, విజయమో, విపత్తో, వైపరీత్యమో

వీరమో, విప్లవమో, విలాపమో, విషాదమో 

ఏదో ఒకటి తేలిపోతుంది!


2020 మహా మజిలీ 

రెండు రెండ్లు, రెండు సున్నాలున్నట్టుగా 

రెండు మజిలీలు 

కరోనా... వాన...!


తొలి మజిలీలో 

కరోనా కుండపోత వానలా కురిసింది 

మనిషి అహంభావాన్ని ప్రశ్నించింది!

తుది మజిలీలో 

వాన కరోనాలా సకల లోకాన్ని ఆక్రమించింది 

మనిషి ఆధిపత్యాన్ని సవాల్ చేసింది!


కొత్త మజిలీని సృష్టించడానికి 

ప్రకృతి పడుతున్న పురుటి నొప్పులా ఇవి!?


Sunday, 11 October 2020

కాలం జారిపోతున్న సవ్వడి

 **మామిడి హ‌రికృష్ణ గారి క‌విత - కాలం జారిపోతున్న స‌వ్వ‌డి - చిన్న‌పాటి స్పంద‌న‌!


చెంప‌ల మీది బిందువుల్లా రోజులు జారిపోతున్న చ‌ప్పుడునీ

మెట్ల మీద వ‌డ‌గ‌ళ్ళ‌లా  జ్ఞాప‌కం ప‌గిలిపోతున్న చ‌ప్పుడునీ ఎవ‌రైనా విన్నారా? 

ఇదిగో ఈ క‌విత చ‌దివితే వినిపిస్తాయి!


స‌ముద్రంలోకి ఒలికిపోతున్న ఆకాశాన్ని, ఆకాశంలోకి ఇంకిపోతున్న మేఘాన్ని ఎవ‌రైనా చూశారా?

ఈ క‌విత చ‌దివితే క‌నిపిస్తాయి!


- ఆకాశంలో రూపు మారిన వేలాది అవ‌తారాలు

మునిగిన ప‌డ‌వ‌ను నీటి రంగుల‌లో ఖ‌న‌నం చేస్తాయి - ఒక్క నిముషం నీటి రంగు ని గుర్తు తెచ్చుకోకుండా ఉండ‌గ‌ల‌రా.. ఇది చ‌దివాకా?


- తీరం వెంట చెట్టునై నేను

ఇసుక‌నంతా పాదాల ద‌గ్గ‌ర కుప్ప‌గా పోసుకుని

పిట్ట‌గూడును అల్లుతుంటాను - చెట్టు ఒక‌టి ఇసుక‌లోకి వేళ్ళు త‌న్ని నిలుచోవ‌డం, ఆ చెట్టు మీద పిట్ట‌లు గూళ్ళు అల్ల‌డం - సాదృశ్యం చేసిన వాక్యాలు!  అయితే.... గూడు చెట్టు అల్లిందా?  పిట్ట అల్లిందా?  లేక ఇది చ‌దువుతూ నేనో, మీరో అల్లేశామా?


- కెర‌టాలు న‌డుస్తూ న‌డుస్తూ గ‌వ్వ‌ల చేయి ప‌ట్టుకుని వ‌స్తాయి - జ‌స్ట్ ఇమాజిన్‌! 

కెర‌టం వ‌స్తూ వ‌స్తూ కొన్ని గ‌వ్వ‌ల్ని తీరం పైకి విసిరేయ‌డాన్ని ఇంత క‌న్నా బాగా వ‌ర్ణించే అక్ష‌రాలు ఇంకెక్క‌డైనా ఉండి ఉంటాయా?


- స్ప‌ర్శ‌లు వ‌ర్షిస్తూ వ‌ర్షిస్తూ న‌వ్వుల‌ని అశ‌బ్దం చేస్తాయి

అనుభ‌వాలు కోసుకుని కోసుకుని దేహాన్ని దాహ‌ర‌హితం చేస్తాయి!


- వెన్నెల క‌న్నీటి చుక్కై చీక‌టి రెక్క‌లు తొడుక్కుని ఎగిరెళ్ళిపోతుంది

ప‌డ‌మ‌టి గాలి వెలుగు చుక్కై అంత‌రిక్షం గొంగ‌ళి క‌ప్పుకుని మెరుస్తుంది!


చ‌దివిన త‌ర్వాత మ‌నం కూడా స‌ముద్రం ద‌గ్గ‌రకీ, అంత‌రిక్షంలోకీ, ఇసుక‌ల్లోకీ, కెర‌టాల్లోకీ, జ్ఞాపకాల‌లోకీ... కాలం తోపాటు జారిపోతూ... వ‌డ‌గ‌ళ్ళై క‌రిగిపోతూ... ఎక్క‌డ తేల‌తామో!


**Original poem**

***కాలం జారిపోతున్న సవ్వడి ***


చెంపల మీది బిందువుల్లా 

రోజులు జారిపోతున్న చప్పుడు 

మెలుకువ లోకి ఊడిపడిన కాలం

మెట్ల మీద కరిగిపోతున్న వడగళ్ళలా 

జ్ఞాపకం పగిలిపోతున్న దృశ్యం 


మత్తులోకి కూరుకుపోయిన సమయం

సముద్రంలోకి ఒలికిపోతున్న ఆకాశం 

ఆకాశం లోకి ఇంకిపోతున్న మేఘం 

మేఘంలో కుంగిపోతున్న ఆకారం 

ఆకారం లో రూపు మారిన వేలాది అవతారాలు 

మునిగిన పడవను నీటి రంగులలో ఖననం చేస్తాయి 


అడుగున ఉన్న నాచు మొక్కని పైకి తెలుస్తాయి

తీరం వెంట చెట్టునై నేను 

ఇసుకనంతా పాదాల దగ్గర కుప్పలుగా పోసుకుని 

పిట్ట గూడును అల్లుతుంటాను


కెరటాలు నడుస్తూ నడుస్తూ 

గవ్వల చేయి పట్టుకుని వస్తాయి 


ప్రేమలు మండుతూ మండుతూ పువ్వుల్ని మసి చేస్తాయి 

స్పర్శలు వర్షిస్తూ వర్షిస్తూ నవ్వులని అశ‌బ్దం చేస్తాయి 

అనుభవాలు కోసుకుని కోసుకుని దేహాన్ని దాహరహితం చేస్తాయి


ఇక్కడ ఇక వెన్నెల 

కన్నీటి చుక్కై 

చీకటి రెక్కలు తొడుక్కుని ఎగిరెల్లిపోతుంది 

పడమటి గాలి వెలుగుచుక్కైె

అంతరిక్షం గొంగళి కప్పుకుని మెరుస్తుంది .....


- మామిడి హ‌రికృష్ణ‌

(published in andhra jyothi sunday 21 sept,2014)

Thursday, 8 October 2020

MHK poetry Analysis 2 ( సుషుప్తి నుంచి )- యెనగంటి నర్సింగరావు

 మెలకువను పరిచయం చేసే అక్షర సమూహం.

సుషుప్తి నుంచి.....

------------------------------------------------------------

ఏదీ పూర్తిగా తెలియకున్నా ఎంతో తెలుసుననే భ్రమలో, జీవితాన్ని చాలా తేలికగా తీసుకుంటూ హుషారుగా కాలాన్ని దాటేసే వయసులో చదివే చదువు ఇంటర్మీడియట్. అందరూ కుర్రాళ్ళలా అతడు ఆలోచించలేదు, యవ్వనపు ఛాయలు దేహానికే గాని ఆయన పొందిన విజ్ఞానం వయసు ఎంతో ఎక్కువ.  అక్షరాన్ని అమ్మగా ప్రేమించి, కవిత్వపు కమ్మదనాన్ని లోకానికి అందించాలనే అప్పటి ఆ ఆరాటానికి ప్రతిబింబమే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న మామిడి హరికృష్ణ గారి సుషుప్తి నుంచి అనే కవితాసంకలనం.


కవికి ఉన్నతమైన స్థానాన్నిచ్చిన తర్వాత కవిత్వం గురించి చెప్పడం ఉత్తమమైన పద్ధతి. ఇక్కడ కవిని విశ్వజనీనుడని, నిరంతరుడని, నిత్యవసంతుడని, సార్వజనీనుడని వారు సంబోధించినప్పుడే మనకు తెలిసిపోతుంది కవిత్వంపై వారికున్న అనన్య సామాన్యమైన ప్రేమ. చినుకులా ఎప్పుడో ఒకప్పుడు మొదలైన అక్షరం వాక్యంగా రూపుదిద్దుకొని కవిత్వంగా ఎదగడం మొదలయ్యిన తరువాత అది నిరంతర ప్రక్రియగా రూపాంతరం చెందుతుందనే సత్యాన్ని ఆరంభంలోనే మనకు గొప్పగా చెప్పారు హరికృష్ణ గారు. 


ముఖకవళికలు మనిషి ఆలోచనల్ని కొంత వరకు తెలుపుతాయి. కానీ చేతిరాత విధానం అతడి భావోద్వేగ తీవ్రతని చక్కగా చూపిస్తుంది. ఇదే మానసికశాస్త్రం లోని గ్రాఫాలజీ గొప్పతనం. మూడు దశాబ్దాల క్రితం కవి భావవ్యక్తీకరణ ప్రతీ కవితలో పరిణామం చెందిన విధానం మనకిక్కడ బోధపడుతుంది. ఎందుకంటే అన్ని పుస్తకాల్లో మరయంత్రం సాయంతో అందమైన మాయలోకి తోసేసిన అక్షర కూర్పు కాదిది. హరికృష్ణ గారి నేర్పుని, స్వయంగా వారే ఓర్పుతో మనకందించిన గొప్ప ప్రయత్నం. అందుకే ఈ కవితా సౌరభాల్ని మనం ఆస్వాదిస్తూ, ఆనందించాలి.


కాలం దొంతరల్లో నిక్షిప్తమైన ఒక జ్ఞాపకం ఒకానొక ఉలికిపాటు మూలంగా మన నిద్రను చెరిపేసినప్పుడు

ఆ జ్ఞాపకాన్ని పదిలంగా భద్రపరిచిన ఆ వాత్సల్యానికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం. 34 యేళ్ళ క్రితపు అక్షర ప్రవాహం ఎక్కడో తెలియని బందీగా మారినప్పుడు, ఆ అక్షరాలకు స్వేచ్ఛను ప్రసాదించిన ఆ రూపం మామిడి సుదర్శన్ గారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు తెలుపుతూ కవి హృదయాంతరాలలోకి తొంగిచూసి ఆ అనుభూతులను స్వీకరిస్తూ తన్మయత్వంతో తపస్విని తడుతూ మురిసిపోదాం పదండి.

జీవితపాఠాన్ని ఆరంభ కవితగా అందించి, మనోనేత్రంతో లోకాన్ని విశాలదర్శనం గావించిన

ఆ అక్షరాలకు ఆత్మీయ సన్మానం చేసి వద్దాం పదండి.


కలల్లో విహరించిన అబద్దాన్ని వదిలేసి జలతారు పరదాల సరదాలను దాటేసి నిజంలోకి రమ్మనిచెప్పారు వారు. అసమానతల అడ్డుగోడల్లో

నిరంకుశ లావాలో దారిద్య్రపు తుఫాన్ లో నీ కలల శవాలు పడిఉన్నాయి. మెళుకువలోకి వచ్చి చూడమనే చైతన్య బాణాలను సంధించారు. కాంతను మెప్పించే భావుకుడి అవతారం కూడా ఎత్తాడు కవి ఇక్కడ. పెదాల పొగడ్తని పదాలతో ఆరంభించి ప్రేమసరస్సులో ప్రేయసిని తడిపేసిన చిలిపితనపు వయస్సును ప్రతిబింబించారు.


ఆమని సంధ్యావాద్యాలను వినుకుంటూ ప్రేయసి పిలుపులను అమితంగా ఆరాధించిన కవి, వెళ్లిపోయిన బ్రతుకురైలు ప్లాట్ ఫామ్ మీదనే నీ లక్ష్యాలను వదిలేసిపోయినా, నిరీక్షణ తరువాత అదే రైలు మళ్ళీ వస్తుందనే ఆశాభావాన్ని పాఠకుడి మనసులో ముద్రించాడు. గులాబి సౌరభంతో పాటు వెనుక దాగిన ముల్లును కూడా గుర్తుచేసాడు. రక్తమాంసాలు లేని ఎముకలగూడులోంచి ఆకలినేత్రాలతో సమాజ దృశ్యాల్ని మనకు చూపించాడు. సామాన్యుడి జీవితాన్ని పరిచయం చేస్తూ నిశ్శబ్ద సంగీతాన్ని వినిపించాడు.


అసలెప్పుడో మొదలైందీ పయనం.

కోట్లలో ఒకడిగా అలుపెరుగక పోరాటం చేసిన పిదప

దరిచేరిన అదృష్టమిది.

ఎవరు నేర్పారో తెలియదు గానీ,

కణంలాగా ఉన్నపుడే రణం లోన గెలిచాను.

మాసపు సోపానాలు దాటుకుంటూ

మాంసపు ముద్దగా నేలపై పడ్డాను.

గాలితరగలనెన్నో తాకాను,

ఊహల పరుగులకు ఊతమిచ్చాను,

ఆశల నురగలను హత్తుకున్నాను,

అవి చిదిమిన తరువాత చింతించాను.

వలుపుల వలల్లో ఇరుక్కుని ఇబ్బందిపడ్డాను.

ఇవ్వన్నీ పాఠకుడిగా నా భావాలు. నాలాంటి ఎందరి ఆర్తికో అర్థాన్ని చెబుతూ, ఆ చింతలను కాగితంపై చెక్కిన గొప్ప శిల్పి మామిడిహరికృష్ణ గారు.


అలుముకున్న నిర్లిప్తతని, విరుచుకుపడిన నిశ్శబ్దాన్ని చెరిపేసిన ఒకే ఒక్క పదాన్ని పరిచయం చేసిన ప్రయత్నమిది. మంచి చెడుల మధ్య దీనంగా నిలబడి చూస్తుంది. నిజమనే పేరును తనకు తగిలించి సూక్తుల మూటలను బలవంతంగా ఎత్తుతుంటే, మోయలేక అలిసింది తను.

అస్తిత్వ పోరులో, స్వార్థపు ఉధృతిలో,

సంకల్పం చెంత సాగిలపడి దుఃఖిస్తున్న సత్యానికి

కొంత ఊరట కావాలి.

కాంతి ఱెక్కలు విరిచి, పాడుబడ్డ చీకటిలోకి తోసేసి

'చెడు'చేస్తున్న కరాళనృత్యానికి తాళమందించే సమాజంలో అసత్యమనేది నూతన రూపాన్ని సంతరించుకుంటుంది.


బూజుపట్టిన దేహాల ఆర్తిలో,

చెమటచుక్కల ప్రవాహ హోరులో,

భావరహిత చూపుల రేఖలపై

కదులుతూ ఎటెళ్లాలో తెలియక అచేతనమయ్యింది సత్యం. కాలానికి, కపాలానికి  మధ్య సంధి కుదిర్చే బాధ్యత కవిదే. ఆశయాలకు, ఆనందాలకు మధ్య తీవ్రతను గుర్తించే సహనమే కవి. ఆ కవి మనసుపెట్టి రాయడం మొదలుపెడితే సమాజం పొందే ప్రతిఫలం ఎంతో గొప్పగా ఉంటుందనడానికి నిదర్శనం ఈ సుషుప్తి నుంచి...


తెరిచిన పుస్తకంలోనుండి వచ్చే పదాల పరిమళం మదిని తాకుతూ విజ్ఞానం రూపంలో నిక్షిప్తం గావించే బాధ్యతని కవి తీసుకున్నప్పుడు ఆ పదాల సృష్టికర్త దైవంతో సమానం. పదానికి పదానికి మధ్య విరామాన్ని మధ్య విరామాన్ని త్వరగా తుడిచేయాలనే ఆరాటం పాఠకుడిని పరుగు పెట్టించినప్పుడు ఆ కవి చేసిన ప్రయత్నం మహోన్నత ఫలితం పొందినట్టే. ఓపక్క సమాజాన్ని ప్రశ్నిస్తూ, మరోపక్క సమాధానాన్ని సూచించడానికి మనముందుకు తెచ్చిన అద్భుత ప్రయత్నమే ఈ సుషుప్తి నుంచి...


వీధి మొత్తానికి ఉన్న ఒక్క దీపం గొప్పదనాన్ని జీవనదాతలా వర్ణించాడు. ఈస్ట్ మన్ కలర్ లో భవిష్యత్ చిత్రపటాన్ని చిత్రించగలిగినా వర్తమానం ఉలిదెబ్బలని మర్చిపోలేక పోతున్నాననే ఆవేదనని వ్యక్తపరిచాడు కవి. గ్లిజరిన్ కన్నీళ్ళలోని ఆర్ద్రతని, ప్లాస్టిక్ పూలలోని పరిమళాన్ని వెతుక్కునే నేను అబద్దమనే నిన్ను కనుక్కోలేక పోయానని తల్లడిల్లిపోయాడు. భుజాలకు తుపాకులేసుకొని వచ్చిన వాళ్ళు రగిలించిన కాగడాని నీ కన్నీళ్లతో ఆర్పుతారు అప్పుడు నువ్వే మరో సూర్యుడివై వెలగాలి అనే గొప్పనైన ప్రేరణని అందించారు మామిడి హరికృష్ణ గారు.


నీతో నీవే ద్వేష గీతాన్ని ఆలపిస్తూ సృష్టించిన భౌతిక దాడిని వివరించారు. అలలు, మేఘాలు నీకు కనిపించినా, సముద్ర ఘోష నీకు వినిపించినా నా గీతాన్ని గాంచాలంటే నీ మనోనేత్రాన్ని తెరిచిచూడమని నిర్దేశిస్తూ వారి అక్షరాలతో విడదీయలేని ఒక దృఢమైన బంధాన్ని సృష్టించిన ఆ కవి అన్వేషణ ఎంత ఉన్నతమైందో లోతుగా తెలియజెప్పే గొప్ప పుస్తకం 'సుషుప్తి నుంచి'.

మనం కూడా గాఢ నిద్రను వదిలేసి ఉలికిపాటుల్ని ఎంతగానో ప్రేమించుదాం.


         ✍️యెనగంటి నర్సింగరావు

Tuesday, 6 October 2020

లేఖ ...ప్రేమ లేఖ !

 Shubha samayam, plz read my detailed analytical article #LEKHA_PREMA_LEKHA, on the evolution and metamorphosis of #LETTERS in human life, from stone inscripp

లేఖ... ప్రేమలేఖ !

-- మామిడి హరికృష్ణ 8008005231


         ఈ ప్రపంచంలో సంభవించిన సాహితీ, సాంస్కృతిక, శాస్త్రసాంకేతిక, సామాజిక, ఆర్థిక ఆవిష్కరణలన్నీ ఆయా సమాజాల అవసరాల నుంచి ఉద్భవించినవే. అందుకే Necessity is the mother  of all inventions అన్నారు. వేర్వేరు కారణాల వల్ల దూరంగా ఉంటున్న వ్యక్తుల మధ్య సమాచారం - క్షేమం - విశేషాలు - వికాసాలకు సంబంధించిన వివరాలను చేరవేసుకోవాలి... అలా ప్రాంతాలకు అతీతంగా మానవ సంబంధాలను పటిష్టంగా కాపాడుకోవాలనే ఆలోచనలోంచి పుట్టిన సాహితీ  సృజనాత్మక ఆవిష్కరణ - లేఖ!

          Oకానొక కాలంలో లేఖలు, లేఖా సాహిత్యం మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యాన్ని సాధించాయి. క్రమంగా డిజిటల్‌ టెక్నాలజీ, ఇంటర్నెట్‌ల రాకతో ఇతర సంప్రదాయాలలాగే ఉత్తరం కూడా ‘అంతరించిపోయే అలవాటు’ (Endangered Habit) గా పరిణమించింది. ఈ సంక్షోభ సమయంలోనూ  ఓ తీపి కబురు ఉంది. కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రజలంతా స్వీయ నిర్బంధంలో ఇళ్లలోనే ఉన్న సందర్భంలో జరిపిన ఓ ఆన్‌ లైన్‌ సర్వేలో, అత్యధిక శాతం ప్రజలు తమ పాత వస్తువులలో ఉత్తరాలే అమూల్యమైనవని చెప్పారు. ఈ నేపథ్యంలో ఉత్తరాల పరిణామం, లేఖా సాహిత్యపు తీరుతెన్నుల విశ్లేషణే ఈవారం కవర్‌ స్టోరీ..

*************


‘How wonderful it is to be able to write Someone a letter! To eel like conveying your thoughts to a person, to sit at your desk and pick up a pen, to put your thoughts onto words like this is truly marvelous’- ప్రఖ్యాత జపనీస్‌ రచయిత హరుకీ మురాకమి 1987లో రాసిన ‘నార్వేజియన్‌ వుడ్‌' నవలలో ఒకచోట లేఖల గురించి చెప్పిన వాక్యాలివి. 

నిజమే, ఉత్తరం అంటే హృదయ నివేదన...! 

ఆత్మావిష్కారం!! 

అభిప్రాయాల కలబోత!! విషాదానందాల వలపోత! నిత్య జీవితంలోని ఉద్వేగక్షణాలను, ఉత్తేజ సందర్భాలను, ఉల్లాస సన్నివేశాలను, ఉత్కృష్ట సమయాలను అక్షరాలలో పొదిగి, తెల్లకాగితంపై అందంగా లిఖించే మనఃపూర్వక కళ- లేఖారచన! అందుకే ఉత్తరం, మనుషుల మధ్య అక్షరవారధిని కట్టింది! ఆలోచనాస్ఫోరకమై నిలిచింది! ఆత్మీయ భాషణమై భాసించింది! ఆచరణాత్మక దృక్పథమై మార్గదర్శనం చేయించింది.!!

              ఇంతగా మనుషుల జీవితాలతో పెనవేసుకు పోయిన ఉత్తరం గత రెండు దశాబ్దాలకాలం నుంచీ క్రమంగా అదృశ్యమవుతూ వస్తున్నది. మానవజాతి నిర్మించుకున్న ఎన్నో విశిష్టమైన సంప్రదాయాలలో ఒకటైన లేఖారచన  ఇప్పుడు, అంతరించి పోతున్న సంప్రదాయాల కోవలోకి చేరింది...  ఒకప్పుడు కష్టాలను, కన్నీళ్ళను, నమ్మకాన్నీ, ధైర్యాన్నీ, ఆశలనూ... మొత్తంగా జీవితాన్నీ, జీవనేచ్ఛనూ మోసుకొచ్చిన ఉత్తరం నేడు మానవ మస్తిష్కపు స్టోర్‌రూమ్‌లో ‘పాత వస్తువు’గా మారిపోయింది.  అందుకే ఉత్తరం 1990 తరపు మనుషుల వరకూ ఓ నోస్టాల్జీయా... ఒక జ్ఞాపకం... ఒక దిగులు... ఒక బెంగ... ఒక పోగొట్టుకున్న జీవనపార్శ్వం... ఒక కోల్పోయిన ప్రపంచ శకలం... అన్నింటినీ మించి ఒక శిథిల స్వప్నం!

             ఇలా మనసులోనే లుంగలు చుట్టుకుని కునారిల్లుతూ, నవజీవన శైలుల మెరుపులను కళ్ళకు ఎంతగా అతికించుకున్నా, గుండెలోతుల్లో ఏ మూలో నిరుడు కురిసిన లేఖా హిమసమూహాలను తల్చుకుంటూ, మనోభారంతో ‘పెన్ను’నీడుస్తున్న క్షణాన...  నిత్య జీవన పోరాటంలో పరుగెత్తుతూ వర్తమానం వెంట భవిష్యత్తు వెలుగుల కోసం వెంపర్లాటలు పెరిగిన క్షణాన... ప్రపంచమంతా ఒక్క కుదుపు... వాయువేగ, మనోవేగాలతో భ్రమిస్తూ, పరిభ్రమిస్తూ ప్రపంచం అంతా ఒక్కసారిగా ఆగిపోయి స్థాణువై స్తంభించి పోయేలా చేసిన మహా కుదుపు...  మానవాళిపై కరోనా మహమ్మారి దాడి! దేశాలు, ప్రభుత్వాలు లాక్‌ డౌన్‌ ప్రకటించాయి. ప్రజలంతా స్వీయ నిర్బధంలో, ఇళ్ళలో ఉండాల్సి వచ్చింది... ‘లాక్‌ డౌన్‌' ప్రపంచ గమ్యాన్ని చెరిపింది. విశ్వ గమనాన్ని కుదిపింది. ఆర్థిక వ్యవస్థలను, అభివృద్ధిని నిశ్చేష్టపరిచింది. అలాగే ఎక్కడా క్షణకాలమైనా ఆగకుండా, అలుపు లేకుండా దూసుకుపోతున్న మనిషి ఒక్కసారి ఆగిపోయి, తన గతంలోకి, నడిచొచ్చిన బాటవైపు, తనలోకి తొంగి చూసుకునే అవకాశాన్ని కూడా కలిగించింది.!

                ఈ సందర్భంలో ప్రజలంతా, ఇంతకాలం తమ స్టోర్‌ రూమ్‌లలో దుమ్ము కొట్టుకుపోయిన వస్తువులను వెలికి తీశారు... జ్ఞాపకాలను తవ్వుకున్నారు... ఆ తవ్వకాలలో బయల్పడ్డ విస్మృత అనర్ఘ రత్నాలలో ఒక అద్భుతం - ఉత్తరం ! ఇలా, కాలం చెల్లాయని అనుకుంటున్న లేఖలు మళ్ళీ మన హృదయ సౌధంలో కేంద్ర స్థానాన్ని అలంకరించాయి.  ఉత్తరం ఇంతకాలం కేవలం ఓ ‘Nostalgia’ అనుకున్నారు. కానీ ఇది ఓ panacea (మరిచిపోయిన ఎన్నెన్నో జ్ఞాపకాలను తిరిగి బతికించిన అమృతం) అని వెల్లడయింది.  చాలా లేఖలు ‘ఉభయకుశలోపరి’తో మొదలై ‘ఇట్లు మీ శ్రేయోభిలాషి’గా ముగించినప్పటికీ, కొన్ని లేఖలు మాత్రం సాహిత్య రంగంలో కావ్య ప్రతిపత్తిని, శాశ్వతత్వాన్ని సాధించడం విశేషం.!!


*తెలుగు సాహిత్యంలో..*


          తెలుగులో లేఖాసంప్రదాయపు ఛాయలు ప్రాచీన కావ్యాలలో కూడా కనిపిస్తాయి. వాటిలో ప్రముఖంగా ప్రస్తావించుకోదగింది- గజపతిరాజుకు అల్లసాని పెద్దన రాసినట్లుగా చెప్పుకునే పద్యలేఖ! దండయాత్రకు వచ్చిన రాజు ఈ పద్యలేఖతో వెనుదిరిగిపోయినట్లుగా ‘విజయనగర చరిత్ర’ అనే గ్రంథంలో ఉటంకించబడింది. 

         రాయప్రోలు సుబ్బారావు రాసిన ‘స్నేహలతాదేవి లేఖ’ తెలుగు లేఖా సాహిత్యంలో పేరెన్నికగన్నది. ఇంటిని తాకట్టుపెట్టి కూతురు పెండ్లి చేయాలనుకున్న తండ్రి దుస్థితికి చలించి, ఆ కూతురు ఉత్తరం రాసి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ విషాదాంత రచన అప్పట్లో వరకట్నంపై నిరసనగా నిలిచింది.  ఇక గుర్రం జాషువా తన ‘గబ్బిలం’ ద్వారా లేఖా సంప్రదాయపు ప్రాథమిక రూపమైన సందేశ విధానాన్ని పాటించగా, ‘ఫిరదౌసి’ కావ్యంలో పూర్తిస్థాయి లేఖాసాహిత్య సృష్టిని చేశారు. మాట తప్పిన చక్రవర్తి గజనీ ప్రభువును ఉద్దేశించి కవి ఫిరదౌసి రాసిన కవితాలేఖ కరుణరసాత్మకంగా సాగి గుండెలను ఆర్ద్రం చేస్తుంది. 

        తిరుపతి వేంకటకవులు 1910-14 మధ్యకాలంలోరాసిన ఉత్తరాలతో వేసిన ‘గీరతం’, అనుభూతి కవి దేవరకొండ బాలగంగాధర తిలక్‌ రాసిన ‘సైనికుడి ఉత్తరం’ కవిత (‘అమృతం కురిసిన రాత్రి’ లోనిది), త్రిపురనేని గోపీచంద్‌ రాసిన నవల  ‘పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా’, ‘పోస్టు చెయ్యని ఉత్తరాలు’, పానుగంటి లక్ష్మీనరసింహారావు ‘సాక్షి’ వ్యాసాలు (అందులోనూ ఆరో సంపుటిలోని లేఖలు), బోయి భీమన్నరాసిన ‘జానపదుని జాబులు’ తెలుగు సాహిత్యంలో లేఖా సంప్రదాయానికి పెట్టని కోటలుగా నిలిచాయి.

        ఇవే కాకుండా నవలల్లో కూడా లేఖా ప్రయోగాలు విస్తృత పాఠకాదరణను పొందాయి. వాటిలో యద్దనపూడి సులోచనారాణి రాసిన ‘ప్రేమలేఖలు’ నవల, మరో రచయిత రాసిన ‘ఉత్తరాయణం’ అనే హాస్య నవల ప్రముఖమైనవి. పాపులర్‌ నవలా రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన ‘దూరం’ నవల ఆసాంతం ఉత్తరాలతోనే నడిచి పాఠకులకు శిల్పపరంగా కొత్త అనుభూతినిచ్చింది. ఇక, చలం రాసిన ‘ప్రేమలేఖలు’ అయితే తెలుగు లేఖా సాహిత్య ప్రస్థానంలో ఒక మేలుమలుపుగా నిలిచాయి. లేఖాప్రక్రియ ద్వారా ఎంత హృద్యమైన సాహిత్యాన్ని సృష్టించవచ్చో నిరూపించాయి. అలాగే, మామిడి హరికృష్ణ 2012 అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవ వేడుక విశేషాలను ఓపాఠశాల విద్యార్ధి తన మేనమామకు ఉత్తరం రాసినట్లుగా అందించాడు.


*లేఖా సాహిత్యంలో..*


        ‘కాదేదీ సాహిత్యానికనర్హం ‘ అన్నట్టు మానవ జీవితాన్ని పరివేష్టించి ఉన్న ఏ అంశంపైన అయినా సాహిత్యాన్ని సృజించవచ్చు. అయితే ఆ జీవన పార్శ్వాన్ని అందంగా, మనోరంజకంగా అందించడానికి రచయితకు నైపుణ్యం అవసరం. ఏ వస్తువు అయినా, ఏ అంశం అయినా లేఖాశైలిలో అందించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా విశ్వ విద్యాలయాలు, సాహితీ పీఠాలు దీనిపై విస్తృత స్థాయిలో అధ్యయనాలు నిర్వహించాయి. ఈ పరిశోధనలను అనుసరించి, ఇప్పటి వరకు అంతర్జాతీయంగా వచ్చిన లేఖా సాహిత్యంలోని వస్తువు (Subject) ఆధారంగా లేఖలను అనేక రకాలుగా అభివర్ణించారు. వాటిలో కొన్ని... 

 

ప్రకృతి లేఖలు; ఆరోగ్య లేఖలు; కుటుంబ సంబంధాల లేఖలు; శాస్త్ర, సాంకేతిక లేఖలు; ప్రత్యేక దినాలపై లేఖలు; దేశభక్తి లేఖలు; జీవన శైలి లేఖలు; పండుగలపై లేఖలు; మార్గదర్శులపై లేఖలు; భాషా సాహిత్యాలపై లేఖలు; సామాజిక -రాజకీయ లేఖలు; మత, ఆధ్యాత్మిక, తాత్విక  లేఖలు; ప్రపంచ శాంతి- మానవీయ లేఖలు!


*వాక్యాల వెంట ప్రయాణం*


        లేఖా సాహిత్యంలో పదాలను పొదిగిన తీరు, వాక్యాలను అల్లిన విధానం, విషయానికి విషయానికీ మధ్య సంభాషణా శైలి.. అంతా ఆయా రచయితలు  వేరువేరు రూపాలలో మన ఎదురుగా నిలబడి, మన చేయిపట్టుకుని తమ వెంట తీసుకెళ్ళినట్టుగా అనిపిస్తుంది. సాధారణంగా లేఖలన్నింటినీ ఒకేసారి ఏకబిగిన చదివినా, విడివిడిగా దఫదఫాలుగా చదివినా ఈ లేఖల అంతిమలక్ష్యం మనలోని మానవున్ని, మానవత్వాన్ని, మానవ తత్వ్తాన్ని స్పృశించినట్లుగానే అనిపిస్తాయి. “అక్షరం - సాహిత్యం ఏదైనా ఒక విస్తృత సామాజిక ప్రయోజనాన్ని కలిగి ఉండాలి. మనకు తెలీని మనలోని అంతరంగ మానవున్ని తట్టి లేపాలి. రేపటి సుందర సమాజ నిర్మాణానికి మనల్ని పురికొల్పాలి. ఒక్కమాటలో చెప్పాలంటే సాహిత్య సృష్టి ఏదైనా దాని అంతిమ లక్ష్యం మానవత్వ పునరుద్ఘాటనే (Reaffirmation of humanity) కావాలి..’ అనే మాటలకు నిలువెత్తు ఉదాహరణగా లేఖలు ఉంటాయి!


*లేఖలు...*


మనసు నుండి మనసు వల్ల, మనసు కోసం...

మనసుతో మనసు చేసే సంభాషణలు. 

వాటిని మనసు విప్పి విందాం...!

గుండె తడిని, మనసు అలజడిని, ఆలోచనల ఉరవడిని, సంఘర్షణల తాకిడిని...

అనుబంధాల జడిని నిక్షిప్తం చేసుకొన్న జీవన నిధులు. 

వాటిని.. హృదయం తెరచి చూద్దాం.. !

ఈ లాక్‌ డౌన్‌ కాలంలో స్టోర్‌రూమ్‌ల నుంచి బయటపడ్డ పాత ఉత్తరాల ప్రేరణతో మళ్ళీ ఒకసారి మన ఆత్మీయులను లేఖలతో పలుకరిద్దాం...!


********************

ఉత్తరం రాయడం ఓ కళ !


       ‘ఉత్తరం రాయడమూ ఒక కళే’ అని తరచూ అంటుంటాం, వింటుంటాం.  కానీ లేఖా రచనను ఓ కళాత్మక విషయంగా అధ్యయనం చేసే శాస్త్రం ఒకటుందనే విషయం మాత్రం అంతగా తెలీదు. ఉత్తరం రాసే కళనే గ్రీకులు ప్రాచీన కాలంలోనే  ‘Epistolography’ అని పిలిచారు. Epistole అంటే అక్షరం, ఉత్తరం అనీ, graphia అంటే రాయడం, లిఖించడం అనీ అర్థం. ఈ శాస్త్రం యూరప్‌లో బైజాంటైన్‌ సామ్రాజ్యంలో స్వర్ణయుగాన్ని చవి చూసిందని చెప్పాలి. ప్రాచీన కాలంలో తూర్పు రోమన్‌ సామ్రాజ్యానికే బైజాంటియమ్‌ అని పేరు. ఇది యూరప్‌లో క్రీ.శ. 395 నుండి 1453 వరకు రాజ్యమేలింది. ఈ సామ్రాజ్య రాజధాని అయిన బైజాంటియమ్‌ నగరం 1453లో ఆటోమాన్‌ టర్కుల ఆక్రమణ అనంతరం ‘కాన్‌స్టాంటి నోపిల్‌'గా, ఆధునిక కాలంలో ‘ఇస్తాంబుల్‌'గా పేరుపొందింది. ప్రాచీన బైజాంటియన్‌ చక్రవర్తులు తమ శాసనాలకు, చట్టాలకు సంబంధించిన ప్రతీ అంశాన్నీ ప్రజలకు, ఇతర రాజులకు ఉత్తరాల ద్వారా తెలియజేసేవారు. ఆ లేఖలను రసరమ్యంగా, మనోరంజకంగా రాయడానికి ప్రత్యేక నిపుణులను నియమించుకోవడమే కాదు, రాజశిక్షణలో యుద్ధ విద్యలతో లేఖారచనా కళనూ అభ్యసించేవారని తెలుస్తున్నది. రాజ్యాల మధ్య యుద్ధం లేదా శాంతి ఏర్పడాలన్నా, ప్రజలలో రాజుపట్ల భక్తిభావం, విధేయత పెరగాలన్నా లేఖవల్లనే సాధ్యమవుతుందనే మౌలిక విషయాన్ని రోమన్‌ చక్రవర్తులు తెలుసుకున్నారని దీన్నిబట్టి చెప్పవచ్చు.

********************

లేఖా సాహిత్యం 


        సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. దీనికి ఆయా సాహిత్య ప్రక్రియలలోని వస్తువు (Theme), శైలి (style),  శిల్పమే (technique) ప్రధాన కారణాలు. ఆ లెక్కన విశ్లేషిస్తే ఉత్తరాల ద్వారా విషయాన్ని వెల్లడించే విధానాన్ని ‘లేఖాసాహితీ ప్రక్రియ’గా చెప్పవచ్చు. లేఖాసాహిత్యానికి సమానార్థంగా ఇంగ్లీష్‌లో ‘Epistolary’ అని పిలుస్తారు. ఇది గ్రీక్‌ పదం ‘Epistle అంటే ‘అక్షరం’ లేదా ‘ఉత్తరం’ నుండి ఏర్పడింది. అంటే, Epistolary is a literary genre pertaining to letters అన్నమాట!

************************


*తోకలేని పిట్ట నుండి ట్విట్టర్‌ దాకా...*


       2000 సంవత్సరం తర్వాత దేశంలో మొదలైన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ వల్ల పేజర్‌, ఈ-మెయిల్‌, షార్ట్‌ మెసేజెస్‌ సర్వీస్‌ వంటివి జనబాహుళ్యంలోకి వచ్చి ‘సంప్రదాయ లేఖ’ అర్థాన్నే మార్చివేశాయి.

      నిజానికి ‘లేఖ’ ప్రధాన లక్ష్యం - సమాచారాన్ని, సందేశాన్ని ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి చేరవేయడం! నిర్దేశిత వ్యక్తులు ప్రత్యక్షంగా కలుసుకోలేకున్నా, దూరంగా ఉన్నా వారిమధ్య సమాచార మార్పిడికి, తదనంతర కార్యాచరణకు దోహదం చేసే మానవ అవసరంలోంచి ఉత్పన్నమైన లిఖిత విశేషమే- లేఖ! అయితే, ‘లేఖలు’ వేలాది సంవత్సరాల నుంచీ ఎన్నో దశలను దాటి, ఎన్నెన్నో పరిణామాలను చవి చూశాయి.

       మొదట్లో లేఖ సారాంశం మౌఖికంగా వార్తాహరులు, రాయబారులు, అనుచరుల ద్వారా చేరవేయడం జరిగేది. ఆ తర్వాత శిలలపై చెక్కిన అక్షరాల ద్వారా, ఆ తర్వాత తాళ పత్రాల ద్వారా, వస్త్ర పత్రాల ద్వారా సమాచారాన్ని చేరవేసేవి. ఆ కాలంలో లేఖలను గమ్యానికి చేర్చేందుకు మనుషులు, పక్షులు, జంతువులను వాహకాలుగా ఉపయోగించేవారు. మన దేశంలో 1853లో రైల్వే రవాణా ప్రారంభం కావడం, 1854లో తపాలా విధానం అమలులోకి రావడం... ముఖ్య పరిణామాలు. దీంతో, లేఖా సంప్రదాయం రాజులు, కులీనులకు మాత్రమే పరిమితం కాకుండా.. చదువుకున్న ఇతర సమాజాలకు కూడా అందుబాటులోకి వచ్చింది. మరోవైపు ‘లేఖల చేరవేత’ విధానం వ్యవస్థీకృతమై ఉత్తరాల బట్వాడా సులభతరం అయింది. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ లేఖలు ఎన్నో  మార్పులకు గురి అయ్యాయి.  అలా టెలిగ్రామ్‌, ఫ్యాక్స్‌ (ఫాసిమిలీ) విధానాలు అందుబాటులోకి వచ్చాయి.      


        2000వ సంవత్సరం తర్వాత దేశంలో మొదలైన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ వల్ల పేజర్‌, ఈ-మెయిల్‌, షార్ట్‌ మెసేజెస్‌ సర్వీస్‌ వంటివి జనబాహుళ్యంలోకి వచ్చి ‘సంప్రదాయ లేఖ’ అర్థాన్నే  మార్చివేశాయి. ఇక సోషల్‌  మీడియా (ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, టిక్‌టాక్‌) విజృంభణలతో లేఖలు, లేఖా సాహిత్యం అనేవి గతకాలపు చిహ్నాలుగా, అంతరించిపోతున్న  సంప్రదాయంగా మారాయి.  అయితే, కొంచెం సానుకూలంగా ఆలోచిస్తే ‘లేఖ’లోని ‘ఆత్మ’ (సమాచారాల చేరవేత) కనుమరుగు కాలేదనీ, లేఖ రూపం మాత్రమే (పేపర్‌ నుండి పేపర్‌లెస్‌ ఈ-మెసేజ్‌లకు) మారిందనీ అర్థమవుతుంది. ఆ లెక్కన ప్రస్తుతం న్యూజనరేషన్‌  సాంకేతిక రూపాలైన మెయిల్‌, మెసేజ్‌ వంటివన్నీ ‘లేఖ’కు కొనసాగింపులుగానే భావించాల్సి ఉంటుంది.

*************************

*ప్రపంచ సాహిత్యం*


         లేఖా సాహిత్యం (Epistolary) ప్రక్రియలో ప్రపంచభాషలలో వచ్చిన తొలి నవలగా 1485లో Diego de San Pedro స్పానిష్‌లో రాసిన ‘Prison of Love’ని చెప్పుకోవచ్చు. కాగా ఇంగ్లీష్‌ సాహిత్యంలో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన సాహితీవేత్తగా Howell (1594-1666) కలం పట్టిన ‘Familiar Letters’ ను పేర్కొంటారు. 18వ శతాబ్దం నాటికి లేఖా సాహిత్యం అనూహ్యమైన ప్రగతిని సాధించింది. జేన్‌ ఆస్టిన్‌, వర్జీనీయా వుల్ఫ్‌ లేఖల రూపంలో సాహిత్యాన్ని వెలువరించారు. ఫ్రాంకెన్‌స్టిన్‌, డ్రాకులా, ద కలర్‌ పర్పుల్‌ లాంటి క్లాసిక్స్‌ లేఖారూపంలోనే సాగుతాయి. రెండో ప్రపంచయుద్ధ కాలంలోని భయానక బీభత్స అనుభవాలను, వాటిపై స్పందనలను ప్రతిఫలించిన ‘ద డైరీ ఆఫ్‌ ఎ యంగ్‌ గాళ్‌' కూడా కొంత లేఖారూపంలోనే రాయడం విశేషం. 

***********************


*మౌఖిక లేఖలు*

         రాయబారాలూ, మధ్యవర్తిత్వాలూ మౌఖిక లేఖల కిందికే వస్తాయి. దూతగా పంపినవారి మనోభావాన్ని వెల్లడించడమే వీరి పని.  భారతీయ ఇతిహాసాలైన రామాయణం, మహాభారతాలలోని రాయబార ఘట్టాలన్నీ మౌఖిక లేఖా సంప్రదాయంలోని తొలి రూపాలే అని చెప్పవచ్చు. అంగదుడు, హనుమంతుడు, సంజయుడు, శ్రీకృష్ణుడు ఆయా సందర్భాల్లో చేసిన ప్రయత్నాలు దీనికి ఉదాహరణలు. 

            కాగా, పూర్తిస్థాయిలో లేఖా సాహిత్యం మొదటగా మనకు సంస్కృతంలో రాసిన ‘సుహృల్లేఖ’ లో కనిపిస్తుంది. ఈ పదానికి అర్థం ‘మిత్రునికో ఉత్తరం’ (An Epistle to a Friend)! దీనిని బౌద్ధ మహాముని ఆచార్య నాగార్జునుడు (క్రీ.శ. 50-120) రాసాడు. ఆనాటి శాతవాహన చక్రవర్తి శాతకర్ణిని ఉద్దేశించి బౌద్ధమతంలోని విశిష్టతలను, సామాజికావసరాన్ని వివరిస్తూ ఈ బృహత్‌ లేఖను ఆయన రాశాడు. 

          అలాగే ‘సందేశ కావ్యాలు’ కూడా లేఖా సాహిత్యం కోవ లోనివే అని చెప్పవచ్చు. కాళిదాసు రాసిన ‘మేఘదూతం’ దీనికి ఉదాహరణ. విరహంతో ఉన్న యక్షుడు తన ప్రేయసికి మేఘం ద్వారా సందేశాన్ని అందించే లక్ష్యంతో రాసిన ఈ కావ్యం సాహితీ శిల్ప సంప్రదాయాలలో ఓ విశిష్ట ప్రయోగం అనే చెప్పాలి.

************************

*ప్రేమ లేఖల రూటే సెపరేటు*

           లేఖా సాహిత్యం ఆయా దేశ కాలాల సామాజిక, ఆర్థిక రాజకీయ పరిస్థితులకు అనధికారిక డాక్యుమెంటేషన్‌గా, చరిత్ర రచనకు మరొక ఆధారంగా ఇప్పుడు సర్వత్రా ఆమోదాన్ని పొందింది. అయితే లేఖా సాహిత్యంలో, ప్రేమలేఖా సాహిత్యం మరొక అడుగు ముందుకేసి, అంతర్జాతీయంగా ఆయా ప్రముఖ వ్యక్తుల వ్యక్తిగత జీవిత అంశాలను, ప్రపంచానికి తెలియని కొత్త కోణాలను వెల్లడి చేస్తున్నాయి. బ్రిటిష్‌ రాణులు,  నోబెల్‌ విజేతలు, చక్రవర్తులు, గతకాలపు దేశాధినేతలు.. వంటి ఎంతోమంది ఆయాకాలాల్లో  రాసిన ప్రేమలేఖలు, వారిలోని విస్మృత కోణాలు లోకానికి ఆవిష్కృతం చేస్తున్నాయి.


          అలా ప్రముఖులు వేర్వేరు సందర్భాలలో రాసిన ప్రేమలేఖలను చదివితే ప్రఖ్యాత Zen బోధకుడు Thich Nhat Hanh చెప్పినట్లు -A real love letter is made of insight, understanding, and compassion. Otherwise it’s not a love letter. A true love letter can produce a transformation in the other person, and therefore in the world. But before it produces a transformation in the other person, it has to produce a transformation within us. Some letters may take the whole of our lifetime to write.  అనే మాటలకు రుజువులుగా అనిపిస్తాయి.

        అలాగే సాధారణంగా ప్రేమలేఖలు రాసే విధానం అనుకోకుండానే Franz Kafka ఓ సందర్భంలో చెప్పినట్లు - “I answer one of your letters, then lie in bed in apparent calm, but my heart beats through my entire body and is conscious only of you. I belong to you; there is really no other way of expressing it, and that is not strong enough” అన్నమాటలను గుర్తుచేస్తాయి. అలా ఈ ‘ప్రేమలేఖలు’ వస్తువు పరంగానే కాక, శైలి (Presentation Style) లో కూడా కొత్త పుంతలు తొక్కాయనే చెప్పవచ్చు. సాధారణంగా ఉత్తరం రాసే శైలి సహృదయతని కలిగి ఉంటుంది. కానీ ‘ప్రేమలేఖలు’ సహృదయతతో పాటు విజ్ఞానాన్ని, వికాసాన్ని, విశ్లేషణను, వివరణలను కూడా అందించి తొలి అక్షరపు పలకరింపు నుంచి చివరి ముగింపు వాక్యం దాకా ఒక సున్నిత ఆత్మీయతను అక్షరాలనిండా నింపుకుని పరిమళిస్తాయి.

***********************

*కొత్త ప్రేమలేఖలు : లెటర్స్‌ టు లవ్‌*  


        ప్రముఖ కవయిత్రి, రేడియో అనౌన్సర్‌  అయినంపూడి శ్రీలక్ష్మి  రాసిన ‘కొత్త ప్రేమలేఖలు’ పుస్తకం తెలుగు సాహితీలోకంలో కొత్తముద్రను వేసిందని చెప్పాలి. లిఖిత రూపంలోఉండాల్సిన లేఖలను మొదటగా ఆకాశవాణిలో సంవత్సర కాలం పాటు ‘శ్రవణ’రూపంలోప్రసారం చేయడం, తర్వాత పుస్తకంగా సంకలనం చేయడం ద్వారా వాటికి ‘ముద్రణ’ రూపాన్నివ్వడం అపూర్వమైన విషయమే! ఈ పుస్తకంలో పొందుపరిచిన  51 ప్రేమలేఖలు స్థూలంగా ఎన్నెన్నో సామాజిక, సాంస్కృతిక, సాహిత్య, ఆర్థిక, జీవన శైలి సంబంధిత అంశాలపై విషయపరంగా, విశ్లేషణపరంగా,  తెలియని కోణాలను ఆవిష్కరించి ‘కొత్త’ అన్నపేరును సార్థకం చేశాయి.   

           అలాగే, యువ రచయిత్రి కడలి సత్యనారాయణ రాసిన ప్రేమలేఖల సంకలనం - ‘లెటర్స్‌ టు లవ్‌'! 40 లేఖలు ఉన్న ఈ పుస్తకంలో ప్రేయసీ ప్రియుల మధ్య జీవన పార్శ్వాలను సున్నితంగా వ్యక్తీకరించడమే కాక, న్యూ జనరేషన్‌ యువత సమకాలీన ప్రపంచాన్ని, స్త్రీ పురుష సంబంధాలను అర్ధం చేసుకుంటున్న తీరును అద్దంలా చూపించింది. అయితే ఈ ప్రేమలేఖలన్నింటా, ఆమె పుస్తకం ప్రారంభంలోనే చెప్పినట్టు చలం శైలి, ప్రభావం సమకాలీనతరపు ఆలోచనలతో దర్శనమిస్తాయి. 

***********************

*సామాజిక ప్రయోజనం*

           స్వామి వివేకానందుడు (1863-1902), శరచ్చంద్ర చటోపాధ్యాయ (1876 -1938), జవహర్‌లాల్‌ నెహ్రూ  (1889-1965) వంటి వారు రాసిన లేఖలు మొదటి కోవలోకి వస్తాయి. నెహ్రూ తన కూతురు ఇందిరాగాంధీకి రాసిన లేఖలు కేవలం వ్యక్తిగత క్షేమ సమాచారంగానే కాక సాధికారిక విజ్ఞాన అంశాలుగా ప్రసిద్ధికెక్కి, వైయక్తికతను (Individuality) అధిగమించి, సామాజిక ప్రయోజనాన్ని (Social Utility) సాధించాయి.  

        అలాగే విశ్వకవి, నోబెల్‌ సాహిత్య పురస్కార గ్రహీత రవీంద్రనాధ్‌ ఠాగూర్‌కూ... తన అభిమాని, అర్జెంటీనా దేశస్థురాలు  విక్టోరియా ఒకెంపోకు మధ్య సాగిన ఉత్తరాలు, ప్రపంచ సాహిత్య చరిత్రలో సహృదయ స్పందనలుగా గుర్తింపు పొందాయి. ఆ లేఖా బంధమే చివరికి ఠాగూర్‌ ‘పూరబి’ పేరుతో ప్రేమ కవితల సంకలనాన్ని రాయడానికి ప్రేరణగా నిలిచింది. ఈ కావ్యాన్ని ఆయన ఆమెకు అంకితం ఇవ్వడం కూడా వాదనను బలపరుస్తున్నది.!

---------  Harikrishna Mamidi

MHK poetry Analysis 1

 కవిముద్ర - 52

~

తెలంగాణ జీవద్భాష సొబగుల సౌందర్యం- 'మామిడి హరికృష్ణ' కవిత్వం

~

కవిగా 'ఊరికిపోయిన యాళ్ళ'(2018), 'ఒంటరీకరణ'(2019), 'సుషుప్తి నుంచి'(2020) మూడు కవిత్వసంపుటులు తీసుకొచ్చారు. వరంగల్ జిల్లాలోని శాయంపేట తన పుట్టినూరు. ఊరితో కవికున్న గాఢమైన అనుబంధం, పల్లెభాష, జానపదుల బతుకుల్లోని సంస్కృతులు, జీవనవిధానాలు; పల్లెలపై ప్రపంచీకరణ ప్రభావం, తెలంగాణ ఉద్యమం, మనిషి మనసు లోతుల్లోకి వెళ్ళి తనను తాను అన్వేషించడం, మనిషి భావోద్వేగస్థాయిలు, యవ్వనంలోని ప్రేమ, విరహం, అభ్యుదయ భావజాల ప్రభావం మొ.నవి తన కవిత్వం నిండా పుష్కలంగా కనిపిస్తాయి. కవిత్వనిర్మాణంలో కథనాత్మక పద్ధతి వాడటం వల్ల ఊర్లలో జనం ముచ్చట్లు చెప్పుకునే విధానంలానే ఆసక్తికరంగా వుంటూ సారం వైపుకు తన కవిత్వం లాక్కెళ్తుంది. చెప్పదల్చుకున్న విషయానికి 'ఉన్ముఖీకరణ' లాగా నిర్మాణవిధానంలోని కొనసాగింపు వుంటుంది. శీర్షికను ధృడపరిచేలా బహుళ నిర్వచన ప్రవచనాలు ప్రత్యేకంగా అనిపిస్తాయి. వీటిని మొదటి సంపుటిలో ఎక్కువగా చూస్తాం.

"కొడ్కా! నువ్వు ఎక్కడికిపోతే అక్కడికి నువ్వొక్కనివే పోవు"(అమ్మమాట)

ఇందులో సమాంతర చర్యలు(parallel actions) ప్రస్తావించబడ్డాయి. తల్లి పిల్లాడిని బడికి తయారు చేయడం ఒక పక్క, మంచిగ  సద్వుకుని మంచిగ పనిచేస్తే మంచోల్లంటరని బుద్దులు జెప్పుడు ఇంకోపక్క ఏకకాలంలో జరుగుతుంటాయి. ప్రాంతీయత నుండి అంతర్జాతీయత వరకు మనిషి ఎదుగుదలను, ఎదుగుదలతో పాటుగా అవిభాజ్యంగా ప్రయాణం చేసే కుటుంబం, కులం, ఊరు, జిల్లా, రాష్ట్రం, దేశం మొ.నవి  మంచి-చెడ్డల్ని ఎలా మోస్తుంటాయో చెప్తూ- పిల్లల వ్యక్తిత్వవికాసనిర్మాణంలో తల్లి పోషించే పాత్రను ప్రతిబింబిస్తుందీ కవిత.

"ఇగ చూస్కో ఊరు ఊరే బండ్లమీద బైలెల్లినట్టుండేది!"(బుగులోని తీర్థం)

తెలంగాణ సంస్కృతిలోని జాతరలు, తీర్థాలు జానపదుల జీవితాలతో ఎంతగా పెనవేసుకుని వున్నాయో చెప్పడం ప్రధానమైన విషయం. దానితోపాటు పట్టింపు వున్న, ఆచరించే మనుషులున్నంత కాలమే అవి వారితో వెలుగొందుతాయన్న సత్యం అంతర్గతంగా చెప్పబడింది. తల్లిపేగును తెంపుకున్న పసిబిడ్డను ప్రస్తావించడంలోని ఉద్ధేశ్యం అంతరార్థం ఇదే! 

"బోనాన్ని తలకెత్తుకొని/సాంపి సల్లి, సాలుకట్టి, సాకుకొని/సావుకెదురు నిల్సింది నా తెలంగాణ!"(బోనం సాక!)

ఇవి పండుగలే కాదన్నోల్లకు, అనాగరికమని అవమానించినోల్లకు బుద్ధి చెప్పిన కాలమది. నగరం ఊరులా రూపాంతరం చెందే బోనాలు హైద్రాబాద్ పురా సంస్కృతికి ఆనవాలు. ఊరి పండుగల్ని ఉద్యమంలో భాగంగా సాంస్కృతిక ఆయుధాలుగా ఎక్కుపెట్టిన కాలమది.

ప్రతి కవితలోనూ ప్రాణప్రదమైన పాలమొగురం లాంటి ఒక్కవాక్యమైనా దొరుకుతుంది. ఆ వాక్యం చుట్టూ 'కవిత' మొత్తం అనేక అంత్రాల తీగల్లెక్క అ లుముకుని తన బలిమిని చూపిస్తుంది.

"నివద్దిగ చెప్తే గీ వానల చత్తిరి ఉంటే/పక్కన మనిషున్నట్టే"(చత్తిరి)

వస్తువుతో ముడిపడివున్న అనేక నిర్ధిష్టతలను  ఆధారంగా చేసుకుని సాధారణీకరించడం కనిపిస్తుంది. ఇక్కడ చత్తిరిని రకరకాలుగా " చినుకులల్ల పూసిన నల్లతంగేడుపువ్వు, పెద్ద మర్రిచెట్టు, సాత్ గ నిలబడ్డ జిగ్రీదోస్త్, అత్తాకోడల్ల పంచాయితీ నడిమిట్ల అడ్డంగ నిలబడ్డ ఎర్రిబాగుల కొడుకు" గా వర్ణించడం జరిగింది. చత్తిరి పట్టుకున్న వ్యక్తినిబట్టి అవతారాల్ని చెప్పడం(వామనుడు, గోపయ్య, ఇంద్రుడు, ఆదిశేషు) చూస్తాం. ఇటువంటి సాధనను 'దారం కట్టిన సందమామ', 'దోని నీళ్ళు' కవితల్లోనూ చూస్తాం. 

"మెడల గొలుసు కట్టుకున్న కుక్కపిల్ల/మా ఎన్క తోకూపుకుంట/గాలిల తేలుకుంట వచ్చినట్టు అనిపిచ్చేటిది"(దారం కట్టిన సందమామ)

పతంగిని దారం కట్టిన సందమామగా, పైలోకాలనున్న ఏ దేవునికో పంపించే ధన్యవాదాల ఉత్తరంగా, మనకాలపు అర్జునుడు ఏసిన కాయితపు నిచ్చెనగా చెప్పిన నూతన అభివ్యక్తులకు ముగ్ధులమవుతాం.

"రెండు కాలాలలో ఎవరికీ పట్టని దోని/వానకాలంల శివుని శిగల గంగలెక్కయితది/అప్పటిదాంక సడీసప్పుడు చెయ్యక/ఇంటికప్పు మీది చెత్తను/రాలిపడిన యాపచెట్టు ఆకులను నింపుకుని వడ్లబస్తలెక్క గమ్మునుంటది/తొలిచినుకు పడంగనే/దబ్బదబ్బ ఆ సరుకునంత ఖాళీచేత్తది"(దోని నీళ్ళు)

తరంగ చలనంలో శృంగం, ద్రోణి లాంటి పదాల్ని వింటాం. ద్రోణిలాంటిదే దోని. దోనిని 'ఇల్లు పట్టిన దోసిలి, మబ్బుల వాన కోసం కట్టిన కాలువ, బెంగుళూరు గూనలన్ని కలిసి చినుకుల గింజలను ఒక్కచోట రాశిపోసే కల్లం'గా చెప్తాడు కవి. ఇవి కవిత్వసాంద్రతను పట్టిస్తాయి. అలాగే "ఊరికిపోవడం అంటే/ఊరికే పోవడం కాదు/ఊపిరి కోసం పోవడం"(ఊరికిపోయిన యాళ్ల) లాంటి వాక్యాలు ఎప్పటికీ మనోఫలకంపై గుర్తుండిపోతాయి. తెలంగాణ జీవద్భాష అత్యంత సహజంగా ఒదిగిపోవడం కవిత్వానికి మరింత శోభను చేకూర్చే అంశం.

"గుట్టల్ల బాంబు పెట్టినం/సుతిలికి అగ్గిపెట్టి/గుట్ట ఎప్పుడు పేలుతదా/అని యెదురుసూసినం/గుట్ట పేలింది - ముక్కలు చెక్కలయింది"(గుట్టను పగలేసినం)

అది బొర్రపెట్టిన సీమాంధ్ర నాయకత్వపు అధికారపు గుట్ట. గుట్టను పగలేసినంకనే మన జాగ జాడ దెల్శింది. మన జెండాపాతి అస్తిత్వ గౌరవాన్ని నిల్పుకున్నం - అనే సారాంశం ఇందులో వుంది.

*

కవి సృష్టించిన నూతన కవితా ప్రక్రియ "Fusion షాయరీ". దీని అవసరం ఏంటి? అని ప్రశ్నించినపుడు "విశ్వవ్యాప్తమైన భావాల్ని వ్యక్తం చేసే భాష కూడా హద్దులకు, పరిమితులకు అతీతంగా మారాల్సిన అవసరంలోంచి, వాటి నేపథ్యంలోంచి పుట్టుకొచ్చిన సమకాలీన నవకవితా సంప్రదాయమే multi-lingual, multi-cultural కవిత్వంగా చెప్తూ దానికి Fusion షాయరీ" గా నామకరణం చేసినట్టు చెప్తాడు కవి. ఇక్కడ fusion అనేది poetry&prose ల కలయికను చెబుతుంది. prose style లోని paragraph pattern మరియు poetry లోని stanza form మిళితమై రెండింటి లక్షణాల్ని కల్గివుంటుంది. అయితే యిది 4 నుంచి 8 stanza లు వుండి, ప్రతి స్టాంజా చివర విడిగా కొసమెరుపు లాంటి వ్యాఖ్యానం ఉంటే గాఢత చేకూరి పాఠకుడికి రసానుభూతి కలుగుతుందని చెప్పబడింది. ఇది కవి సృజనాత్మక నైపుణ్యంపై ఆధారపడి వుంటుంది.

"Fusion షాయరీ on తెలంగాణ జమీన్" ను గమనిద్దాం.

1. of course, మట్టి గొప్పది.. మట్టి సూపిన బాట గొప్పది

2. Indeed, ఈ మట్టి గొప్పది. ఈ మట్టి మండించిన ఉద్యమాల బట్టీ గొప్పది

3. షాయర్ ఈ మట్టి గొప్పది. ఈ మట్టి నుండి పుట్టిన ప్రజానీకం గొప్పది

ఇవి వివిధ స్టాంజాల్లోని విడిగా వుండే మెరుపులాంటి వాక్యాలుగా చెప్పబడ్డ పంక్తులు. అయితే ఏ కవికైనా తాను రాసే కవిత్వంలో పూర్తిగా pure language వుండడం అన్నివేళలా సాధ్యంకాదు. ఒక భాష అనేక భాషల మిశ్రమంగా మాత్రమే తన ఉనికిని కాపాడుకుంటూ మనగల్గుతుంది. అది తెలంగాణ భాషైనా.. ప్రపంచంలో మరే భాషైనా కావచ్చు. కవికి తన మాతృభాషలోని పదం తట్టకపోతే భావానికి సరిపడే ఇతర భాషాపదాల్ని ఈ ప్రక్రియలో విరివిగా వాడుకునే స్వేచ్ఛ వుంది. దానితోపాటు ఈప్రక్రియ కేవలం తెలుగు కవిత్వానికే పరిమితం కానిది. ఏ భాషాకవులైనా ఈ ప్రక్రియలో యథేచ్ఛగా రాసుకునే వెసులుబాటు ఉంది. బహుళ ప్రాచుర్యం కల్పిస్తే ఎక్కడైనా మనగలిగే ప్రక్రియగా చెప్పొచ్చు. వస్తువు విషయంలో ఏకత్వం; శైలీ, నిర్మాణం విషయంలో అనేకత్వం వుండడం ఇందులోని అసలు అంశం.

*

'ఒంటరీకరణ' లో ప్రధానంగా భావోద్వేగ స్థాయిల్లో చెప్పబడ్డ భరతుని నాట్యశాస్త్రంలోని శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుత రసాలు, ఉపగుప్తుని చేర్పు - శాంతరసం తో కలుపుకుని నవరసాల్లో మానవ భావోద్వేగాల్లోని ప్రతిఫలనాలు కొంతలో కొంత పొడచూపినట్టు గమనించవచ్చు. Know thyself(నిన్ను గూర్చి నీవు తెలుసుకో) కు ఎక్కువ priority ఇవ్వబడింది. మనిషి తనను తాను వెతుక్కోవడంలో భాగంగా రకరకాల ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవడానికి చేసే నిరంతర అన్వేషణ వుంటుంది. ఒంటరితనం, సమూహాంలో ఏకాంతాన్ని కోరుకోవడం(privacy factor), ప్రేమరాహిత్యం మొ.నవి కవిత్వగాఢతను నిర్ణయిస్తాయి. 

"ఏళ్ళతరబడి అన్వేషించినా  రాత్రి అంతం కాలేదు/గుండె నిండుగా కురిసిన శూన్యం సాక్షిగా/మనసు అంతటా విచ్చిన చీకటి మొక్కలకి/అసంతృప్తి ఆకులు మొలిచి/నిరాశపూలు గుత్తులు గుత్తులుగా.."(అంతర్లోకం)

శూన్యం, అసంతృప్తి, నిరాశ మొ.నవి negative vibrations. అయినప్పటికీ అంతర్మథనంతో స్వచ్ఛమైన మనిషి జాడకు తొవ్వచూపే పరికరాలివే. 

*

"సుషుప్తి నుంచి' కవిత్వంలో  ప్రాథమికతనంతో పాటు ప్రౌఢ, యవ్వన ప్రాయాల్లోని భావోద్వేగాలకు, మానసిక అలజడులకు అద్దం పట్టే వస్తువుల్లో ప్రేమ అగ్రభాగాన నిలుస్తుంది. గ్రాఫాలజీ ద్వారా వ్యక్తిత్వ నిర్మాణ వికాస దశలను అంచనా వేయడానికి వీలవుతుందనే తలంపుతో తీసుకురాబడింది. తొలిప్రేమలోని తాజాదనం, ఏదైనా చేయగలననే ఆత్మవిశ్వాసంతొణికిసలాడుతుంది. ప్రేమతో పాటు సమాజంలోని అవకతవకల పట్ల, అంతరాల పట్ల సంఘర్షణ కూడా జమిలీగా పెనవేసుకుని వుంటుంది. 

"ఒక మనిషిగా/సాటి మనిషికి/నేనేమి చేయగలను?/చదవడమా..ఓదార్చడమా?"(జీవితపాఠం)

ఇదంతా కవి నోస్టాల్జియా. ఒకానొక ఫ్యూర్ లైఫ్ కి సాక్షీభూతంగా నిలువగలిగే కవిత్వం. వివిధ రంగాల్లో తన ప్రతిభకు మెరుగులు దిద్దుకుంటూ versatile unique personality గా ఎదిగివచ్చిన కవికి శనార్తులు.

**

ఇప్పటివరకు 52 వారాలుగా "కవిముద్ర" ను ఆదరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అవకాశం కల్పించిన "కవిసంగమం" నిర్వాహకులకు, కవి యాకూబ్ గారికి కృతజ్ఞతలు. సెలవు.

***

కవిముద్ర ద్వారా పరిచయం చేసిన కవుల వివరాలు

*

దర్భశయనం శ్రీనివాసాచార్య, వడ్డెబోయిన శ్రీనివాస్, రవి వీరెల్లి, ఎన్. వేణుగోపాల్, మునాసు వెంకట్, తగుళ్ళ గోపాల్, మౌనశ్రీ మల్లిక్, కొండి మల్లారెడ్డి, సుంకర రమేష్, కేతిరెడ్డి యాకూబ్ రెడ్డి, షాజహానా, మెర్సీ మార్గరేట్, జూపాక సుభద్ర, మోహన్ రుషి, వనపట్ల సుబ్బయ్య, ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్, విజయ్ కుమార్ ఎస్వీకే, పసునూరి రవీందర్, నలిమెల భాస్కర్, బిల్లా మహేందర్, కొలిపాక శోభారాణి, నస్రీన్ ఖాన్, వాణి దేవులపల్లి, అరుణ నారదభట్ల, విప్లవశ్రీ శ్రీనిధి, స్కైబాబా, అవనిశ్రీ, కందుకూరి అంజయ్య, అనిశెట్టి రజిత, పొన్నాల బాలయ్య, బాసిత్, తైదల అంజయ్య, కందుకూరి దుర్గాప్రసాద్, అన్వర్, నందకిషోర్, కోడూరి విజయకుమార్, బూర్ల వెంకటేశ్వర్లు, శ్రీరామోజు హరగోపాల్, తెలిదేవర భానుమూర్తి, నరేష్ కుమార్ సూఫీ, కాసుల ప్రతాపరెడ్డి, ఇబ్రహిం నిర్గుణ్, నారాయణస్వామి వెంకటయోగి, పెన్నా శివరామకృష్ణ, నిధి, నాగేశ్వర్, సి.హెచ్ ఆంజనేయులు, వేముగంటి మురళీకృష్ణ, ఏనుగు నరసింహారెడ్డి, శేషభట్టర్ రఘు, ననుమాస స్వామి, మామిడి హరికృష్ణ

***

Tuesday, 21 July 2020

పండగల్లో కార్పొరేట్ పాఠాలు ! Harikrishna Mamidi

పండగల్లో కార్పొరేట్ పాఠాలు!
-------- harikrishna mamidi 

కార్పొరేట్ కంపెనీలు నేడు తమ వ్యాపార వ్యూహాల కోసం కొత్త దారులను అన్వేషిస్తున్నాయి. ఇప్పటివరకూ మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీల సలహాలను, ట్రేడ్ అనలిస్టుల సూచనలను పాటించిన ఈ కంపెనీలు ఇప్పుడు భారతదేశం మూలాల్లోకి వెళ్లి, ఇక్కడి ‘నేటివ్ స్టైల్స్’తో కార్పొరేట్ ప్రపంచాన్ని పునర్నిర్మించే పని చేస్తున్నాయి.

దానికోసం దేశీయ ఉత్సవాలైన ‘పండగల లోంచి పాఠాల’ను ఒంటబట్టించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మానవ వనరుల నిర్వహణ మొదలుకొని, వినియోగదారు ప్రవర్తన వరకూ అన్ని రకాల కార్పొరేట్ వ్యూహాలకూ పరిష్కారాలను పండగల్లోంచి ‘కనుక్కునే’ దిశగా అడుగులేస్తున్నాయి.
*******************************

కోల్‌కతా...
టోలీగంజ్ ఏరియాలోని రిచ్ కాలనీ...
దాదాపు 50 మందికి పైగా యంగ్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ నెలరోజుల నుంచీ రోజూ షిఫ్టులవారీగా ఆ కాలనీని సందర్శించి, అక్కడ నివాసం ఉంటున్న సెలబ్రిటీల నుండి కామన్‌మ్యాన్ వరకూ అందరినీ కలుస్తున్నారు. వివరాలను సేకరించి ల్యాప్‌టాపుల్లో ఫీడ్ చేస్తున్నారు. రాత్రి సమయాల్లో ఆ కాలనీ ‘లుక్’ని ఫొటోలు తీస్తున్నారు. వేర్వేరు కోణాల్లో రోడ్లని, అపార్ట్‌మెంట్లని షూట్ చేస్తున్నారు. ఈ హంగామా అంతా ఏదో సినిమా కోసమో టీవీ సీరియల్ కోసమో కానే కాదు. దీపావళి పండుగని సెలబ్రేట్ చేయడం కోసం ఓ కార్పొరేట్ కంపెనీ సన్నాహక ప్రాజెక్ట్ అది!

పండుగలు చెప్పే పాఠాలు
కంపెనీల స్థాపనకు ముందు జరిగే మార్కెట్ సర్వే మొదలుకొని, కంపెనీ ఎదుర్కొనే సవాళ్ల పరిష్కారం వరకూ విదేశాల్లోని ‘మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ’లను సంప్రదించడం, దానికోసం కోట్లాది రూపాయలను వెచ్చించడం కార్పొరేట్ బిజినెస్‌లో మామూలే. ఆ మాటకొస్తే, అసలు ‘కార్పొరేట్ నిర్వహణ’ అనే కాన్సెప్టే అమెరికా వంటి దేశాల ఆర్థిక అవసరాల్లోంచి పుట్టింది. అందుకే కార్పొరేట్ కంపెనీల నిర్వహణ అనగానే ఫ్రెడ్ లూథాన్స్, ఫిలిప్ కొట్లర్ రూపొందించిన విధానాలే ప్రామాణికంగా ఉంటూ వచ్చాయి. ఎల్టన్ మేయో ‘మానవ సంబంధాల దృక్పథం’, ఫ్రెడ్‌రిగ్స్ ‘తులనాత్మక దృక్పథం’ వంటివే కార్పొరేట్ కంపెనీల నిర్వహణాశైలులుగా మారాయి. ఛెస్టర్ బెర్నార్డ్ అధ్యయనాలు, డేల్ కార్నెజీ ఇన్‌స్టిట్యూట్ సూచనలు వాటికి బైబిల్‌లా మారాయి.

అయితే, జాతి వారసత్వ సంపదగా వేల యేళ్ల నుంచీ ఉన్న పండుగలు ఇన్నేళ్లు ఎలా కొనసాగగలుగుతున్నాయి? మన కంపెనీలు కనీసం పదేళ్ల పాటు కూడా ఆ స్ఫూర్తిని ఎందుకు కొనసాగించలేకపోతున్నాయి? ఎన్ని ఆర్థిక సంక్షోభాలు, ఒడిదుడుకులు వచ్చినా నిరాటంకంగా కొనసాగుతున్న ఈ పండుగల్లాగా, ఆర్థిక మాంద్యాలకు అతీతంగా స్థిరమైన వృద్ధితో కంపెనీలను ఎందుకు నడపలేకపోతున్నాం? ఈ ప్రశ్నల్లోంచే ఇప్పుడు భారతీయ పండగలపై కార్పొరేట్ అధ్యయనాల ఆలోచన మొలకెత్తింది. పండుగలు చెప్పకనే చెప్తున్న పాఠాలను పెద్ద కంపెనీల సీఈఓలు సైతం బుద్ధిమంతులైన విద్యార్థుల్లాగా చేతులు కట్టుకుని వింటున్నారు.

టీమ్ స్పిరిట్ బోధించే జన్మాష్టమి
మూడు నాలుగేళ్ల క్రితం ముంబైలోని కొన్ని అటానమస్ మేనేజ్‌మెంట్ కాలేజీలు తమ ఎంబీఏ విద్యార్థులకు ‘శ్రీకృష్ణ జన్మాష్టమి’ వేడుకల్లో పాల్గొనడం తప్పనిసరి చేశాయి. జన్మాష్టమి వేడుకల్లో ‘ఉట్టి కొట్టే కార్యక్రమం’ గొప్ప ఉత్సవం. విద్యార్థులు అందులో పాల్గొనాలి. విజయం సాధించాలి. దానికోసం చేసే ప్రయత్నాలను తమ వాస్తవ అనుభవాలతో సహా గ్రంథస్థం చేసి, ‘ప్రాజెక్ట్ థీసిస్’లా సమర్పించాలి. ఈ అంశాలనే వివిధ ఐటీ కంపెనీలకు మార్గదర్శక ప్రతిపాదనలుగా అందిస్తున్నారు.

లక్ష్యం - అల్లంత ఎత్తున్న రెండు ఎదురెదురు అపార్ట్‌మెంట్ల మధ్య 10వ అంతస్థులో వేలాడుతున్న ఉట్టి.
లక్ష్యాన్ని ఛేదించడానికి ఉన్న ఒకే ఒక మార్గం - మానవ పిరమిడ్ నిర్మాణం. దీని నిర్మాణానికి శారీరక దారుఢ్యం అవసరం.
10వ అంతస్థు అంత ఎత్తు చేరడానికి ఎంతమంది మనుషులు అవసరమవుతారో మానవ వనరుల ప్రణాళిక చేసుకోవడం. విద్యార్థులను దీనికోసం ఎంపిక చేసుకోవడం. దీనికోసం విద్యార్థుల్లో ‘టీమ్ స్పిరిట్’ని పెంపొందించడం.

ఎంపిక చేసిన మ్యాన్ పవర్‌కి ప్రత్యేక నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వడం (పిరమిడ్ నిర్మాణం ప్రత్యేక నైపుణ్యమే కదా!)
పిరమిడ్‌ను మూడంచెలుగా నిర్మించడం. దిగువ భాగాన ఆరోగ్యంగా, బలంగా ఉన్నవారిని నిలపడం. వారిపైన చురుకుగా ఉండేవారిని ఎక్కించడం. బరువు తక్కువగా, సన్నగా ఉండే ఒక వ్యక్తి వీరందరిపై నుంచి మెట్లు మెట్లుగా ఎక్కుతూ శిఖరానికి చేరుకుని ఉట్టిని (లక్ష్యాన్ని) ఛేదించడం.

ఈ మొత్తం టాస్క్‌ని పూర్తిచేయడానికి కాలావధి ఉంటుంది. కనుక సరైన టైమ్ మేనేజ్‌మెంట్ టెక్నిక్స్‌ని పాటించడం.
పిరమిడ్ నిర్మిస్తున్న సమయంలో ఎదురయ్యే ఆటంకాలకు (కుండపోతగా నీళ్లు చల్లుతుంటారు) చలించకుండా దీక్షతో నిలిచే మనోభీష్టాన్ని ఏర్పర్చడం.

ఈ కోణంలో జన్మాష్టమి వేడుకలని విశ్లేషిస్తే, కార్పొరేట్ కంపెనీలు పాటించే విజయసూత్రాలే ఇందులో ఇమిడి ఉన్నట్లుగా కనిపించక మానవు.

పని విభజనను తెలిపే వినాయక చవితి

తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ సామూహిక సాంస్కృతిక ఉత్సవాలను కార్పొరేట్ కంపెనీలు కొత్తగా అర్థం చేసుకుంటున్నాయి.
కొత్త కంపెనీని స్థాపించాలంటే ముందుగా లొకేషన్ని ఎంపిక చేసుకోవాలి. ఈ ఉత్సవాల నిర్వహణకు ఓ కాలనీనో, గ్రామాన్నో ఎంపిక చేసుకోవాలి.

మొత్తం ఉత్సవాల నిర్వహణకు కావలసిన ఆర్థిక వనరులను సమీకరించడం - కాలనీవాసుల నుండి చందాలు, ఏదైనా కంపెనీ స్పాన్సర్‌షిప్ ద్వారా సమకూర్చుకోవడం (కార్పొరేట్ కంపెనీలు బ్యాంకులను అప్రోచ్ అయ్యే ధోరణి).

వేదిక నిర్మాణానికి కావలసిన కలప, అలంకరణ సామగ్రి, విగ్రహాన్ని సమకూర్చుకోవాలి. (ఆఫీసు భవనం, విద్యుత్, రవాణా, కంప్యూటర్లు వంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు సమానం).

ఉత్సవాలు 9 రోజుల పాటు జరుగుతాయి. రెండు రోజుల ముందు జరిగే సన్నాహక చర్యలని, నిమజ్జన అనంతర కార్యక్రమాలని ప్రణాళిక వేసుకోవాలి.

విగ్రహ ప్రతిష్ఠాపనలో కావలసిన వనరులను సమకూర్చుకోవాలి. నిమజ్జనం రోజు జరిగే వేడుకలకి కావలసిన వస్తువులు, ఆహారం, పండ్లు, వాహనం వంటివి ప్రిపేర్ చేసుకోవాలి. ఇదంతా టైమ్ ఫ్రేమ్‌లో నిర్వహించాలి.

9 రోజులకి గాను రోజూ ఒక విశిష్టమైన ప్రోగ్రామ్‌ని డిజైన్ చేయాలి. దీనికోసం ప్రత్యేక నైపుణ్యాలు గల కళాకారులను రప్పించాలి. (కలవడం, కన్విన్స్ చేయడం వంటి కార్పొరేట్ సంప్రదింపు నైపుణ్యాలు ఒంటబడతాయి).

ఒకే నాయకత్వం కింద పనిచేయడం (లీడర్‌షిప్), తమ మధ్య పనులను విభజించుకుని (డివిజన్ ఆఫ్ వర్క్), తమకప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం. ఎప్పుడూ టీమ్‌లో ఉత్తేజాన్ని కలిగించడం, ప్రోత్సహించడం. టీమ్ మెంబర్స్‌కుండే ప్రత్యేక సామర్థ్యాలను బట్టి వారికి బాధ్యతలను అప్పగించడం (సామాజిక సామర్థ్యాలు ఉన్న వారిని వేదిక దగ్గర నియమించడం వంటివి), వారందరినీ సమన్వయం చేయడం (ఇవన్నీ కో-ఆర్డినేషన్ సూత్రానికి ప్రాక్టికల్సే!)

లక్ష్యాన్ని ఛేదించడం నేర్పే రావణ వధ
బెంగళూరులోని కొన్ని ఐటీ కంపెనీలు ఇటీవలి దసరా వేడుకల్లో తమ సిబ్బందిని పాల్గొనమని చెప్పడమే కాక, వారి పరిశీలనలు, అనుభవాలను రిపోర్ట్ రూపంలో అందించాల్సిందిగా ఆదేశించాయి. రావణ వధ వేడుకలను తమ సవాళ్లను ఎదుర్కోవడానికి కావలసిన వ్యూహాల కోసం ఉపయోగపడే ప్రయోగాలుగా భావించడమే దీనికి కారణం.

రావణ వధ వేడుకకు మొదట కావలసింది ఖాళీ మైదానం. గ్రామానికి చేరువలో ఉండే ఖాళీ ప్రదేశాన్ని గుర్తించడం. (కార్పొరేట్ కంపెనీలు కూడా తమ కంపెనీలు ‘సెజ్’లో, ఐటీ హబ్‌లలో, పారిశ్రామిక ఎస్టేట్లలో ఏర్పాటు చేయాలని భావించడం లాంటిదే).

ఈ వేడుకని నిర్వహించడానికి గ్రామపంచాయితీ ఆఫీసు నుండి, పోలీసు యంత్రాంగం నుండి అనుమతులు తీసుకోవడం (కంపెనీ స్థాపనలో లెసైన్సులు పొందడం, ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకోవడం, కావలసిన ‘స్పేస్’ని సాధించడం).

మానవ, ఆర్థిక వనరులను మొబిలైజ్ చేయడం (కంపెనీ స్థాపనకు కావలసిన పెట్టుబడులు, హ్యూమన్ క్యాపిటల్ సముపార్జన).

బాణంతో రావణ బొమ్మను కాల్చడం (ప్రాబ్లమ్ షూటింగ్ సామర్థ్యం ఉన్న వ్యక్తిని టీమ్ లీడర్‌గా పెట్టి టార్గెట్‌ని సాధించే కార్పొరేట్ ప్రక్రియ).

టార్గెట్ కస్టమర్‌‌స అంచనా వేయించే దీపావళి

కోల్‌కతాలోని కొన్ని స్వదేశీ కార్పొరేట్ కంపెనీలు దీపావళి నిర్వహణ ద్వారా కొత్త మేనేజ్‌మెంట్ సూత్రాలను ఉద్యోగులు నేర్చుకునేలా చేస్తున్నాయి. టోలీగంజ్ ఏరియాలో చేస్తున్న ప్రయోగం అందులో భాగమే.

టోలీగంజ్‌లోని ఓ కాలనీలో ఉన్న ఇళ్లు ఎన్ని, జనాభా ఎంత, పిల్లలు, మహిళలు ఎంతమంది అనే సర్వే చేశారు. (కార్పొరేట్ ప్రాథమిక సూత్రం ‘టార్గెట్ క్లయింట్స్’ అనే భావన ఇక్కడ ఆచరణలో తెలుస్తుంది).

కాలనీ విస్తీర్ణం ఎంత, రోడ్లు ఎంతమేరకు ఉన్నాయి అనే సర్వే చేయడం (తమ ప్రొడక్ట్‌కి మార్కెట్ ఏ మేరకు ఉంది, ఎంత ఉత్పత్తి అవసరం అనే అంచనాలకి రావడం లాంటిది).

దాన్ని బట్టి ఎన్ని దీపాలు, ఏ రకం దీపాలు, దేనితో తయారుచేసిన దీపాలు అవసరమవుతాయో ఒక అంచనాకు రావడం (క్లయింట్ల అవసరాన్ని బట్టి తగిన సాఫ్ట్‌వేర్ డిజైన్ చేయడం)

ఫైర్‌వర్క్స్ కౌంటర్ దగ్గర ఎంతమంది ఉండాలో నిర్ణయించడం, ప్రమాదాలేవీ రాకుండా ఫైర్ ఇంజన్‌ని, సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవడం (సాఫ్ట్‌వేర్‌కు వైరస్ రాకుండా, ఫైల్స్ కరప్ట్ కాకుండా జాగ్రత్తలు చేపట్టడం. ఒకవేళ ఏమైనా జరిగితే హెల్ప్‌లైన్, 24/7 ‘ఆన్‌బోర్డ్’గా ఉండే నిపుణులను ఏర్పాటు చేయడం లాంటివి)

కొచ్చిన్‌లోని కొన్ని కంపెనీలు ఓనమ్ పండుగ సందర్భంగా జరిగే బోట్ రేసులను ఈ కోణంలోంచి అర్థం చేసుకోవడం కోసం ప్రత్యేక ప్రాజెక్టులను చేపడుతున్నాయి. అలాగే చండీగర్‌లోని సిఖ్‌వాడీలో సిక్కుల పవిత్ర పండుగైన ‘వైశాఖి’ జరిగే తీరును కూడా అధ్యయనం చేస్తున్నారు.

మానవ సంబంధాలకే పట్టం
వేలాది సంవత్సరాలుగా పండుగలు సెలెబ్రేట్ చేసుకోవడంలో ఉన్న మూలసూత్రం, ఈ అధ్యయనాల వల్ల కార్పొరేట్ కంపెనీలకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. భారతీయ పండుగల్లో ఉన్న ప్రధాన లక్షణం సామూహిక ఉత్సవం. ఒకరికోసం అందరు, అందరి కోసం ఒక్కరు అనే సాముదాయిక జీవన సౌందర్యమని గుర్తిస్తున్నారు. ఈ వేడుకల్లో మనుషులందరినీ ఒక్కటిగా చేస్తున్న మూలకారకం-మానవ సంబంధాలు అని కూడా గుర్తిస్తున్నారు.

మనుషులను నిపుణులుగా, హ్యూమన్ క్యాపిటల్‌గా, వనరులుగా, కొండొకచో ఓ యంత్రంగా మాత్రమే పరిగణిస్తున్న కార్పొరేట్ ప్రపంచం- మనిషిలోని సున్నితమైన భావోద్వేగాలకి పట్టం కడుతున్న పండుగల నుంచి కొత్త పాఠాలను నేర్చుకుంటోంది. తమ కంపెనీలను కొత్తగా నిర్మించుకునే దిశగా అడుగులు వేస్తోంది.
.....................**********************

ప్రాచీన సాహిత్య మూలాల్లోకి...
సాధారణంగా కార్పొరేట్ కంపెనీల ఆలోచనలన్నీ ‘విజన్ 2020’, ‘విజన్ 2050’ వంటి భవిష్యత్ కాల ‘స్పెక్యులేషన్’ల మీదనే ఆధారపడి ఉంటాయి. ఆ మాటకొస్తే, కార్పొరేట్ విధానంలోనే భవిష్యత్ కాల వీక్షణం ఉంది. కానీ ఇప్పుడా ధోరణి మారింది. ‘రివర్స్ గేర్’ మొదలైంది. ప్రాచీన కావ్యాలు- సాహిత్యంలోని నిగూఢ అంశాలను ఇప్పటి అవసరాలకి అనుగుణంగా అనుప్రయుక్తం చేసుకోవడం ప్రారంభమైంది.

ఈ ధోరణిలో బడా కార్పొరేట్ కంపెనీలు తమ సమస్యల పరిష్కారానికి, గ్రీక్ ఇతిహాసాలైన ‘ఇలియడ్’, ‘ఒడిస్సీ’ల మీద ఆధారపడుతున్నాయి. చైనీయుల ప్రాచీన ‘ఆర్ట్ ఆఫ్ వార్’ పుస్తకాల మీద, ‘షాయోలిన్’, ‘నింజా’ సంస్థల నిర్వహణాశైలి మీద అధ్యయనాలు చేస్తున్నాయి. అలాగే భారతీయ ప్రాచీన సాహిత్య రూపాలైన రామాయణ, మహాభారతాలతో సహా మరెన్నో గ్రంథాలను సరికొత్త కోణంలో చదువుతున్నాయి.

యుద్ధక్షేత్రంలో అస్త్రసన్యాసం చేస్తానన్నప్పుడు, అర్జునుణ్ని కర్తవ్యోన్ముఖుణ్ని చేయడానికి శ్రీకృష్ణుడు ఉపదేశించిన ‘కౌన్సెలింగ్ సెషన్’గా భగవద్గీతను కొత్తగా చూస్తున్నారు. భక్తి, జ్ఞాన, కర్మ యోగాలుగా ఉన్న భగవద్గీతలోని కర్మ సూత్రాన్ని ‘ప్రిన్సిపుల్ ఆఫ్ యాక్షన్’గా, స్థిత ప్రజ్ఞతను ‘ఎమోషనల్ కోషియెంట్’గా సూత్రీకరిస్తున్నారు.

ఒక దేశం, ప్రాంతం, రాజ్యం బలంగా ఉండటానికి కావలసిన ప్రధానాంశాలను ‘సప్తాంగ సిద్ధాంతం’గా అర్థశాస్త్రంలో కౌటిల్యుడు చర్చించాడు. కౌటిల్యుడు వివరించిన రాజు లక్షణాలను ఆధునిక ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకు ఏవిధంగా వర్తింపజేయవచ్చో విశ్లేషిస్తున్నారు.

మహాభారతంలోని ‘శాంతిపర్వం’లో అంపశయ్యపై భీష్ముడు రాజ్యపాలనకు సంబంధించి ధర్మరాజుకి చెప్పిన సూచనలు కార్పొరేట్ కంపెనీలకు నయాసూత్రాలుగా మారాయి. అలాగే షడ్దర్శనాల్లోని స్రాంఖ్యం (కపిలుడు), యోగం (పతంజలి), న్యాయం (గౌతముడు), వైశేషికం (కణాదుడు), ఉత్తర మీమాంస, పూర్వ మీమాంస ప్రాచీన నియమాల్లోంచి ఆధునిక విలువలను పునర్నిర్మిస్తున్నారు.

స్వదేశీ-విదేశీ కార్పొరేట్ పండిట్లను ఆకర్షిస్తున్న మరో ముఖ్యమైన గ్రంథం విష్ణుశర్మ ‘పంచతంత్రం’! ఎన్నెన్నో జీవన నియమాలను, నీతి సూత్రాలను వివిధ జంతు-పక్షుల పాత్రల ద్వారా వెల్లడించిన ఈ పుసకంలోని కథలను... ఒక కంపెనీకి మరో కంపెనీకి మధ్య జరిగే పోటీని, ఎదుటి కంపెనీని దెబ్బతీయడానికి చేసే ఎత్తుగడలని, ఉన్న కంపెనీలను మరో కంపెనీలో కలిపేయడం (మెర్జర్), ఒక కంపెనీని మరో కంపెనీకి అమ్మేయడం వంటి వ్యూహాలను విశ్లేషించడానికి ఉదాహరిస్తున్నారు.
.....................****************

‘కార్పొరేట్’కు ఆధ్యాత్మిక జోడింపు
మానవీయ కోణాన్ని, ఆధ్యాత్మిక స్ఫూర్తిని జోడించి కార్పొరేట్ ప్రపంచంలో నవ్య విప్లవానికి తెరతీస్తున్నారు కార్పొరేట్ గురువులు. వ్యక్తిగత పోటీ, ఆధ్యాత్మిక ఆనందం, వృత్తి సంతృప్తి వంటి అంశాలను చర్చిస్తూ కార్పొరేట్ ఉద్యోగుల్లోని స్ట్రెస్, డిప్రెషన్‌లకు నివృత్తి మార్గాలను సూచిస్తున్నారు ‘ద మాంక్ హూ సోల్డ్ హిజ్ ఫెరారీ’ ఫేమ్ రాబిన్‌శర్మ.

’Simple Living- High thinking'భావన ప్రాతిపదికగా ఉద్యోగుల మధ్య అద్భుతమైన మానవీయ స్పర్శ ద్వారానే కంపెనీలు లక్ష్యాలను సాధిస్తాయంటారు అరిందమ్ చౌదరి. భగవద్గీతను మేనేజ్‌మెంట్‌కు అన్వయించి ‘కౌంట్ ద చికెన్ బిఫోర్ దే హ్యాచ్’ రాశారాయన.

ఇక రవిశంకర్ తన ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ విధానంలోని ధ్యాన ప్రక్రియ (సుదర్శన క్రియ) ద్వారా ఉద్యోగుల్లో నిశ్చల మనస్తత్వాన్ని, సవాళ్లను ఎదుర్కోగలిగే సామర్థ్యాన్ని తీసుకురావచ్చంటారు. ‘కార్పొరేట్ కంపెనీలన్నీ మానవ వనరులతోనే నడుస్తాయి. మానవులేమో నిరంతర చైతన్యశీలులు. ప్రయోగశాలల్లోని రసాయనల్లాగా స్థిరంగా ఉండరు. అలాంటివారి మధ్య సుస్థిరతకి ప్రాచీన భారతీయులు చెప్పిన ధ్యానమే మార్గ’మని ఆయన చెపుతారు. దీపక్ చోప్రా, శివ్‌ఖేరా కూడా ప్రస్తుత సంక్లిష్ట జీవనంలో ఆధ్యాత్మికత సాయంతో సంపూర్ణ మూర్తిమత్వ వికాసం ఎలా సాధించాలో వివరిస్తారు.

అలాగే యండమూరి వీరేంద్రనాథ్ ‘విజయానికి ఆరోమెట్టు’... భగవద్గీతని ఆధునిక కార్పొరేట్ ప్రపంచానికి అన్వయిస్తూ చేసిన రచనే! ప్రయాగ రామకృష్ణ మహాభారతంలోనూ, భీష్ముని సందేశంలోనూ ఇమిడి ఉన్న కార్పొరేట్ సూత్రాలతో భీష్మ ఎట్ మేనేజ్‌మెంట్ అండ్ గవర్నెన్‌‌స రాశారు.

-*************************
‘సినిమా స్టడీస్’ కూడా...
కార్పొరేట్ కంపెనీలు తమకు కావలసిన వ్యూహాల కోసం ఏ అవకాశాన్నీ వదిలి పెట్టడం లేదు. దాన్లో భాగంగానే సినిమా లను కూడా కేస్ స్టడీ చేస్తున్నాయి. స్టాన్‌ఫోర్డ్ వంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు సైతం సినిమా అధ్యయనాలను స్పెషల్ ప్రాజెక్టు లుగా తమ సిలబస్‌లో చేర్చాయి.

అలాంటి అరుదైన గౌరవం దక్కించుకున్న మొదటి భారతీయ సినిమా ‘లగాన్’ (2001). భువన్ అనే సాధారణ యువకుడు అసా దారణ లక్ష్యాన్ని సవాలుగా స్వీకరించి, విజయం కోసం కావలసిన మానవ వనరు లను తన పరిధిలోనే గుర్తించి, శిక్షణ ఇస్తాడు. ఒక్క తాటిపై నడిచే మహత్తరమైన టీమ్‌ని బిల్డ్ చేయడం ఓ మోడ్రన్ కార్పొ రేట్ కంపెనీ నిర్మాణానికి ‘ప్రొటోటైప్’లా ఉంటుంది. ‘చక్ దే ఇండియా’, ‘గోల్’, ‘ఇక్బాల్’ సినిమాలు కూడా కొన్ని మేనేజ్ మెంట్ విద్యాసంస్థల సిలబస్సులయ్యాయి.
---_---- harikrishna mamidi
(Published as Sunday cover story in SAKSHI FUNDAY supplement in 2011)

Posted 1st December 2011

Monday, 20 July 2020

లేఖ... ప్రేమ లేఖ !

లేఖ... ప్రేమ లేఖ !

                                                                                                                                                                                                                                                                      --- మామిడిహరికృష్ణ, 8008005231

 

                ఈ ప్రపంచంలో సంభవించిన సాహితీ, సాంస్కృతిక, శాస్త్రసాంకేతిక, సామాజిక, ఆర్థిక ఆవిష్కరణలన్నీ ఆయా సమాజాల అవసరాల నుంచి ఉద్భవించినవే. అందుకే Necessity is the mother  of all inventions అని అంటారు. వేర్వేరు కారణాల వల్ల దూరంగా ఉంటున్న వ్యక్తుల మధ్య సమాచారం - క్షేమం - వర్తమానవిశేషాలు - వికాసం సంబంధించిన వివరాలను చేరవేసుకోవాలి, తద్వారా దూరాలకు అతీతంగా మానవ సంబంధాలను పటిష్టంగా కాపాడుకోవాలనే ఆలోచనలోంచి పుట్టిన సాహితీ  సృజనాత్మక ఆవిష్కరణ - లేఖ!

 

                ఒకానొక కాలంలో లేఖలు, లేఖాసాహిత్యం, మానవ జీవితంలో ఎంతో ప్రాముఖ్యతను సాధించాయి... కానీ కాలక్రమంలో డిజిటల్ టెక్నాలజీ ఇంటర్‌నెట్‌ల ఆగమనంతో, గతకాలపు ఇతర సంప్రదాయాలు, రీతులలాగే లేఖ/ఉత్తరం కూడా ఇపుడు ‘‘అంతరించిపోయే అలవాటు’’ (Endangered Habit) గా పరిణమించింది. ఈలాంటి సందర్భంలోనే ఇటీవల సాహిత్యరంగంలో సంభవించిన రెండుప్రయత్నాలు -- ఉత్తరాలు అందులోనూ ప్రేమలేఖల ప్రేమికుల గుండెల్లో మళ్ళీ వసంతపు చిగుళ్ళను వేయించాయి. వాటిలో ఒకటి - హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంలో సంవత్సరంపాటు ప్రసారమై ఇటీవల పుస్తకంగా విడుదలైన శ్రీమతి అయినంపూడి శ్రీలక్ష్మి గారి ‘‘కొత్త ప్రేమ లేఖలు’’ కాగా, రెండోది  యువ రచయిత్రి కడలి సత్యనారాయణ ప్రచురించిన ‘‘లెటర్స్ టు లవ్’’ పుస్తకం ! 

అదే విధంగా కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రజలంతా స్వీయ నిర్బంధం లో ఇళ్లలోనే ఉన్న సందర్భంలో జరిపిన ఒక ఆన్ లైన్ సర్వేలో, అత్యధిక ప్రజలు తమ పాత వస్తువులలో ఎక్కువగా ఇష్ట పడే అంశంగా లేఖలకు పట్టం కట్టారు! ఈ నేపధ్యంలో ఉత్తరాల పరిణామాన్ని, లేఖా సాహిత్యపు తీరు తెన్నులను విశ్లేషించడమే ఈవారం ‘కవర్  స్టోరీ ’!

***************************************************************************************





          “How wonderful it is to be able to write Someone a letter! To feel like conveying your thoughts to a person, to sit at your desk and pick up a pen, to put your thoughts onto words like this is truly marvelous.”

                ప్రఖ్యాత జపనీస్ రచయిత Haruki Murakami 1987లో రాసిన Norwegian Wood నవలలో ఒకచోట లేఖల గురించి చెప్పిన వాక్యాలివి. ప్రతిష్టాత్మక World Fantasy Award ను, Franz Kafka Prize ను గెల్చుకున్న ఈ రచయిత లేఖారచనలో ఇమిడి ఉండే హృదయ గత అనుభూతులను సరళంగానే అయినా చక్కగా వ్యక్తీకరించాడనడంలో సందేహం లేదు...

                అందుకే ఉత్తరం అంటే హృదయనివేదన...! ఆత్మావిష్కారం!! అభిప్రాయాల కలబోత!! విషాదానందాల వలపోత!

             మన నిత్య జీవితంలో ఉండే ఉద్వేగక్షణాలను, ఉత్తేజ సందర్భాలను, ఉల్లాస సన్నివేశాలను, ఉత్కృష్ట సమయాలను అక్షరాలలో పొదిగి, తెల్లకాగితంపై అందంగా లిఖించే మనఃపూర్వక కళ- లేఖారచన!

                అందుకే ఉత్తరం, అది పుట్టినప్పటి నుంచీ మనుషుల మధ్య అక్షరవారధిని కట్టింది! ఆలోచనాస్ఫోరకమై నిలిచింది! ఆత్మీయ భాషణమై భాసించింది! ఆచరణాత్మక దృక్పథమై మార్గదర్శనం చేయించింది.

                ఇంతగా మనుషుల జీవితాలతో పెనవేసుకు పోయిన ఉత్తరం గత రెండు దశాబ్దాలకాలం నుంచీ క్రమంగా అదృశ్యమవుతూ వస్తూంది. మానవజాతి నిర్మించుకున్న ఎన్నో విశిష్టమైన సంప్రదాయాలలో లేఖా రచన కూడా ఒకటిగా కొనసాగి, ఇప్పుడు అంతరించి పోతున్న ఇతర సంప్రదాయాల కోవలోకి చేరింది...

                ఒకప్పుడు అక్షింతలను, కన్నీళ్ళను, నమ్మకాన్నీ, ధైర్యాన్నీ, ఆశలనూ, మొత్తంగా జీవితాన్నీ, జీవనేచ్ఛనూ మోసుకొచ్చిన ఉత్తరం ఇప్పుడు మానవ మస్తిష్కపు స్టోర్‌రూమ్‌లో ‘పాత వస్తువు’గా మారిపోయింది...

                అందుకే ఉత్తరం 1990 తరపు మనుషుల వరకూ ఓ నోస్టాల్జీయా... ఒకజ్ఞాపకం... ఒక దిగులు... ఒక బెంగ... ఒక పోగొట్టుకున్న జీవనపార్శ్వం... ఒకకోల్పోయిన ప్రపంచ శకలం... అన్నింటినీ మించి ఒక శిథిల స్వప్నం!

                ఇలా మనసులోనే లుంగలు చుట్టుకుని కునారిల్లుతూ, నవజీవన శైలుల మెరుపులను కళ్ళకు ఎంతగా అతికించుకున్నా, గుండెలోతుల్లో ఏ మూలో నిరుడు కురిసిన లేఖా హిమసమూహాలను తల్చుకుంటూ, మనోభారంతో ‘పెన్ను’నీడుస్తున్న క్షణాన...

                నిత్య జీవన పోరాటంలో పరుగెత్తుతూ వర్తమానం వెంట భవిష్యత్తు వెలుగుల కోసం వెంపర్లాటలు పెరిగిన క్షణాన...

          ప్రపంచమంతా ఒక్క కుదుపు...

          వాయువేగ, మనోవేగాలతో భ్రమిస్తూ, పరిభ్రమిస్తూ ప్రపంచం అంతా ఒక్కసారిగా ఆగిపోయి స్థాణువై స్తంభించి పోయేలా చేసిన మహా కుదుపు...       

          మానవాళిపై కరోనా మహమ్మారి దాడి! దేశాలు, ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ప్రజలంతా స్వీయ నిర్భధంలో, ఇళ్ళలో ఉండాల్సి వచ్చింది... ఈ ‘లాక్ డౌన్’ ప్రపంచ గమ్యాన్నిచెరిపింది. విశ్వ గమనాన్ని కుదిపింది. ఆర్ధిక వ్యవస్థలను, అభివృద్దిని నిశ్చేష్టపరిచింది. అలాగే ఎక్కడా క్షణ కాలమైనా ఆగకుండా, అలుపు లేకుండా దూసుకుపోతున్న మనిషి ఒక్కసారి ఆగిపోయి, తన గతంలోకి, నడిచొచ్చిన బాటవైపు, తనలోకి తొంగి చూసుకునే అవకాశాన్ని కూడా కలిగించింది. 

          ఈ సంధర్భంలో ప్రజలంతా, ఇంతకాలం తమస్టోర్ రూమ్ లలో ఉంచిన, దుమ్ము కొట్టుకుపోయిన  ఎన్నెన్నో వస్తువులను వెలికి తీసారు... జ్ఞాపకాలను తవ్వుకున్నారు... ఆ తవ్వకాలలో భయల్పడ్డ ఎన్నెన్నో విస్మృత అనర్ఘ రత్నాలలో ఒక అద్భుతం - ఉత్తరం !

          లాక్ డౌన్ సంబంధిత అంశాలపై ఇటీవల జరిపిన ఓ ఆన్ లైన్ సర్వేలో, "మీ పాత వస్తువులలో ఇప్పటికీ మీకు ఏది గొప్పగా అనిపించింది?" అన్న ప్రశ్నకు దాదాపు 80% మంది పాతకాలంలో తాము రాసిన, అందుకున్న ఉత్తరాలే అని చెప్పారు...

                ఇలా, కాలం చెల్లింది అనుకుంటున్న లేఖలు మళ్ళీ మన హృదయ సౌధంలో కేంద్ర స్థానాన్ని అలంకరించాయి.  అలాగే ఉత్తరం ఇంతకాలం కేవలం ఓ ‘Nostalgia’ అనుకున్నారు. కానీ ఇది ఓ panacea (మరిచిపోయిన ఎన్నెన్నో జ్ఞాపకాలను తిరిగి బతికించిన అమృతం) అని ఈ సర్వేలో వెల్లడయింది.

          ఇలా లేఖలు తక్షణ ప్రయోజనాన్ని ఆశించే ‘ఉభయకుశలోపరి’తో మొదలై “ఇట్లు మీ శ్రేయోభిలాషి” గా ముగించినప్పటికీ, కొన్ని లేఖలు మాత్రం సాహిత్య రంగంలో కావ్య ప్రతిపత్తిని, శాశ్వతత్వాన్ని కూడా సాదించాయి. అలాంటి లేఖలు ‘లేఖ సాహిత్యం’గా ఉదాత్తత్వాన్ని, ఉన్నతత్వాన్ని సాధించడం విశేషం.



లేఖాసాహిత్యం : (Epistolary)

                సాహిత్యంలోఎన్నెన్నోప్రక్రియ (Genre) లువాడుకలోఉన్నాయి. దీనికి ఆయా సాహిత్య ప్రక్రియలలోని వస్తువు (Theme), శైలి (style),  శిల్పమే(technique), ప్రధానకారణాలు. ఆలెక్కన విశ్లేషిస్తే ఉత్తరాలు, లేఖల ద్వారా విషయాన్ని చెప్పే విధానాన్ని ‘లేఖా సాహితీ ప్రక్రియ’గా చెప్పవచ్చు.

                ఈ లేఖాసాహిత్యానికి సమానార్థకంగా ఇంగ్లీష్‌లో ‘Epistolary’ అని పిలుస్తారు. ఇది గ్రీక్ పదం ‘Epistle అంటే ‘అక్షరం’ లేదా ‘ఉత్తరం’ నుండి ఏర్పడింది. అంటే Epistolary is a literary genre pertaining to letters అన్నమాట!



ఉత్తరం రాయడం ఓ కళ !

                మన నిత్య వ్యవహారంలో  ‘ఉత్తరం రాయడమూ ఒక కళే’ అని అందరూ అంటుండగా వింటుంటాం. కానీ ఉత్తరం రాయడాన్ని ఓకళాత్మక విషయంగా అధ్యయనం చేసే శాస్త్రం ఒకటుందనే విషయం మాత్రం అంతగా తెలీదు. ఈ ఉత్తరం రాసే కళనే గ్రీకులు ప్రాచీన కాలంలోనే  ‘Epistolography ‘ అని పిలిచారు. Epistole అంటే అక్షరం, ఉత్తరం అనీ, graphia అంటే రాయడం, లిఖించడం అనీ అర్థం. ఈ రెండు పదాల కలయిక నుంచే ఈ లేఖా రచనా శాస్త్రం (Epistolography) ఉద్భవించింది.

                కాగా ఈ శాస్త్రం యూరప్‌లో బైజాంటైన్‌ సామ్రాజ్యయుగంలో స్వర్ణయుగాన్ని చవి చూసిందని చెప్పాలి. ప్రాచీన కాలంలో తూర్పు రోమన్ సామ్రాజ్యానికే బైజాంటియమ్‌ అని పేరు. ఇది యూరప్‌లో క్రీ.శ. 395 నుండి 1453 వరకు రాజ్యమేలింది. ఈ సామ్రాజ్య రాజధాని అయిన బైజాంటియమ్ నగరం 1453లో ఆటోమాన్ టర్కుల ఆక్రమణ అనంతరం ‘కాన్‌స్టాంటి నోపిల్‌’ గా, ఆ తర్వాత ఆధునిక కాలంలో ‘ఇస్తాంబుల్’గా పేరుపొందింది.

                ప్రాచీన బైజాంటియన్ చక్రవర్తులు తమ శాసనాలకు, చట్టాలకు సంబంధించిన ప్రతీ అంశాన్నీ ప్రజలకు, ఇతర రాజులకు ఉత్తరాల ద్వారా తెలియజేసేవారు. దీని కోసం వారు ఉత్తరాన్ని, లేఖలను రసరమ్యంగా, మనోరంజకంగా రాయడం కోసం ప్రత్యేక నిపుణులను నియమించుకోవడమే కాక, రాజశిక్షణలో యుద్ధ విద్యలతో పాటు ఒక అంశంగా ఈ లేఖా రచనా కళను అభ్యసించారని చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తోంది. అంటే రాజ్యాల మధ్య యుద్ధంలేదా శాంతి ఏర్పడాలన్నా, ప్రజలలో రాజు పట్ల భక్తి భావం, విధేయత పెరగాలన్నా లేఖ రాసే విధానం వల్లనే సాద్యమవుతుందనే మౌలిక విషయాన్నిఈ రోమన్ చక్రవర్తులు తెలుసుకున్నారని దీన్ని బట్టి చెప్పవచ్చు. అలా లేఖకు ఉండే శక్తిని ఈ ఉదంతాలు తేటతెల్లం చేస్తాయి.



తోకలేని పిట్ట నుండి ట్విట్టర్ దాకా...  :

              నిజానికి ‘లేఖ’ ప్రధానలక్ష్యం - ‘‘సమాచారాన్ని, సందేశాన్ని ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి చేరవేయడం!’’ నిర్దేశిత వ్యక్తులు ప్రత్యక్షంగా కలుసుకోలేకున్నా, దూరంగా ఉన్నా వారిమధ్య సమాచార మార్పిడికి, తద్వారా తదనంతర కార్యాచరణకు దోహదం చేసే మానవ అవసరంలోంచి ఉత్పన్నమైన లిఖిత విశేషమే- లేఖ!

                అయితే ‘లేఖలు’ వేలాది సంవత్సరాల నుంచీ ఎన్నో దశలను దాటి, ఎన్నెన్నో పరిణామాలను చవి చూసాయి. మొదట్లో లేఖ సారాంశం మౌఖికంగా వార్తాహరులు, రాయబారులు, అనుచరులు ద్వారా చేరవేయడం జరిగేది. ఆ తర్వాత శిలలపై చెక్కిన అక్షరాల ద్వారా, ఆ తర్వాత తాళ పత్రాల ద్వారా, వస్త్ర పత్రాల ద్వారా లేఖలు సమాచారాన్ని చేరవేసేవి. ఈ కాలంలో లేఖలను ఒకచోటు నుంచి మరోచోటుకి చేర్చే మాధ్యమాలలో మనుషులు, పక్షులు, జంతువులు వాహకాలుగా ఉపయోగించబడేవారు.

                మన దేశంలో 1853లో రైల్వే రవాణా ప్రారంభం కావడం, 1854లో తపాలా విధానం అమలులోకి రావడంతో లేఖా సంప్రదాయం రాజులు, కులీనులకు మాత్రమే కాక, చదువుకున్నఇతర సమాజాలకి కూడా అందుబాటులోకి వచ్చాయి. మరో వైపున ‘లేఖల చేరవేత’ విధానం వ్యవస్థీకృతం అయి ఉత్తరాలు, లేఖల బట్వాడా సులభతరం అయింది.

                ఆతర్వాత సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ, లేఖలు మరెన్నో పరిణామాలకు లోనయ్యాయి. అలా టెలిగ్రామ్, ఫాక్స్ (ఫాసిమిలీ) విధానాలు అందుబాటులోకి వచ్చాయి. కాగా 2000 సంవత్సరం తర్వాతదేశంలోమొదలైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంటర్‌నెట్ వంటి  వాటివల్ల పేజర్, ఈ మెయిల్,‌ షార్ట్‌ మెసేజస్ సర్వీస్‌ (SMS) వంటివి ఇప్పుడు జనబాహుళ్యం లోకి వచ్చి ‘‘సంప్రదాయలేఖ’’ అనే అర్ధాన్ని, వ్యవస్థను మార్చివేసాయి. ఇక సోషల్  మీడియా (ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్) విజృంభణతో లేఖలు, లేఖా సాహిత్యంఅనేవి గతకాలపు చిహ్నాలుగా, అంతరించిపోయే సంప్రదాయంగా మారిపోయాయి.

                అయితే, కొంచెం సానుకూలంగా ఆలోచిస్తే ‘లేఖ’ లోని ‘ఆత్మ’ (సమాచారాల చేరవేత) కనుమరుగు కాలేదనీ, లేఖ రూపం మాత్రమే (పేపర్ నుండి పేపర్‌లెస్ ఈ-మెసేజ్‌లకు) మారిందనీ అర్థమవుతుంది. ఆలెక్కన ప్రస్తుతం న్యూజనరేషన్  సాంకేతిక రూపాలైన మెయిల్, మెసేజ్‌ వంటివన్నీ ‘లేఖ’కు కొనసాగింపులుగానే భావించాల్సి ఉంటుంది.

 

ప్రపంచలేఖాసాహిత్యం - ప్రముఖరచనలు :

                లేఖాసాహిత్యం (Epistolary) ప్రక్రియలో ప్రపంచభాషలలో వచ్చిన తొలి నవలగా 1485లో Diego de San Pedro స్పానిష్‌ భాషలో రాసిన ‘Prison of Love’ ని చెప్పుకోవచ్చు. కాగా ఇంగ్లీష్  సాహిత్యంలో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన సాహితీవేత్తగా Howell (1594-1666)ను సాహితీ చరిత్రకారులు చెపుతారు. ఈయన రాసిన ‘Familiar Letters’ అనే గ్రంథం ఈ ఘనతను సాధించింది. ఇందులో ఆయన విదేశాలు, యాత్రలు, సాహసాలు, స్త్రీలు, జైలు, జీవితం, ప్రజలు, అలవాట్లు వంటి ఎన్నో అంశాలను ఉత్తరాల రూపంలో వ్యక్తీకరించారు.

                ఇక, ఈప్రక్రియలో పూర్తి స్థాయి నవల, Aphra Behn రాసిన Love-Letters Between a Nobleman and His Sister అని చెప్పాలి. ఈ నవల మూడు భాగాలుగా 1684, 1685, 1687 సంవత్సరాలలో వెలువడి సంచలనం సృష్టించింది. కాగా 18వ శతాబ్దం నాటికి ఈ సాహితీ ప్రక్రియ అమిత ప్రజాదరణ పొందింది. దీనికి Samuel Richardson రాసిన Pamela (1740), Clarissa (1749) నవలలు ఎంతగానో దోహదపడ్డాయి. ఇందులో Pamela నవల ఇతివృత్తం అంతా - Mr. B అనే యజమాని దగ్గర పనికి కుదిరిన పమేలా తన పేద తల్లిదండ్రులకు రాసే ఉత్తరాల పరంపరగానే ఉంటుంది .

                అయితే ప్రఖ్యాత రాజనీతిజ్ఞులు, ‘అధికార పృథక్కరణ సిద్ధాంతం’ (Theory of separation of Powers) ను ప్రతిపాదించిన Montesquieu 1721 లో Letters Persian  పేరుతో ఫ్రెంచ్‌లోఉత్తరాల రూపంలో గ్రంధాన్ని రాయడం విశేషం. అలాగే, ప్రముఖ ప్రకృతి వాద తత్త్వవేత్త (Naturalism) సామాజిక ఒడంబడిక సిద్ధాంతకర్త (Social Contract Theory) Jean-Jacques Rousseau కూడా Julie, or the New Heloise పేరుతో 1761లోరాసాడు. ప్రముఖ జర్మన్ తత్వవేత్త - సాహితీకారుడు  Johann Wolfgang Von Goethe కూడా 1769లో The Sorrows of Young Wert her అనే నవలను రాసాడు. ఇవన్నీలేఖాసాహిత్య కోవకు చెందినవే!

                18వ శతాబ్దం నాటికి ఈలేఖా సాహిత్య ప్రక్రియ ఎంత ఉధృతిని సాధించిందో అంతే విమర్శను కూడా ఎదుర్కొంది. ఆతర్వాత ఈప్రక్రియను చిన్న బుచ్చుతూ కొన్ని వ్యంగ్య రచనలు, ప్రహసనాలు కూడా వెలువడ్డాయి. అయితే ఈవ్యంగ్య రచనలను చేసిన వారు ప్రముఖ రచయితలు కావడం గమనార్హం!  Samuel Richardson రాసిన Pamela నవలకు కౌంటర్‌గా Shamela (1741) నవలను Henry Fielding, రాయగా, మరో ప్రముఖ సాహితీ వేత్త Oliver Goldsmith లండన్‌లో నివసించే చైనీయతత్వవేత్తగాథగా The Citizen of the World పేరుతో 1761లో ఒక నవలను రాసాడు. అలాగే ప్రఖ్యాత Pride and Prejudice నవలను రాసిన Jane Austen కూడా తన తొలినాళ్ళలో  Lady Susan పేరుతో 1794లో ఓ నవలను ఈ లేఖా సాహిత్య సంప్రదాయంలోనే  రాసింది.

                మరో ప్రఖ్యాత రచయిత, నాటకకర్త Honore de Balzac రాసిన Letters of Two Brides నవల విమర్శకులను సైతం ఆకట్టుకుంది. విద్యార్ధిదశలో స్నేహితులైన ఇద్దరు అమ్మాయిలు పాఠశాలను వదిలిన తర్వాత కాలంలో వారి జీవితంలో సంభవించిన మార్పులను ఉత్తరాల రూపంలో వెల్లడించిన ఈ నవల, సాహితీ ప్రస్థానంలో ఓ మైలురాయిలా నిలిచిపోయింది.

                ఈ లేఖా రచనా సంప్రదాయంలో వచ్చిన సాహిత్యంలో చెప్పుకోదగింది Frankenstein!  ప్రఖ్యాత కవి P.B. షెల్లీభార్య Mary Shelly 1818లో ఈ నవలను ఉత్తరాల రూపంలోనే రాసింది. ఈ నవలలోని మూడు ప్రధాన పాత్రల మధ్య జరిగే ఉత్తరాల ద్వారా మొత్తం కథ నడుస్తుంది.

                అలాగే, 1897లో Dracula నవలను Bram Stoker  రాసాడు. ప్రపంచ హారర్ సాహిత్య చరిత్రలో మైలురాయిగా నిలిచిన ఈ నవల అంతా ఉత్తరాల రూపంలోనే నడుస్తుంది. వీటికి తోడుగా పత్రికా కథనాలను, టెలి గ్రాములను, డాక్టర్, ఓడలప్రయాణపురికార్డులనుకూడాఉపయోగించారు.

                The Diary of a Young Girl పేరిట రెండో ప్రపంచ యుద్ధ కాలంలోని భయానక భీభత్స అనుభవాలను, వాటిపై స్పందనలను Anne Frank రాసింది.అయితే ఈ గ్రంధాన్నిఆమె లేఖలు, డైరీ రూపంలో రాయడం విశేషం!

                ప్రసిద్ధ రచయిత్రి Alice Walker 1982లో The Color Purple - నవలను ప్రచురించింది. ఇది Celie అనే ఓ నల్ల జాతి అమ్మాయి కథ. ఇందులో ఆమె తన కథను తన సోదరికి, దేవుడికి ఉత్తరాల రూపంలో చెప్తుంది.

                మరో ప్రఖ్యాత రచయిత్రి Virginia Woolf 1938 లో Three Guineas అనే వ్యాసాన్ని ఈ లేఖా సాహిత్య ప్రక్రియ లో రాసింది. ఇది ప్రపంచ స్త్రీవాద సాహితీ చరిత్ర లోనే గొప్ప రచనగా పేరు పొందింది. అలాగే 1748లోనే John Cleland రాసిన Funny Hill నవల సరస శృంగార నవలగా ప్రఖ్యాతి సాధించి, లేఖాసాహిత్యానికి ఉన్న పరిధిని విస్తృతపరిచింది. ఇందులో ఓ అనామక వ్యక్తికి తన మనసులోని భావాలను ఉత్తరాల పరంపరగా కథానాయకి రాస్తుంది.

                అలాగే Wilkie Collins తను రాసిన The Woman in White (1859), The Moonstone (1868) లో లేఖా సాహిత్య సంప్రదాయంలో డిటెక్టివ్  నవలలను సమర్ధవంతంగా రాసి, ఉత్తరాల ద్వారానే నేరపరిశోధనా క్రమాన్నిఆసక్తిదాయకంగా చెప్పగలిగాడు.

                ప్రఖ్యాత రష్యన్  రచయత Fyodor Dostoyevsky తన రచనా ప్రస్థానాన్ని ఈలేఖా సాహిత్య ప్రక్రియతోనే ప్రారంభించాడనేది అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు. 1846లో ఆయన రాసిన తొలి రచన Poor Folk రష్యా విప్లవ పూర్వ కాలం నాటి ఇద్దరు మిత్రుల కథగా, వారిద్దరి మధ్య జరిగే ఉత్తరాల రూపంలోనే నడుస్తుంది.

                ఇంకా Saul Bellow రాసిన Herzog (1964),  Endo Shusaku రాసిన Silence (1966), Stephen King రాసిన Carrie (1974), John Updike రాసిన ‘S’ (1988), Helen Fielding రాసిన Bridget Jones’s Diary (1996), Carolyn Hart రాసిన Last Day of Summer (1998), వంటివి ఈ లేఖా సాహిత్య పరంపరలో పేరెన్నికగన్న సమకాలీన రచనలుగా చెప్ప వచ్చు.

                అలాగే ప్రఖ్యాత భారతీయ రచయిత 2008లోప్రతిష్టాత్మక బుకర్ పురస్కార విజేత అయిన అరవింద్  అడిగా రాసిన The White Tiger కూడా ఈ కోవ లోనిదే కావడం ఇక్కడ ప్రస్తావనార్హంగా చెప్పాలి. ఈ నవల అంతా, ఒక భారతీయ రైతు చైనా ప్రధానికి రాసే ఉత్తరాల రూపంలో ఉంటుంది.



 మరి తెలుగు సంగతేంటి? :

                తెలుగు సాహిత్యంలో లేఖాసంప్రదాయపు ఛాయలు తరచి చూస్తే ప్రాచీన కావ్యాలలో కూడా కనిపిస్తాయి. వాటిలో ప్రముఖంగా ప్రస్తావించుకోదగినది- గజపతిరాజుకు అల్లసాని పెద్దన రాసినట్లుగా చెప్పుకునే పద్యలేఖ! దండయాత్రకు వచ్చిన రాజు ఈ పద్యలేఖతోవెనుదిరిగిపోయినట్లుగా ‘విజయనగరచరిత్ర’ అనేగ్రంథంలో ఉటంకించబడింది.

                అలాగే, రాయప్రోలు సుబ్బారావు రాసిన ‘స్నేహలతాదేవి లేఖ’ తెలుగు లేఖా సాహిత్యంలో పేరెన్నికగన్నది. ఇంటిని తాకట్టుపెట్టి కూతురు పెళ్ళి చేయాలనుకున్న తండ్రి స్థితికి చలించి, ఆకూతురు ఉత్తరంరాసి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ విషాదాంత రచనఅప్పట్లో వరకట్నంపై నిరసనగా నిలిచింది.

                ఇక గుర్రంజాషువా తన ‘గబ్బిలం’ ద్వారా లేఖా సంప్రదాయపు ప్రాధమిక రూపమైన సందేశ విధానాన్ని పాటించగా, ‘ఫిరదౌసి’ కావ్యంలో పూర్తిస్థాయి లేఖాసాహిత్య సృష్టిని చేశారు. మాట తప్పిన చక్రవర్తి ఘజనీ ప్రభువును ఉద్దేశించి కవి ఫిరదౌసి రాసిన కవితాలేఖ కరుణరసాత్మకంగా సాగి గుండెలను ఆర్ద్రంచేస్తుంది.

                అలాగే, తిరుపతి వేంకటకవులు 1910-14 మధ్యకాలంలోరాసిన ఉత్తరాలతో వేసిన ‘గీరతం’, అనుభూతి కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ రాసిన ‘సైనికుడిఉత్తరం’ కవిత (‘అమృతంకురిసినరాత్రి’ లోనిది), త్రిపురనేని గోపీచంద్ రాసిన నవల  ‘పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా’ ‘పోస్టు చెయ్యని ఉత్తరాలు’, పానుగంటి లక్ష్మీనరసింహారావు రాసిన ‘సాక్షి’ వ్యాసాలు (అందులోనూ ఆరోసంపుటిలోని లేఖలు), బోయి భీమన్నరాసిన ‘జానపదుని జాబులు’  తెలుగు సాహిత్యంలో లేఖా సంప్రదాయానికి పెట్టని కోటలుగా నిలిచాయి.

                ఇవే కాకుండా నవలల్లో కూడా లేఖా ప్రయోగాలు విస్తృత పాఠకాదరణను పొందాయి. వాటిలో యద్దనపూడి సులోచనారాణి రాసిన ‘ప్రేమలేఖలు’ నవల, మరో రచయిత రాసిన ‘ఉత్తరాయణం’ అనే హాస్య నవల ప్రముఖమైనవి. పాపులర్ నవలా రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన ‘దూరం’ నవల ఆసాంతం ఉత్తరాలతోనే నడిచి పాఠకులకు శిల్పపరంగా కొత్త అనుభూతి నిచ్చింది.

                ఇక, చలం రాసిన ‘ప్రేమలేఖలు’ అయితేతెలుగు లేఖా సాహిత్య ప్రస్థానంలో ఒక మేలుమలుపుగా నిలిచాయి. లేఖాప్రక్రియ ద్వారా ఎంత హృద్యమైన సాహిత్యాన్ని సృష్టించవచ్చో నిరూపించాయి. అలాగే మామిడి హరికృష్ణ 2012 అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవ వేడుక విశేషాలను ఓపాఠశాల విద్యార్ధి తన మేనమామకు ఉత్తరంరాసినట్లుగా అందించాడు. ఇది ఆంధ్రభూమి, ఆదివారం అనుబంధంలో కవర్‌స్టోరీగా ప్రచురితమైంది.

                ఈ పరంపరలోనే, నేటి ఇంటర్‌నెట్ యుగంలో అంతరించి పోయిందనుకుంటున్న లేఖా సాహిత్యపు అద్భుత సంప్రదాయాన్నిఈ తరానికి గుర్తుచేసి ఆత్మీయంగా అల్లుకున్న రచనలుగా ‘కొత్తప్రేమలేఖలు’, ' లెటర్స్ టు లవ్ " పుస్తకాలు మళ్ళీ ఒక్కసారి ఉత్తరాల తోటలోకి తొంగిచూసేలా చేసాయి.

                ఇంత గొప్ప సంప్రదాయం, చరిత్ర, సాహితీ ప్రస్థానాన్నిసాగించిన లేఖా సాహిత్యం, నేటితరంలో మళ్ళీ ఊపిరి పూసుకోవడానికి, పునరుజ్జీవితాన్ని సాధించి, మరికొంతకాలం కొనసాగడానికి, మరిన్ని రచనలు ఈతరహాలో రావడానికి ప్రేరణగా ఈ పుస్తకాలు నిలిచాయి. ఆర్ద్రంగా, ఆత్మీయంగా గాలి తెరల లోంచి తేలివచ్చి శ్రోతల / పాఠకుల హృదయాలను స్పృశించాయి!

 

లేఖ సాహిత్యంలో ఏమేం ఉంటాయి ?

           

         "కాదేదీ సాహిత్యానికనర్హం " అన్నట్టు మానవ జీవితాన్ని పరివేష్టించి ఉన్న ఏ అంశం పైన అయినా సాహిత్యాన్ని సృజించవచ్చు. అయితే ఆ జీవన పార్శ్వాన్ని అందంగా, మనోరంజకంగా అందించడానికి రచయితకు నైపుణ్యం అవసరం. అలాగే, లేఖా సాహిత్యం లో వస్తువు విషయం లో కూడా ఏ నిర్దిష్టత లేదు. ఏ వస్తువు, అంశంను అయినా లేఖ శైలిలోకి అందించవచ్చు. అయితే  ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో సృజించిన లేఖా సాహిత్యంపై ఆయా విశ్వ విద్యాలయాలు, సాహితీ పీఠాలు ఎన్నెన్నో పరిశోధనలను విస్తృత స్థాయిలో నిర్వహించాయి. ఈ పరిశోధనలను అనుసరించి, ఇప్పటి వరకు అంతర్జాతీయంగా వచ్చిన లేఖా సాహిత్యంలోని వస్తువు (Subject) ఆధారంగా లేఖలను ఎన్నెన్నో రకాలుగా అభివర్ణించారు. వాటిలో ముఖ్యమైనవి.

 

1.            ప్రకృతి లేఖలు : వ్యవసాయం, విత్తనం, చెట్టు, కాలం, పక్షులు,  వరదలు, గ్లోబల్ వార్మింగ్, పర్యావరణ వంటి ప్రాకృతిక అంశాలపై రాసిన లేఖలు.

2.            ఆరోగ్య లేఖలు : వైద్యం, పాలియేటివ్ కేర్ (మృత్యు అవసాన కాలపు సంరక్షణ), ఆయుర్వేదం, యునానీ, హోమియో, యోగ,  క్యాన్సర్, తలసీమియా వంటి ఆరోగ్య సంబంధ అంశాలపై రాసిన లేఖలు.

3.            కుటుంబ సంబంధాల లేఖలు : అమ్మచీర, అత్తాకోడలు, అమ్మ , వృద్ధాప్యం, నాన్న, పెళ్లి వంటి అంశాల ఆధారంగా కుటుంబ బంధాలపై రాసిన లేఖలు

4.            శాస్త్ర, సాంకేతికలేఖలు : ఆకాశవాణి, సినిమా, చంద్రయాన్, ఎలక్ర్టానిక్స్, జెనెటిక్స్, అణు పరిశోధన, అంతరిక్షం వంటి శాస్త్ర సాంకేతిక, వైజ్ఞానిక పరిణామాలపై రాసిన లేఖలు

5.            ప్రత్యేక దినాలపై లేఖలు : కొత్త సంవత్సరం, వినియోగదారులు (మార్చి 15), ప్రేమికులు (వాలెంటెన్ డే  ఫిబ్రవరి 14), కుటుంబం ( మే 15), పర్యావరణ ( జూన్ 5), స్నేహితులు (ఆగష్టు రెండో ఆదివారం) , రాజ్యాంగం (నవంబర్ 26) మొదలగు ప్రత్యేక దినోత్సవాలు పురస్క రించుకుని రాసిన లేఖలు.

6.            దేశభక్తి లేఖలు : సైనికులు, భారతమాత, త్రివిధ దళాలు వంటి అంశాలు దేశం, జాతీయతలో వాటి పాత్రపై రాసిన ఉత్తేజ పూర్వక లేఖలు.

7.            జీవన శైలి లేఖలు : చీరకట్టు (ప్యాషన్స్), సౌందర్యం, ప్రమాదాల నివారణ, డిప్రెషన్, సర్దుబాటు, అలవాట్లు, విజయ సాధన వంటి జీవనోత్సాహ శైలులపై రాసినలేఖలు.

8.            పండుగలపై లేఖలు : సంక్రాంతి, బోనాలు, బతుకమ్మ, వినాయక చవితి, క్రిస్మస్, రమ్ జాన్, బుద్ధ పౌర్ణిమ వంటి పండుగలు, వాటిలోని విశిష్టతలు, వాటిలో ఇమిడి వున్న సామాజిక, పర్యావరణ, మానవీయ ప్రయోజనాలపై రాసిన లేఖలు.

9.            మార్గదర్శులపై లేఖలు : గాంధీజీ 150వజయంతి, సమతామూర్తులు (అంబేద్కర్, జ్యోతిబాపూలే, జగ్జీవన్‌రామ్), కార్ల్ మార్క్స్, మార్టిన్ లూథర్ కింగ్, రవీంద్రనాథ్ టాగోర్, షేక్స్పియర్, కాళోజి, దాశరధి  జయంతుల సందర్భంగా వారి జీవన విశేషాలపై స్ఫూర్తిదాయకంగా రాసిన లేఖలు.

10.          భాషా సాహిత్యాల పై లేఖలు : మాతృ (అమ్మ)  భాష, కవిత్వం - కవి వంటిసాహిత్యసంబంధఅంశాలపైరాసినలేఖలు

11.        సామాజిక -రాజకీయ లేఖలు :   సమాజం, రాజ్యాంగం, బ్యాలెట్బాక్స్, పోలీస్వంటిఅంశాలపై, మానవ పరిణామ ప్రగతిలో వాటిసేవలపై రాసిన ఆలోచనాత్మక లేఖలు.

  12. మత , ఆధ్యాత్మిక, తాత్విక  లేఖలు:  ఆయా మత విశ్వాసాలు, పురాణ కథనాలు, ఐతిహాసిక గాధలు, బౌద్ధ జాతక కథలు, లౌకిక దృక్పథం వంటి అంశాలపై లేఖలు   

13. ప్రపంచ శాంతి- మానవీయ లేఖలు:  యుద్ధాలు, వినాశనాలు, వసుధైక కుటుంబం, వర్ణ వివక్ష రహిత ప్రపంచం, విశ్వ మానవ తత్త్వం,  మొదలైనవి.    

       

ప్రేమ లేఖల రూటే సెపరేటు :

          సాధారణంగా లేఖ సాహిత్యం ఆయా దేశ కాలాల సామాజిక, ఆర్ధిక రాజకీయ పరిస్థితులకు అనధికారిక డాక్యుమెంటేషన్ గా చరిత్ర రచనకు మరొక ఆధారంగా ఇప్పుడు సర్వత్రా ఆమోదాన్ని పొందింది. అయితే లేఖ సాహిత్యంలో, ప్రేమ లేఖా సాహిత్యం మరొక అడుగు ముందుకేసి, అంతర్జాతీయంగా ఆయా ప్రముఖ వ్యక్తుల వ్యక్తిగత జీవిత అంశాలను, ప్రపంచానికి తెలియని మరెన్నో కోణాలను వెల్లడి చేస్తున్నాయి. బ్రిటిష్ రాణులు,  నోబెల్ విజేతలు, చక్రవర్తులు, గతకాలపు దేశాధినేతలు వంటి ఎంతోమంది వ్యక్తిగత జీవితాలు ఆ కాలంలో వారు రాసిన వ్యక్తిగత ప్రేమలేఖలలో, వారిలోని విస్మృత కోణాలు లోకానికి ఆవిష్కృతం అవుతున్నాయి.

          అలా ప్రముఖులు వేర్వేరు సంధర్భాలలో రాసిన ప్రేమ లేఖలను చదివితే ప్రఖ్యాత Zen బోధకుడు Thich Nhat Hanh చెప్పినట్లు -

“A real love letter is made of insight, understanding, and compassion. Otherwise it’s not a love letter. A true love letter can produce a transformation in the other person, and therefore in the world. But before it produces a transformation in the other person, it has to produce a transformation within us. Some letters may take the whole of our lifetime to write.”  అనే మాటలకు రుజువులుగా అనిపిస్తాయి.

                అలాగే సాధారణంగా  ప్రేమలేఖలు’ రాసే విధానం అనుకోకుండానే Franz Kafka ఓ సందర్భంలో చెప్పినట్లు -

                ‘‘I answer one of your letters, then lie in bed in apparent calm, but my heart beats through my entire body and is conscious only of you. I belong to you; there is really no other way of expressing it, and that is not strong enough’’ అన్నమాటలను గుర్తుచేస్తాయి.

                అలా ఈ ‘ప్రేమలేఖలు’ వస్తువు పరంగానే కాక, శైలి (Presentation Style) లో కూడా కొత్త పుంతలు తొక్కాయనే చెప్పవచ్చు. సాధారణంగా ఉత్తరం రాసే శైలి సహృదయతని కలిగి ఉంటుంది. కానీ ‘ప్రేమలేఖలు’ సహృదయతతో పాటు విజ్ఞానాన్ని, వికాసాన్ని, విశ్లేషణను, వివరణలను కూడా అందించి తొలి అక్షరపు పలకరింపు నుండి చివరి ముగింపు వాక్యం దాకా ఒక సున్నిత ఆత్మీయతను అక్షరాలనిండా నింపుకుని పరిమళిస్తాయి.



వాక్యాల వెంట ప్రయాణం : 

                లేఖా సాహిత్యంలో పదాలను పొదిగిన తీరు, వాక్యాలను అల్లుకున్నవిధానం, విషయానికి విషయానికీ మధ్య సంభాషణా శైలి అంతా ఆయా రచయితలు  వేరువేరు రూపాలలో మన ఎదురుగా నిలబడి, మన చేయిపట్టుకుని వారి వెంట తీస్కెళ్ళినట్టుగా అనిపిస్తుంది.

                సాధారణంగా లేఖలన్నింటినీ ఒకేసారి ఏకబిగిన చదివినా, విడివిడిగా దఫదఫాలుగా చదివినా ఈ లేఖల అంతిమలక్ష్యం మనలోని మానవున్ని, మానవత్వాన్ని, మానవ తత్వ్తాన్ని స్పృశించినట్లుగానే అనిపిస్తాయి. ‘‘అక్షరం - సాహిత్యం ఏదైనా ఒక విస్తృత సామాజిక ప్రయోజనాన్ని కలిగి ఉండాలి. మనకు తెలీని మనలోని అంతరంగ మానవున్ని తట్టి లేపాలి. రేపటి సుందర సమాజ నిర్మాణానికి మనల్ని పురికొల్పాలి. ఒక్కమాటలో చెప్పాలంటే సాహిత్య సృష్టి ఏదైనా దాని అంతిమ లక్ష్యం మానవత్వ పునరుద్ఘాటనే “(Reaffirmation of humanity) కావాలి.." అనే మాటలకు నిలువెత్తు ఉదాహరణగా ఈ లేఖలు ఉంటాయి!

             అందుకే ఈ ‘లేఖలు’ - సమ్యక్ ఆలోచనకు, సంపూర్ణ ఆత్మీయతకు, సానుకూల ఆచరణకు వెలుగు దివిటీలు గాను, ఈ లేఖా సాహిత్యం తెలుగు సాహితీ లోకంలో ఓ దీపశిలగా నిలిచి గెలిచిందని తడుముకోకుండా చెప్పవచ్చు.

చివరగా... లేఖా సాహిత్యం... 

మనసులోని భావాలన్నిటినీ వాక్యాలుగా గుదిగుచ్చిన హృదయ హారం

అంతరంగం, ఆత్మీయతలను అక్షరాలుగా పేర్చిన ఆలోచనా ద్వారం

ఒకప్పుడు ప్రేమలేఖ... జీవితాంతం గుండెల్లో దాచుకునే నెమలీక

ఇప్పుడు ప్రేమలేఖ... అంతరించి, అవశేషంగా మిగిలిన జ్ఞాపిక...

అవి కేవలం రాశి పోసిన అక్షరాలు మాత్రమే కావు  - అవి ఆనాటి తరపు హృదయరేఖలు ! 

అందుకే లేఖలు ...

మనసు నుండి మనసు వల్ల, మనసు కోసం...

మనసుతో మనసు చేసే సంభాషణలు. 

వాటిని మనసు విప్పి విందాం...!

గుండె తడిని, మనసు అలజడిని, ఆలోచనల ఉరవడిని, సంఘర్షణల తాకిడిని...

అనుబంధాల జడిని నిక్షిప్తం చేసుకొన్న జీవన నిధులు. 

వాటిని  .. హృదయంతెరచిచూద్దాం.. !

ఈ లాక్ డౌన్ కాలంలో స్టోర్ రూమ్ ల నుంచి బయటపడ్డ పాత ఉత్తరాల ప్రేరణతో 

మళ్ళీ ఒకసారి మన ఆత్మీయులను లేఖలతో పలకరిద్దాం...!



--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

బాక్స్ -1

లేఖాసాహిత్యం ప్రత్యేకతలేంటి? :

                అన్ని లేఖలు లేఖలుగానే ఉంటాయి. కానీ కొన్ని మాత్రమే సాహిత్య ప్రతిపత్తిని, కావ్యగౌరవాన్నిపొందుతాయి. దానికి ఆ లేఖలో పొందుపరిచిన విషయాలు, ఉపయోగించిన భాష, పద సౌందర్యం, రాసిన విధానం, శైలి, అందులోని సామాజిక ప్రయోజనాత్మకత, విషయ వివరణలో కళాత్మకత, సౌందర్యదృష్టి (Aesthetics) వంటివన్నీ కలిసి కారణమవుతాయి. ఆ విధంగా లేఖాసాహిత్య విశిష్టతలను ఈ విధంగా చెప్పవచ్చు.

*             కథనంలో కాల్పనికతకు, వాస్తవికత (Realism)కు, కవితాత్మక అభివ్యక్తికి  సమాన ప్రాధాన్యత ఉంటుంది 

*             ఇందులో ఏకోన్ముఖ వివరణ కన్నా బహుముఖ వ్యక్తీకరణకు అవకాశం.

*             ఈ ప్రకియ వల్ల పాత్రల లోతైన మనోభావాలు, ఆలోచనలు పాఠకులకు అవగతం అవుతాయి.

*           రచయిత ఊహా శక్తి, సృజన స్థాయి, కాల్పనికత ఒక వైపు, వాటికోసం అల్లుకున్న పదాలు అన్నీ పాఠకులకు కొత్త అనుభూతిని ఇస్తాయి. 

*           వీటిలోని శైలి అంతా మనకు అత్యంత ఆప్తులైన వ్యక్తులు మనకు ఆత్మీయంగా చెప్తున్నట్లుగా ఉంటుంది. కనుక వీటి ద్వారా అన్ని రకాలభావోద్వేగాలను, నవ రసాల భావనలను హృదయాలకు హత్తుకునేలాగా అక్షరాలలోనే పండించవచ్చు. 

*             రచయిత స్వంత కల్పితాల కన్నా యధార్ధ సంఘటనలు, సందర్భాలతోనే పాఠకులకు సంధానం ఏర్పడుతుంది.

*             ఇందులోని శైలి-సంబోధనాత్మకంగా, సంభాషణాత్మకంగా ఉండటం వల్ల పాఠకుడు, శ్రోత మమేకమయ్యే అవకాశం ఎక్కువ.

*             దీనిలోని ఉటంకింపులు ఎంత సంభ్రమాశ్చర్యాలకు రసానందానికి గురిచేస్తాయో, అందించే సమాచారం, ఉదాహరించే ఉదంతాలు, గణాంకాలు కూడా అంతే జ్ఞానాన్నిఅందిస్తాయి.


---------------------------------------------------------------------------------------------------------------------------------------------------

 --------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

బాక్స్-2

భారతీయ సాహిత్యం - లేఖాసంప్రదాయం :

                ప్రాచీన అలంకారికులు భారతీయ సాహిత్యాన్ని మూడు రకాలుగా వర్ణిస్తారు.

1.            ప్రభుసమ్మితాలు

2.            కాంతాసమ్మితాలు

3.            మిత్రసమ్మితాలు

                అంటే సాహితీ సృజనకు ప్రేరకాలుగా, కారకాలుగా ఈ మూడు ఉంటాయని అంటారు. వీటిలో ‘మిత్ర సమ్మితాల’ కోవలోకి వచ్చేది ‘లేఖాసాహిత్యం’ అనిచెప్పవచ్చు.

                సాధారణంగా లేఖలు ఎవరు ఎవరికి రాసినా వాటిలో అంతర్లీనంగా ఉండే అంశం, రాసే విధానం అంతా మిత్రులతో సంభాషించినట్లుగా, ఇతరుల క్షేమాన్ని, మేలును ఆశించినట్లుగా ఉండటం సహజం. ఈసున్నితమైన మానవీయ కోణం మిగతా సాహిత్య ప్రక్రియలలో కన్నాలేఖల ద్వారా వెల్లడించే అవకాశం ఎక్కువగా ఉండటం వల్లనేనేమో,  ఇది ఒక ప్రత్యేక ‘రచనా సంప్రదాయం’గా ఎదిగింది.

                భారతీయ ఇతిహాసాలైన రామాయణం, మహాభారతాలలోని రాయబార ఘట్టాలన్నీమౌఖిక లేఖా సంప్రదాయంలోని తొలి రూపాలే అని చెప్పవచ్చు. అంగదుడు, హనుమంతుడు, సంజయుడు, శ్రీకృష్ణుడు చేసిన ప్రయత్నాలు దీనికి ఉదాహరణలు. కాగా, పూర్తిస్థాయిలో లేఖా సాహిత్యం మొదటగా మనకు సంస్కృతంలో రాసిన ‘సుహృల్లేఖ’ లో కనిపిస్తుంది. ఈపదానికి అర్థం ‘మిత్రునికో ఉత్తరం’ (An Epistle to a Friend,) ! దీనిని బౌద్ధ మహాముని ఆచార్య నాగార్జునుడు (క్రీ.శ. 50-120) రాసాడు. ఆనాటి శాతవాహన చక్రవర్తి శాతకర్ణిని ఉద్దేశించి బౌద్ధమతంలోని విశిష్టతలను, సామాజికావసరాన్ని వివరిస్తూ ఈ బృహత్ లేఖను ఆయన రాశాడు.

                అలాగే ‘సందేశకావ్యాలు’ కూడా లేఖా సాహిత్యం కోవ లోనివే అని చెప్పవచ్చు. కాళిదాసు రాసిన ‘మేఘదూతం’ దీనికి ఉదాహరణ. విరహంతో ఉన్న యక్షుడు తన ప్రేయసికి మేఘం ద్వారా సందేశాన్నిఅందించే లక్ష్యంతో రాసిన ఈ కావ్యం సాహితీ శిల్ప సంప్రదాయాలలో ఓ విశిష్ట ప్రయోగం అనే చెప్పాలి.

                ఇక ఆధునిక కాలంలో ప్రముఖవ్యక్తులు ఆయా సందర్భాలలో రాసిన ఉత్తరాలు సాహిత్య ప్రతిపత్తిని పొందే స్థాయిలో ఉండటం విశేషం. ఆలెక్కన లేఖా సంప్రదాయపు సాహిత్యం మనకు రెండు రూపాలలో కనిపిస్తుంది.

1.            కవులు, రచయితలు, మేధావులు, తాత్త్వికులు ఆయా సందర్భాలలో వారి ఆత్మీయులకు రాసిన లేఖలే ఆతర్వాత సాహిత్య స్థాయిని సంతరించుకోవడం.

2.            రచయితలు, సృజనకారులు ఐచ్ఛికంగానే తాము రాయాలనుకున్న కథను లేదా సృజనాత్మక రచనను లేఖా సంప్రదాయపు శిల్పం ద్వారా ఆవిష్కరించడం.

                ఈ విషయంలో స్వామి వివేకానందుడు (1863-1902), శరత్చంద్ర ఛటోపాధ్యాయ (1876 -1938), జవహర్‌లాల్ నెహ్రూ  (1889-1965) వంటి వారు రాసిన లేఖలు మొదటి కోవలోకి వస్తాయి. నెహ్రూ తన కూతురు ఇందిరా గాంధీకి రాసిన లేఖలు కేవలం వ్యక్తిగత క్షేమ సమాచారంగానే కాక, సాధికారిక విజ్ఞాన అంశాలుగా ప్రసిద్ధికెక్కి, వైయక్తికతను (Individuality) దాటిన సామాజికప్రయోజనాన్ని (Social Utility) సాధించాయి.

                అలాగే విశ్వకవి, నోబెల్ సాహిత్య పురస్కార గ్రహీత రవీంద్రనాధ్ టాగూర్‌కు, తన అభిమాని, అర్జెంటీనా దేశస్థురాలు  విక్టోరియా ఒకెంపోకు మధ్య జరిగిన ఉత్తరాలు, ప్రపంచ సాహిత్య చరిత్రలో సహృదయ స్పందనలుగా గుర్తింపు పొందాయి. ఆలేఖా బంధమే చివరికి ఠాగూర్‌ ‘పూరబి’ పేరుతో ప్రేమ కవితల సంకలనాన్ని రాయడానికి ప్రేరణగా నిలిచింది.  ఈ కావ్యాన్నిఆయన ఆమెకు అంకితం ఇవ్వడం కూడా ఈవాదనను బలపరుస్తోంది.

--------------------------------------------------------------------------------------------------------------------------------------------------

-----------------------------------------------------------------------------------------------------------------

బాక్స్- 3

కొత్త ప్రేమ లేఖలు :లెటర్స్ టు లవ్ " 

               ప్రముఖ కవయిత్రి, రేడియో అనౌన్సర్  శ్రీమతి అయినంపూడి శ్రీలక్ష్మి  రాసిన ‘కొత్తప్రేమలేఖలు’ పుస్తకం ఇటీవలి కాలం లో ఎన్నో రకాలుగా తెలుగు సాహితీలోకంలో కొత్తముద్రను వేసిందని చెప్పాలి. లిఖిత రూపంలోఉండాల్సిన లేఖలను మొదటగా ఆకాశ వాణిలో సంవత్సర కాలం పాటు ‘శ్రవణ’రూపంలోప్రసారం చేయడం , తర్వాత వాటికి పుస్తకంగా సంకలనంచేయడం ద్వారా ‘ముద్రణ’ రూపాన్నివ్వడం అపూర్వమైన విషయమే!ఈ పుస్తకంలో పొందుపరిచిన  51 ప్రేమ లేఖలు స్థూలంగా ఎన్నెన్నో సామాజిక, సాంస్కృతిక, సాహిత్య, ఆర్ధిక, జీవన శైలి సంబంధిత అంశాలపై విషయపరంగా, విశ్లేషణపరంగా, అంతకు ముందు తెల్సిన అంశాల కన్నా ఎన్నెన్నో తెలియని కోణాలను ఆవిష్కరించి ‘కొత్త’ అన్నపేరును సార్థకం చేసాయి. ఎంపిక చేసుకున్నఅంశాలు కూడా ఎంతో సమకాలీనతను, సామాజికతను కలిగి ఉండటమే కాక సాధారణంగా కనిపించే అంశాలలోని అసాధారణత్వాన్ని, అసామాన్యతత్వాన్ని సునిశితంగా, సాధికారికంగా, గణాంకాలు, చరిత్రతో మేళవించి మానవీయ కోణంలో అందించాయి. అందుకే గౌరవ గవర్నర్ శ్రీమతి తమిళ్ ఇసై సౌందర్య రాజన్ గారు రాజ్ భవన్ లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడమే కాక ఎంతగానో ప్రశంసించారు!

              అలాగే యువ రచయిత్రి కడలి సత్యనారాయణ రాసిన ప్రేమలేఖల సంకలనం - "లెటర్స్ టు లవ్ " ! 40 లేఖలు ఉన్న ఈ పుస్తకంలో ప్రేయసీ ప్రియుల మధ్య ఉండే జీవన పార్శ్వాలను సున్నితంగా వ్యక్తీకరించడమే కాక, న్యూ జెనరేషన్ యువత సమకాలీన ప్రపంచాన్ని, స్త్రీ పురుష సంబంధాలను అర్ధం చేసుకుంటున్న తీరును అద్దంలా చూపించింది. అయితే ఈ ప్రేమలేఖలన్నింటా , ఆమె పుస్తకం ప్రారంభం లోనే చెప్పినట్టు 'చలం ' శైలి, ప్రభావం సమకాలీన తరపు ఆలోచనలతో దర్శనమిస్తాయి. 

------------------------------------------------------------------------------------------------